అన్నీ నీతోనే వెళ్లిపోయాయి.. ఊపిరి కూడా భారంగా.. తారకరత్న భార్య ఎమోషనల్
అన్న నందమూరి తారక రామారావు వంశంలో మూడో తరం నటుడిగా ఎంట్రీ ఇచ్చారు ఆయన మనవడు తారకరత్న. ఎన్టీఆర్ కుమారుడు మోహనకృష్ణ తనయుడే తారకరత్న. భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ నటుడికి జరగని విధంగా ఆయన ఎంట్రీ జరిగింది. హీరోగా ఒకే రోజున 9 చిత్రాలను మొదలుపెట్టిన ఘనత తారకరత్నదే. ఎన్నో అంచనాల మధ్య తారకరత్న తెరంగేట్రం జరగ్గా.. వాటిని ఆయన అందుకోలేకపోయారు. ఒకటి రెండు సినిమాలు మినహా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. కెరీర్లో నిలదొక్కుకుంటున్న దశలో తారకరత్న చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు తరలిపోయారు.
ఒకటో నెంబర్ కుర్రాడుతో ఎంట్రీ
2002లో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు నందమూరి తారకరత్న. ఒకే రోజున తొమ్మిది చిత్రాలకు ప్రారంభోత్సవాలు జరుపుకోగా.. వాటిలో ఒకటో నెంబర్ కుర్రాడు, తారక్, భద్రాద్రి రాముడు, నో, యువరత్న వంటి సినిమాలు మాత్రమే విడుదల కాగా.. కొన్ని మధ్యలోనే ఆగిపోవడంతో ఆయన కెరీర్ పడుతూ లేస్తూ సాగింది

20 ఏళ్ల కెరీర్
20 ఏళ్ల కెరీర్లో 21 సినిమాల్లో హీరోగా నటించిన తారకరత్న.. పలు సినిమాల్లో ప్రతినాయకుడిగానూ మెప్పించారు. 2009లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అమరావతి చిత్రానికి గాను బెస్ట్ విలన్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డ్ అందుకున్నారు. 2022లో 9 హావర్స్ అనే వెబ్ సిరీస్లో పోలీస్ ఆఫీసర్గా ఆకట్టుకున్నారు. చివరిగా సారథి అనే సినిమాలో తారకరత్న కనిపించారు. అయితే ఆ సినిమా రిలీజ్ కాకుండానే ఆయన కన్నుమూయడంతో అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
గుండెపోటుతో కన్నుమూసిన తారకరత్న
సినిమాలలో సంతృప్తికర జీవితాన్ని చూసిన తారకరత్న.. రాజకీయాలలో సత్తా చాటాలని అనుకున్నారు. తన తాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఈ క్రమంలోనే 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నారా లోకేష్ చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తారకరత్న గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను తొలుత కుప్పం ఆసుపత్రికి అక్కడి నుంచి బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు తారకరత్నను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన 2023 ఫిబ్రవరి 18న శివరాత్రి రోజున శివైక్యం చెందారు .
తారకరత్నకు నివాళి
ఆయన మరణించి రెండేళ్లు గడుస్తున్నాయంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఇప్పటికీ తారకరత్న తమ మధ్య ఉన్నాడని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇష్టపడి, పెద్దలను ఎదిరించి మరి పెళ్లి చేసుకున్న భార్య అలేఖ్య, పిల్లలు తారకరత్న మరణంతో దిక్కులేని వాళ్లు అయ్యారు. భర్త జ్ఞాపకాలు, ఆయనతో గడిపిన క్షణాలను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు. తాజాగా మహాలయ అమావాస్య సందర్భంగా నందమూరి తారకరత్నకు ఆమె శాస్త్రోక్తంగా నివాళుర్పించారు. ఈ సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్లో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్
నా గుండెల్లో భరించలేని బాధ ఉంది.. అది ఎన్నటికీ మానిపోదు, నీతో పాటే అన్నీ వెళ్లిపోయాయి. నా మనసుకు బాధ కలిగించే సమయంలో నీ గురించి రాయడానికి ప్రయాణిస్తున్నా.. రోజులు గడిచేకొద్ది నిన్ను ఇంకా మిస్ అవుతున్నా. ఊపిరి పీల్చుకోవడం కూడా బరువుగానే ఉంది. అయినా నేను ఎన్నటికీ ఆశను వదులుకోను.. ఎందుకంటే నీ గుండె చప్పుడు ఇప్పటికీ నా కోసం వచ్చే చిన్ని చేతులతో బతికే ఉంది.. అది ఎన్నటికీ నిన్ను గుర్తుచేస్తుందని అలేఖ్య రెడ్డి రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











