ఆయన పిలుపు కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా.. నిహారిక కొణిదెల ఎమోషనల్
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు నిహారిక కొణిదెల. నటిగా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో నిర్మాతగా స్థిరపడ్డారు మెగా డాటర్. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకుని తన కాళ్లపై తను నిలబడ్డారు. నిర్మాతగా వరుస హిట్స్తో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు. పించ్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై ప్రస్తుతం సినిమాల నిర్మాణంలో ఆమె బిజీగా ఉన్నారు. తాజాగా సోషల్ మీడియాలో నిహారిక కొణిదెల పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
2015లో ఈటీవీలో ప్రసారమైన ఢీ జూనియర్స్ ప్రోగ్రామ్కు హోస్ట్గా కెరీర్ ప్రారంభించారు నిహారిక కొణిదెల. అనంతరం హీరోయిన్గా టర్న్ అయిన మెగా డాటర్.. నాగశౌర్య హీరోగా వచ్చిన ఒక మనసు సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. అయితే ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికీ నిరాశపడకుండా తన లక్ష్యం దిశగా అడుగులు వేశారు. హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నర్సింహారెడ్డి, డార్లింగ్, చిత్రాలలో నటించారు. అప్పటికే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ను స్థాపించిన నిహారిక ముద్దపప్పు అవకాయ్, నాన్న కూచీ, మ్యాడ్ హౌస్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హాలో వరల్డ్, బెంచ్ లైఫ్ అనే వెబ్ సిరీస్లను నిర్మించారు.

చైతన్య జొన్నలగడ్డతో వివాహం, విడాకులు కారణంగా కొన్నాళ్లు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న నిహారిక.. తర్వాత నిర్మాతగా స్థిరపడాలని కలలు కన్నారు. అనుకున్న విధంగానే కమిటీ కుర్రోళ్లు మూవీతో కొత్తవాళ్లకు అవకాశం కల్పించి హిట్ అందుకున్నారు. ఇక ఈ ఏడాది రాకాసతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నిహారిక. ప్రస్తుతం తన సోదరుడు వరుణ్ తేజ్ హీరోగా బరి అనే సినిమాను నిర్మిస్తున్నారు మెగా డాటర్. తెలుగు చిత్ర పరిశ్రమలోని టాప్ స్టార్స్తో సినిమాలు నిర్మించాలని ఉందని నిహారిక పలుమార్లు తన మనసులోని బయటపెట్టారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉండే నిహారిక కొణిదెల.. తన సినిమాలు, షూటింగ్స్, కుటుంబం, ఇతర వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. తీరిక వేళల్లో ఫ్రెండ్స్తో కలిసి విహారయాత్రలకు, ఆలయాలకు వెళ్తుంటారు ఈ ముద్దుగుమ్మ. తాజాగా కాశీ క్షేత్రానికి వెళ్లిన నిహారిక షేర్ చేసిన ఫోటోలు, ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతున్నాయి.
రెండేళ్లుగా నేను కాశీలో అడుగుపెట్టడం కోసం పరితపించిపోయాను. కొన్నిసార్లు ప్లాన్ చేసినా వాయిదా వేశా, జీవితం అలా సాగిపోతుండగా.. ఒకరోజున కాశీలో పూజలందుకున్న రుద్రాక్షతో నా పొరుగింటి వారు తలుపు తట్టారు. వారు ఇచ్చింది చిన్న కానుకే.. కానీ నా మనసు మాటల్లో చెప్పలేని విషయాన్ని గ్రహించింది. మహాదేవుడిని చూడటానికి నేను వేచి లేను.. ఆయన నన్ను పిలవడానికి వెయిట్ చేస్తున్నాడు. ఎట్టకేలకు గత నెల 27వ తేదీన టికెట్స్ బుక్ చేసుకున్నాను.
కాశీ మనపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పడం ఎవరి వల్లా కాదు. కాశీ మిమ్మల్ని మీకు చూపిస్తుంది, సత్యం మిగిలే వరకు భ్రమల్ని తొలగిస్తుంది. వారణాసి నేల మీద నా అడుగులు పడిన క్షణమే.. ఏదో కొత్త ప్రదేశానికి వచ్చినట్లుగా కాకుండా, సొంతింటికి తిరిగి వచ్చినట్లుగా అనిపించింది. నిశ్శబ్ధంలో, గంటా నాదంలో, గంగా నదిలో, బూడిదలో, నేనే పీల్చే ప్రతి శ్వాసలో.. ఆయన నాకు ప్రతిచోటా కనిపించాడు. ఆయనే ఆరంభం, ఆయనే అంతం, మధ్యలోని ప్రతి అడుగులోనూ ఆయనే. మహాదేవుడిని నా మార్గదర్శిగా పిలుచుకునే భాగ్యం లభించడం, ఆయనకు కూతురిగా ఉండిపోవడం.. ప్రతి జన్మలోనూ నాతో తీసుకెళ్లే వరం ఇదేనంటూ పరమేశ్వరుడిపై తన భక్తిని చాటుకుంటూ నిహారిక కొణిదెల ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications



