నీరే మనకు జీవితం, కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలో ఒక అద్భుతం: నాగార్జున
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం శుక్రవారం(జూన్ 21) జరుగనుంది. ఈ ప్రాజెక్టును నేడు సీఎం కెసీఆర్ జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కింద 45,000 ఎకరాల ఆయకట్టు ఉంది. సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయడమే లక్ష్యంగా దీన్ని నిర్మించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు ఇదే.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా సినీ నటుడు, నిర్మాత అక్కినేని నాగార్జున స్పందించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా వ్యాఖ్యానించిన ఆయన 'ఇది మానవ ఇంజనీరింగ్ అద్భుతం' అంటూ ప్రశంసలు గుప్పించారు. కేటీఆర్, తెలంగాణ సీఎంఓను ట్యాగ్ చేస్తూ ఈ ట్వీట్ చేశారు.

నేడు(జూన్ 21) ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగార్జున మరో ట్వీట్ చేశారు. యోగా అనేది మనకు దేవుడి నుంచి వచ్చిన బహుమతిగా పేర్కొన్నారు. ఈ యోగా దినోత్సవాన్ని అందరం వేడుకలా జరుపుకుందామని పిలుపునిచ్చారు.
నాగార్జున సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మధుడు 2' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. చాలా రోజుల తర్వాత నాగార్జున నుంచి పూర్తి రొమాంటిక్ చిత్రం రాబోతోంది. ఇటీవల విడుదలైన టీజర్కు మంచి స్పందన వచ్చింది.
'మన్మధుడు-2' చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఎక్కువగా యూరప్లోనే జరుగింది. ఇందులో అక్కినేని కోడలు సమంత కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. లక్ష్మీ, వెన్నెల కిషోర్, రావు రమేష్, నాజర్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











