ఎప్పుడూ గొంతు ఎత్తలేదు.. ఇకపై నా కూతుళ్ల కోసం మాట్లాడాల్సిందే, తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్,
అన్న నందమూరి తారక రామారావు మనవడు , హీరో తారకరత్న కన్నుమూసి అప్పుడే ఏడాది గడిచిపోయిందంటే నమ్మకం కలగడం లేదు. కుప్పంలో జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురైన తారకరత్న బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023 ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. ఎంతో భవిష్యత్తు ఉన్న తారకరత్న చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో చిత్ర పరిశ్రమ, అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుని కొన్నేళ్లపాటు కుటుంబాలకు దూరంగా ఉన్నారు తారకరత్న అతని భార్య అలేఖ్య రెడ్డి. పరిస్ధితులు కుదుటపడి ఇప్పుడిప్పుడే రాకపోకలు ప్రారంభమైన దశలో ఆయన మరణం ఆమెకు షాక్కు గురిచేసింది. తారకరత్న హఠాన్మరణంతో భార్యా పిల్లలు దిక్కులేనివారు అయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలు వీరి బాధ్యతను తీసుకున్నారని ఫిలింనగర్ టాక్.

అలేఖ్య మాత్రం భర్తతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ కుమిలిపోతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తారకరత్న ఫోటోలు, వీడియోలు, ఎమోషనల్ పోస్టులను పెడుతుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న తారకరత్న తొలి వర్ధంతి కావడంతో అలేఖ్య ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, నందమూరి అభిమానులు తారకరత్నకు నివాళులర్పించారు. ఇటీవల అలేఖ్య రెడ్డి తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆమెతో దగ్గరుండి కేక్ కట్ చేయించారు.
కాగా.. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ హత్యాచారానికి గురైన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ తర్వాతి రోజు శవమై తేలింది. ఈ ఘటనకు సంబంధించి కోల్కతా పోలీస్ సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ కేసును విచారించేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది బెంగాల్ ప్రభుత్వం.
కోల్కతా హత్యాచార ఘటనపై వైద్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి అలేఖ్య రెడ్డి సైతం తన ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇప్పటి వరకు తన కోసం తాను నిలబడటానికి ప్రయత్నించలేదని.. నా హక్కుల కోసం పోరాడలేదు.. కానీ నా కుమార్తెల రేపటి భవిష్యత్తు కోసం ఈరోజు గళం విప్పుతున్నానని పేర్కొన్నారు. మహిళలపై జరిగే ఈ అఘాయిత్యాలను ఎట్టి పరిస్ధితుల్లోనూ సహించకూడదని.. అత్యాచారానికి పాల్పడిన వారికి ఉరిశిక్ష విధించాలని చట్టం చెబుతోందని, కనీసం అలాంటి వాటి గురించైనా మాట్లాడాలి.. నేను ఆ పని చేస్తున్నా, మరి మీరు అంటూ అలేఖ్య రెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











