ఎన్టీఆర్ ప్రశ్నకు మూడేళ్ల తరువాత సమాధానం.. ప్రశాంత్ నీల్ కామెంట్స్ వైరల్!
టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్లలో ఒకటి 'డ్రాగన్'. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాపై ప్రశాంత్ నీల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఐదేళ్ల క్రితమే ఎన్టీఆర్ను కలిసి ఈ కథకు సంబంధించిన కోర్ ఐడియాను చెప్పినట్లు తెలిపారు. అయితే, ఈ సినిమా కథను విన్న తర్వాత ఎన్టీఆర్ పెద్దగా కండిషన్లు పెట్టలేదని, కానీ ఒకే ఒక్క కీలకమైన ప్రశ్న అడిగారని వెల్లడించారు.

"ఈ పాత్ర చేసే తీవ్ర చర్యల వెనుక బలమైన కారణం, ఎమోషనల్ డ్రామా ఉందా?" అనే ప్రశ్నను ఎన్టీఆర్ అడిగినట్లు నీల్ చెప్పారు. ఈ ప్రశ్నే మొత్తం ప్రాజెక్ట్కు బేస్గా మారిందని, ఆ పాత్రను జస్టిఫై చేసేలా స్క్రీన్ప్లే రాయడానికి తన టీమ్కు దాదాపు మూడు సంవత్సరాలు పట్టిందని వెల్లడించారు. ఆ స్ట్రాంగ్ ఎమోషన్స్ కారణం సిద్ధమైన తర్వాతనే ఎన్టీఆర్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషిస్తున్న పాత్రపై కూడా ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఇది నా కెరీర్లోనే రాసిన అత్యంత డార్క్ క్యారెక్టర్. ఇప్పటివరకు చేసిన పాత్రలన్నింటికంటే ఇది మరింత క్రూరమైనది' అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. అంతేకాదు, ఈ సినిమా కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా స్ట్రాంగ్ ఎమోషనల్ డ్రామాతో కూడుకున్నదని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఎన్టీఆర్ డెడికేషన్ గురించి కూడా ప్రశాంత్ నీల్ కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ కేవలం నాలుగు నెలల్లోనే దాదాపు 15 కిలోల బరువు తగ్గారని తెలిపారు. ఒక దశలో ఆయన చాలా అలసిపోయినట్లు, ఆరోగ్యం క్షీణించినట్లు కనిపించడంతో తాను షాక్ అయ్యానని చెప్పారు. వెంటనే బరువు తగ్గడం ఆపేయమని సూచించినా, ఎన్టీఆర్ మాత్రం వినలేదని చెప్పారు.
ఈ విషయంపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన భార్య, అలాగే సినిమా టీమ్ కూడా ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ "ఈ సినిమా కోసం ఏదైనా చేయడానికి సిద్ధం" అని ఎన్టీఆర్ చెప్పిన మాటలు తనను ఆశ్చర్యపరిచాయని ప్రశాంత్ నీల్ అన్నారు. పాత్ర కోసం ఆయన చూపించిన కట్టుబాటు అసాధారణమని ప్రశంసించారు. ఈ విషయాలు బయటకు రావడంతో ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో గర్వంగా స్పందిస్తున్నారు.
తమ హీరో కష్టాన్ని చూసి అభిమానం మరింత పెరిగిందని కామెంట్లు చేస్తున్నారు. 'డ్రాగన్' గ్లింప్స్ ఇప్పటికే భారీ వ్యూస్ సాధించడంతో, ఇప్పుడు ఈ కొత్త వివరాలు సినిమాపై హైప్ను మరింత పెంచాయి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా టాలీవుడ్లో మరో రికార్డు సృష్టించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications




