భార్య గురించి బాలకృష్ణ కామెంట్స్ వైరల్.. నన్ను అలా భరిస్తున్నది అంటూ
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న నందమూరి తారక రామారావు కుమారుడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు బాలకృష్ణ. క్లాస్, మాస్ ఏ రోలైనా సరే దబిడి దిబిడే అన్నట్లుగా ఉంటుదని బాలయ్య యాక్టింగ్. ఈ తరంలో సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక, సోషియో ఫాంటసీ, సైన్స్ ఫిక్సన్ ఇలా అన్ని రకాల జానర్స్లో నటించిన అరుదైన ఘనతను బాలకృష్ణ సొంతం చేసుకున్నారు. తాతమ్మకలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గతేడాదితో 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చిత్రంలో నటిస్తున్నారు బాలయ్య. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

హ్యాట్రిక్ ఎమ్మెల్యే బాలయ్య
నటుడిగానే కాకుండా తండ్రి బాటలోనే రాజకీయాల్లో అడుగుపెట్టారు బాలకృష్ణ. ఎన్టీఆర్ హయాం నుంచి తెలుగుదేశం పార్టీతో నడుస్తున్న బాలయ్య ఎన్నోసార్లు టీడీపీ తరపున ప్రచారం చేశారు. 2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం టీడీపీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన బాలయ్య.. 2019, 2024 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ అందుకున్నారు. బాలయ్యలో సామాజిక స్పృహ కూడా ఎక్కువే. తన తండ్రి స్థాపించిన బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్గా పేద వర్గాలకు తక్కువ ఫీజులకే చికిత్స అందిస్తున్నారు. ఆయన ఛైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాకా .. బసవ తారకం ఆసుపత్రి రూపు రేఖలు మారిపోయాయని అంటారు.
బాలయ్యకు పద్మభూషణ్ అవార్డ్ ప్రకటించిన కేంద్రం
నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు వారికి సేవలందిస్తున్న ఆయనకు భారత ప్రభుత్వం ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. దీంతో నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలయ్య .. పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. అవార్డు స్వీకరిస్తూ బాలకృష్ణ ఉద్వేగానికి గురయ్యారు. తమ శాసనసభ్యుడికి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇవ్వడంతో ఆయనను హిందూపురం నియోజకవర్గ ప్రజలు ఘనంగా సత్కరించారు.
సరైన సమయంలోనే పద్మభూషణ్
ఈ సందర్భంగా బాలకృష్ణ ప్రసంగిస్తూ .. హిందూపురం తన రెండో పుట్టినిల్లు అన్నారు. ఇది హిందూపురం కాదని నందమూరి పురమని ఆయన వ్యాఖ్యానించారు. పద్మభూషణ్ అవార్డ్ ఆలస్యంగా ఇచ్చారని చాలా మంది అన్నారని.. కానీ సరైన సమయంలోనే వచ్చిందని బాలకృష్ణ తెలిపారు. హీరోగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న టైంలో పద్మభూషణ్ పురస్కారం రావడం సంతోషంగా ఉందన్నారు. బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్, శ్రీరామరాజ్యంలో శ్రీరాముడిగా అవకాశం రావడం తన పూర్వ జన్మ సుకృతమని ఆయన వ్యాఖ్యానించారు.
వసుంధరకు భూదేవి అంత ఓర్పు
ఇదే వేదికపై తన సతీమణి, వసుంధరను ఆకాశానికెత్తేశారు బాలకృష్ణ. నా భార్య నన్ను భరిస్తుందని.. వసుంధర అంటే భూదేవి అన్నారు. తాను వేసిన ప్రతి అడుగులోనూ తనకు అండగా నిలిచిన వసుంధరకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా బాలయ్య గతంలో మహిళలపై చేసిన వ్యాఖ్యలను కొందరు ట్రోల్ చేస్తున్నారు. దీంతో నందమూరి అభిమానులు వారికి ఘాటుగా బదులిస్తున్నారు.


Click it and Unblock the Notifications











