NTR Trivikram Movie: చూస్తూ ఊరుకోం.. ప్రారంభానికి ముందే వివాదం..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో భారీ మైథాలాజికల్ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. మరోసారి ఈ కాంబో రిపీట్ కాబోతుండటంతో ప్రకటనకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఆ సినిమా మేకర్స్ బర్న్ ఇన్ ది నార్త్ (Born in the North) అనే ట్యాగ్లైన్ తో స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. అయితే, ఈ మూవీ ట్యాగ్లైన్పై తమిళనాడులో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నామ్ తమిళర్ కట్చి (NTK) పార్టీ అధినేత సీమాన్ ఈ అంశంపై ఘాటుగా స్పందిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఈ అంశం సినీ,రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే?
అరవింద సమేత వీర రాఘవ తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుంది. దీంతో ఈ ప్రాజెక్ట్పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. మూవీ మేకర్స్ తాజాగా విడుదల చేసిన పోస్టర్లో త్రిశూలం, వేల్ ఆయుధం, నంది కొమ్ములు, ఆలయాలు, యుద్ధ నేపథ్యం, అలాగే సుబ్రహ్మణ్య భుజంగం శ్లోకం ఉన్నాయి. దీంతో ఈ సినిమా కుమారస్వామి (కార్తికేయుడు/మురుగన్) కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమాగా భావిస్తున్నారు.

అయితే పోస్టర్లో బర్న్ ఇన్ ది నార్త్ (Born in the North) అనే ట్యాగ్ లైన్ వివాదానికి కారణమైంది. తమిళ సంప్రదాయంలో మురుగన్ను "తమిళ్ కడవుల్" (తమిళుల ఆరాధ్య దైవం)గా భావిస్తారు. సంగం సాహిత్యం, కురింజి సంస్కృతి, ఆరుపడై వీడు వంటి ఆధ్యాత్మిక సంప్రదాయాలతో మురుగన్కు ప్రత్యేక అనుబంధం ఉందని తమిళ పండితులు, భక్తులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మురుగన్ను ఉత్తర భారతంతో అనుసంధానించేలా ట్యాగ్లైన్ ఉండడం తమ మనోభావాలను దెబ్బతీస్తోందని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశంపై నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత సీమాన్ ఘాటుగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. సుబ్రహ్మణ్యస్వామిని ఉత్తర భారతంలో పుట్టినవాడిగా, ఉత్తరాది దైవంగా చూపించడం చరిత్రను వక్రీకరించడమే. మురుగన్ తమిళుల ఆరాధ్య దైవం. ఆయన సంస్కృతి, చరిత్ర తమిళ గడ్డతో ముడిపడి ఉంది. సినిమా కోసం ఈ చారిత్రక, సాంస్కృతిక అంశాలను మార్చి చూపిస్తే చూస్తూ ఊరుకోం" అని హెచ్చరించారు. అంతేకాకుండా, "తమిళుల మనోభావాలు దెబ్బతినేలా సినిమాలో సన్నివేశాలు ఉంటే విడుదలను అడ్డుకుంటాం. అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం" అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ వివాదం నేపథ్యంలో మరోసారి పురాణాలపై చర్చ మొదలైంది.
కథపై క్లారిటీ లేదు
ఇప్పటి వరకు మూవీ మేకర్స్ కథకు సంబంధించిన ఎలాంటి అధికారిక వివరాలు వెల్లడించలేదు. పోస్టర్లో కనిపించే ట్యాగ్ లైన్ కథలోని కీలక అంశమా? లేక కేవలం ప్రచారానికి ఉపయోగించిన ట్యాగ్లైన్ మాత్రమేనా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న చర్చ అంతా పోస్టర్ ఆధారంగానే సాగుతోంది. అయితే.. ప్రస్తుతం ఈ వివాదంపై మూవీ మేకర్స్ కూడా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. పోస్టర్లోని ట్యాగ్లైన్పై వివరణ ఇస్తారా? లేక సినిమా విడుదలకు ముందు కథకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఈ వివాదం ఎటువైపుకు దారి తీస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications



