పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం: ఆకట్టుకుంటోన్న ‘లక్ష్య’ టీజర్
టాలీవుడ్ లవర్ బాయ్ నాగశౌర్య మాంచి ఊపు మీద ఉన్నాడు. ఏ హీరోకూ సాధ్యం కాని రీతిలో వరుసగా సినిమాలను ప్రకటిస్తూ సత్తా చాటుతున్నాడు. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'ఊహలు గుసగుసలాడే' నుంచి చాలా తక్కువ సమయంలోనే ఇరవై సినిమాలను పూర్తి చేసుకున్నాడు. 'ఛలో' సినిమా నుంచి పంథాను మార్చుకున్న అతడు.. కథలను రాయడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఏకకాలంలో మూడు ప్రాజెక్టులను పట్టాలెక్కించేశాడు. అందులో 'లక్ష్య' ఒకటి.
ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఆర్చరీపై వస్తున్న మొట్టమొదటి చిత్రం 'లక్ష్య'. నాగశౌర్య హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను ధర్రేంద్ర సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థలతో పాటు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కేతికా శర్మ హీరోయిన్గా చేస్తోంది. నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఇందులో రెండు విభిన్నమైన గెటప్లలో దర్శనమిచ్చాడు హీరో. అందులో ఒకటి నేచురల్ లుక్ కాగా.. మరొకటి 8 ప్యాక్ గెటప్.

సీనియర్ హీరో జగపతిబాబు వాయిస్ ఓవర్తో ఇది ప్రారంభం అయింది. 'కొందరికి ఆట వల్ల గుర్తింపు వస్తుంది.. కొందరి వల్ల ఆటకే గుర్తింపు వస్తుంది' అనే డైలాగ్తో ప్రారంభమైన ఈ టీజర్.. ఆసక్తికరంగా సాగింది. అలాగే, 'పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం' అనే మరో డైలాగ్ ఆకట్టుకుంది. మొత్తంగా ఈ టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఇక, ఈ టీజర్లో కేతిక శర్మ ఒక్క సీన్లోనే కనిపించింది. అలాగే, చివర్లో జగపతిబాబు కూడా సీరియస్ మోడ్లో దర్శనిమిచ్చాడు. ఈ వీడియో మొత్తానికి బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











