థియేటర్లకు తాళాలు వేస్తున్నారు.. ఎగ్జిబిటర్ల సమస్యలపై బాలయ్య ఫస్ట్ రియాక్షన్
తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు మధ్య మరోసారి పర్సెంటేజ్ విధానంపై మరోసారి వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. శనివారం తెలుగు ఫిలిం ఛాంబర్లో సమావేశమైన ఎగ్జిబిటర్లు.. పెద్ది సినిమా నుంచే పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవల్పమెంట్ కార్పొరేషన్ (ఎస్ఎఫ్టీవీటీడీసీ) కొత్త కమిటీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేసింది. ఛైర్మన్, వైస్ ఛైర్మన్, డైరెక్టర్లు, సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ది కోసం ఆంధ్రప్రదేశ్లోనూ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ను ఏర్పాటు చేశాం. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కందుల దుర్గేష్, నేను కలిసి రాష్ట్రంలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై చర్యలు తీసుకుంటున్నాం. మద్రాస్ రాష్ట్రంలో అయినా, ఉమ్మడి రాష్ట్రంలో అయినా, నవ్యాంధ్రలో అయినా సినీరంగానికి విజయవాడ రాజధానిగా భాసిల్లుతోంది. తెలుగు సినీరంగానికి 60 నుంచి 70 శాతం కలెక్షన్స్ ఆంధ్ర రాష్ట్రం నుంచే వెళ్తోంది. చలన చిత్ర పరిశ్రమను ఇక్కడ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అని బాలయ్య అన్నారు.

విజయవాడ, విశాఖ, రాజమండ్రిలలో నా సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయి. అఖండ సినిమాని రంపచోడవరంలో చిత్రీకరించాం. మంచి వాతావరణం, ప్రజల సహయ సహకారాలతో షూటింగ్ నిరాటంకంగా జరిగేలా చూసుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండమైన లోకేషన్స్ వున్నాయి. విజయవాడ కృష్ణానదీ తీరం, విశాఖ సముద్ర తీరం, అరకు లోయలు ఉన్నాయి. చలన చిత్ర పరిశ్రమను ఇక్కడ కూడా అభివృద్ది చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని నందమూరి బాలకృష్ణ తెలిపారు.
షూటింగ్స్ నిరాటంకంగా జరగడానికి ఒక సింగిల్ విండో ఏర్పాటు చేయాలి. పర్మిషన్స్తో పాటు పోలీస్ ప్రొటెక్షన్, రాయితీలు వంటివి ఒకేచోట లభించేలా చూడటానికి మేమందరం కూర్చొని కార్యాచరణ రూపొందిస్తున్నాం. త్వరలోనే దానిని మీకు తెలియజేస్తాం. ఎన్టీఆర్ పుట్టిన గడ్డ నుంచి ఎఫ్డీసీ కార్యాచరణను ప్రారంభించడం, అన్ని రంగాలకు చెందిన వారిని ఎంపిక చేసి మంచి కమిటీని రూపొందించడం ఆనందంగా ఉంది. షూటింగ్స్ లేక, పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని బాలయ్య పేర్కొన్నారు.
సినిమా కూడా మనిషి జీవితంలో భాగమైపోయింది. సినిమా ఎలా ఉందని ఆలోచించాల్సిందిపోయి.. సినిమాను బతికించాల్సిన పరిస్ధితిలో ఇవాళ చలన చిత్ర పరిశ్రమ ఉంది. అందరం ఎక్కువ సినిమాలు చేయాలి, సంఖ్యాపరంగానే కాదు మంచి సినిమాలు చేయాలి. టెక్నాలజీ లేనప్పుడు ఎంతో వేగంగా సినిమాలు పూర్తి చేసేవారు. ఇవాళ టెక్నిక్ పెరిగిపోయినా సినిమాలు చాలా ఆలస్యంగా పూర్తి చేస్తున్నారు. ఇవాళ థియేటర్లు, ఎగ్జిబిటర్స్ని చూస్తే బాధగా ఉంటోంది. కొందరు థియేటర్లకు తాళాలు వేసుకునే పరిస్ధితి వచ్చింది. పంపిణీదారులు కూడా అదే పరిస్ధితుల్లో ఉన్నారు అని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
చలనచిత్ర పరిశ్రమను ఆంధ్ర రాష్ట్రంలో ఆదుకోవడానికి ఏపీ ప్రభుత్వం కొత్త ప్రణాళికలతో ముందుకు వస్తోంది. అలాగే తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.. ఉభయ రాష్ట్రాలు కూడా కలిసిరావాలి. తెలుగు చలనచిత్ర పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, నంది పురస్కారాలు, వివిధ పురస్కారాలు ఇవ్వాల్సిన బాధ్యత ఏపీ పర్యాటక, సినిమాటోగ్రఫి శాఖపై ఉంది. ఎక్కువ సినిమాలు తీయాలి, థియేటర్లకు సినిమాను అందించాలి, ప్రేక్షకులకు సినిమాని అందించాలి, ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లాలి అని బాలకృష్ణ ఆకాంక్షించారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో పర్సంటేజ్ విధానంపై నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు మధ్య వివాదం నేపథ్యంలో బాలయ్య వ్యాఖ్యలు టాలీవుడ్లో చర్చనీయాంశమయ్యాయి.


Click it and Unblock the Notifications



