Jani Master Case: జానీ మాస్టర్ కేసులో ట్విస్టు.. నార్సింగి పోలీసులు అలా రంగంలోకి!
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై అత్యాచారం చేసిన కేసులో టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. జానీ వ్యవహారం తెలుగు చిత్ర సీమలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ ఇష్యూపై స్పందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని మహిళా నటులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ కేసులో ఆదివారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..
తనపై లైంగిక వేధింపులు, పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. చివరికి గోవాలోని ఓ లాడ్జిలో జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు ఆయనను హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ను హాజరుపరచగా.. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో జానీని పోలీసులు చంచల్గూడ సెంట్రల్ జైలుకు తరలించారు.

జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడినట్లుగా ఆరోపిస్తున్న యువతి వయసు ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆమె మైనర్గా ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్ వేధిస్తున్నట్లుగా ఆరోపణలు రావడంతో ఆయన భార్య ఆయేషా సుమలత స్పందించారు. అసలు ఆ అమ్మాయి మేజర్గా ఉన్నప్పుడే ఇండస్ట్రీలో అడుగుపెట్టిందని , ఢీ జోడీ డ్యాన్స్ షోలో అసలు మైనర్లని చేర్చుకోరని చెప్పారు. లేదంటే మైనర్గా ఉండి ఆమె నకిలీ ధ్రువపత్రాలతో షోలోకి వచ్చిందా అని సుమలత ప్రశ్నించారు.
అమ్మాయిలు చెప్పుకున్నట్లుగా అబ్బాయిలు చెప్పుకోరని.. ఆమె మానసికంగా చాలా ఇబ్బంది పెట్టిందని, అయినా జానీ మాస్టర్ బయటికి చెప్పలేదని సుమలత అన్నారు. బాధితురాలిని మతం మార్చేలా ఇబ్బంది పెట్టారన్న వార్తలపైనా ఆమె స్పందించారు. ఆమెను అలా ఎవరూ బలవంత పెట్టలేదని.. తానే మా మతం ఆచారాలు బాగున్నాయని చెప్పి, మతం మారిందన్నారు.
ఆమెకు జానీ మాస్టరే డ్యాన్స్ కార్డ్ ఇప్పించారని, హీరోయిన్ కావాలనే లక్ష్యంతోనే ఆమె మాస్టర్ను వాడుకుందని సుమలత ఆరోపించారు. ఇది తప్పుడు కేసని, జానీ మాస్టర్ను కావాలనే ఇరికించారని, ఆమె వెనుక ఎవరో ఉండి ఈ కేసు పెట్టించారని ఆయేషా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న జానీ మాస్టర్ను కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. దీనిలో భాగంగా జానీ మాస్టర్ను వారం రోజులు కస్టడీకి అప్పగించాల్సిందిగా నార్సింగి పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే జానీపై పోక్సో కేసు నమోదు కావడంతో .. రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టుకు ఈ పిటిషన్ను బదిలీ చేశారు న్యాయమూర్తి. నేడో, రేపో ఈ కస్టడీ పిటిషన్ పోక్సో కోర్టులో విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బెయిల్ కోసం జానీ మాస్టర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు జానీ మాస్టర్ తరపు న్యాయవాదులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఈ కేసు ఎటు వైపు మలుపు తిరుగుతుందోనని టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











