పద్మభూషణ్ అవార్డ్ .. నన్ను ఆ మాటలు అంటున్నారు , బాలయ్య షాకింగ్ కామెంట్స్
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ , నటరత్న నందమూరి తారక రామారావు వారసుడిగా తెలుగు తెరపై అడుగుపెట్టిన బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రాత్మక , సోషియో ఫాంటసీ, ఫిక్షన్ సినిమాల్లో నటించిన అరుదైన నటుడిగా బాలయ్య ఘనత వహించారు. భారతీయ చిత్ర పరిశ్రమలో దాదాపు 50 ఏళ్ల కెరీర్ను పూర్తి చేసుకున్న అతికొద్ది మంది నటుల్లో బాలకృష్ణ ఒకరు.
సినిమాలతో పాటు తండ్రి బాటలోనే రాజకీయాల్లో ప్రవేశించి హిందూపురం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తన తల్లి పేరిట నెలకొల్పిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్గా పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు. సినీ, రాజకీయ, సామాజిక రంగాలకు ఆయన చేస్తున్న సేవలకు గాను ఈ ఏడాది రిపబ్లిక్ డేను పురస్కరించుకుని భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది.

ఇంతటి ప్రతిష్టాత్మక పురస్కారం తమ అభిమాన హీరోకు రావడంతో నందమూరి అభిమానులు, సినీ , రాజకీయ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన బ్లాక్బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు 150 కోట్లకు పైగా వసూళ్లతో బయ్యర్లకు భారీ లాభాలను అందిస్తోంది ఈ చిత్రం. అలా ఒకే నెలలో రెండు సక్సెస్లో బాలకృష్ణ మంచి ఊపులో ఉన్నారు.
కాగా.. పద్మభూషణ్ అవార్డ్ పొందిన నేపథ్యంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో బాలకృష్ణకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనకెంతో ఇచ్చిన దేశానికి ఎంతో కొంత ఇవ్వాలని.. బిరుదల కోసం పనిచేయడం కాదన్నారు. తానెప్పుడూ ఆధ్యాత్మిక చింతనలో ఉంటానని, పూజలు ఎక్కువగా చేస్తుంటానని తెలిపారు. నాన్నగారి శత జయంతి వేడుకలు, ఆయన నటించిన మనదేశం 75 ఏళ్లు పూర్తి చేసుకోవడం, నేను ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు నిండటం, మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడం, నా నాలుగు సినిమాలు వరుసగా హిట్ కావడం సరిగ్గా ఇదే సమయంలో పద్మభూషణ్ పురస్కారం రావడం ఆనందంగా ఉందన్నారు.

కొందరు తనకు ఈ అవార్డు ఎప్పుడో వచ్చి ఉండాల్సిందని అంటున్నారని.. కానీ లేట్ కాలేదని , సరైన సమయంలోనే వచ్చిందని బాలయ్య పేర్కొన్నారు. తల్లిదండ్రులు దీవెనలు, కళామ్మతల్లి ఆశీస్సులతో తాను సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టానని బాలకృష్ణ చెప్పారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా మనకు నచ్చిన విధంగానే అడుగులు వేయాలని యువతకు బాలయ్య పిలుపునిచ్చారు. నాకు పద్మభూషణ్ రావడంపై అభిమానులు, తెలుగు ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారని.. వారి నుంచి అలాంటి అభిమానం పొందడం నా పూర్వజన్మ సుకృతం అన్నారు బాలయ్య.


Click it and Unblock the Notifications











