‘మెగా హీరోల సినిమాలపై కుట్ర.. పెద్ది వివాదం వెనుక దిల్ రాజు హస్తం’
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన మూవీ పెద్ది. జూన్ 4న ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది. నిన్న మొన్నటి వరకు పర్సెంటేజ్ విధానం కారణంగా సినిమా రిలీజ్పై నీలినీడలు కమ్ముకున్నాయి. పెద్ది సినిమా నుంచే తమకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని రెండు రాష్ట్రాలకు చెందిన ఎగ్జిబటర్లు తేల్చిచెప్పారు. అయితే మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించారు. అయితే పెద్ది రిలీజ్ను అడ్డుకోవడానికి కుట్ర జరుగుతోందంటూ ప్రముఖ నిర్మాత నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
సినీరంగంలో సమస్యలు, ఇబ్బందులపై గళమెత్తే ప్రముఖ నిర్మాత నట్టికుమార్ మంగళవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. టాలీవుడ్లో స్టార్ ప్రొడ్యూసర్లుగా ఉన్న దిల్రాజు, శిరీష్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి సహా మెగా కుటుంబానికి చెందిన హీరోలు నటించిన సినిమాల రిలీజ్లను అడ్డుకోవాలని దిల్రాజు, శిరీష్ ప్రయత్నిస్తున్నారు. గతంలో మన శంకర వరప్రసాద్ గారు మూవీని నగరానికి చెందిన గాయత్రీ దేవి ఫిలిమ్స్ అధినేత బత్తుల సత్యనారాయణ వైజాగ్ సతీశ్ ద్వారా విశాఖ, ఉత్తరాంధ్ర ఏరియాలలో రిలీజ్ కాకుండా యత్నించారు.

మన శంకర వరప్రసాద్ గారు మూవీ విశాఖ రైట్స్ కోసం మాకు గుడ్ విల్ ఇస్తానని చెప్పడంతో నేను, మురళీకృష్ణ మరికొందరు మిత్రులం సిండికేట్గా ఏర్పడి 5.75 కోట్ల రూపాయల మొత్తాన్ని వైజాగ్ సతీశ్కు ఇచ్చాం. శంకర వరప్రసాద్ గారితో పాటు బాలయ్య నటించిన అఖండ 2కు కూడా ఇలాగే సతీశ్కు డబ్బులు ఇచ్చాం. కానీ అతను వాటిని మాకు తిరిగి ఇవ్వలేదు. శంకర వరప్రసాద్ హక్కులను 15.60 కోట్ల రూపాయలకు సతీశ్ దక్కించుకున్నాడు. అయితే కేవలం 3.23 కోట్ల రూపాయలు మాత్రమే నిర్మాతలకు చెల్లించి.. మిగిలిన మొత్తం చెల్లించకుండా సరిగ్గా రిలీజ్కు ముందు సైడ్ అయిపోయాడు.
మెగాస్టార్ చిరంజీవి సినిమా విశాఖలో విడుదల కాకుండా ఆగిపోతుందని భయంతో నేను, మురళీ కృష్ణ కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ సాయంతో మన శంకర వరప్రసాద్ గారు రిలీజ్కి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకున్నాం. చిరంజీవి గారి సినిమాని ఆపడానికి కుట్ర జరిగింది అనడానికి దిల్రాజు, శిరీష్, వైజాగ్ సతీష్ల మధ్య జరిగిన ఆడియో సంభాషణే సాక్ష్యం. ఇటీవల రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ రిలీజ్ విషయంలో తెలంగాణలో చెలరేగిన వివాదం వెనుక దిల్రాజు హస్తం ఉంది. తెలంగాణతో పాటు విశాఖ, ఉత్తరాంధ్ర ఏరియాలలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థపై పెత్తనం చెలాయించాలని దిల్రాజు, శిరీష్ యత్నిస్తున్నారు.
మా డబ్బు మాకు తిరిగి ఇవ్వకుండా మాపైనే సతీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల ఎదుట మేమే ఈ విషయాన్ని ఆధారాలతో బయటపెడతాం. సతీశ్ వ్యాపారం కోసం నేనే హామీగా ఉండి డబ్బులు ఇప్పించా.. కానీ నాలాగే ఎంతోమంది దగ్గర దాదాపు 28 కోట్ల రూపాయలు తీసుకుని తప్పించుకుని తిరుగుతున్నాడు. ఉదయం లేస్తే వీళ్లంతా బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు. దీనిని అరికట్టకపోతే ఇంకా ఇంకా మొదలుపెడతారు. దానికి దిల్రాజు గారు సపోర్ట్ చేస్తూ.. డబ్బులు ఆపడం, సినిమాలు మీకే రావాలి అనేది తప్పు. సినీరంగంలోకి కొత్త నీరు రావాలి, ఎవరైనా కొనుక్కోవచ్చు, ఎవరైనా అమ్ముకోవచ్చు. తెలంగాణ ఎగ్జిబిటర్లను భయపెట్టిస్తున్నారు, ఇక్కడ కూడా ఎగ్జిబిటర్లను బయటపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
దిల్రాజు గారు, శిరీష్గారి మాయలో ఎగ్జిబిటర్లు పడొద్దు.. థియేటర్లు లీజుకు ఇవ్వండి, ఏమైనా చేసుకోండి. కానీ ఆ రూపాయి డబ్బులు ఓనర్కి వెళ్లకుండా, డిస్ట్రిబ్యూటర్కు వెళ్లకుండా, నిర్మాతకు వెళ్లకుండా మధ్యలో వాళ్లు తినడం అనేది కరెక్ట్ కాదు. లీజ్ ఓనర్లే ఈ డబ్బంతా తింటుంటే నిజమైన ఎగ్జిబిటర్లకు డబ్బు వెళ్తుందా? నిజమైన డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి ఏంటీ? అని నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సినీ రంగంలో హాట్ టాపిక్గా మారాయి. మరి ఆయన ఆరోపణలపై దిల్రాజు, శిరీష్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం పర్సెంటేజ్ విధానంపై ఎగ్జిబిటర్లు గొడవకు దిగినప్పుడు కూడా నట్టికుమార్ తీవ్రంగా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. పెద్ది సినిమాను ఆపాలని చూస్తే హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్ ముందు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. అయితే ఈ లోపే చిరంజీవి రంగంలోకి దిగి ఎగ్జిబిటర్లు, నిర్మాతలను తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడటంతో వివాదానికి తెరపడింది. ఇప్పుడు తాజాగా దిల్రాజు ఆయన సోదరుడు శిరీష్పై నట్టికుమార్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.


Click it and Unblock the Notifications



