బలిసి కొట్టుకోవడం లేదు..నీ జీవితం ఏంటో ప్రజలకు తెలుసు..వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై ప్రముఖ నిర్మాత
టాలీవుడ్కు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య కొనసాగుతున్న టికెట్ రేట్ల సంక్షోభం నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మరింత వివాదంగా మారుస్తున్నాయి. సినిమా పరిశ్రమను, సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తూ కొందరు వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా తెలుగు సినిమా పరిశ్రమలోని వ్యక్తులకు బాగా బలిసి కొట్టుకొంటున్నారంటూ నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఘాటుగా స్పందించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ..

ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు బాధకరం
తెలుగు సినిమా పరిశ్రమను టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరం. కోవూరులో ప్రసన్న కూమార్ రెడ్డి అంటే ఏమిటి? ఆయన రాజకీయ జీవితం ఏంటో అందరికి తెలుసు. ఆయన తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబం అంటే అందరికి చాలా గౌరవం ఉంది. అనవసరపు వ్యాఖ్యలతో ప్రసన్నకుమార్ రెడ్డి ఆ గౌరవాన్ని దిగజార్చుకోవద్దు అని ఎన్వీ ప్రసాద్ హితవు పలికారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాటలు అప్రజాస్వామికం
సినిమా ప్రముఖుల గురించి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు అప్రజాస్వామికం. రాజకీయ నేతగా ఆయన ఏం చేసుకొన్నా సినిమా పరిశ్రమకు సంబంధం లేదు. ఎవరు బలిసి కొట్టుకోవడం లేదు. సినిమా ప్రముఖులు గానీ, సినీ నిర్మాతలు గానీ పుణ్యానికి డబ్బు సంపాదించడం లేదు. ఎంతో కష్టపడితే గానీ డబ్బులు సంపాదించే పరిస్థితి సినిమా పరిశ్రమలో లేదు. ఒక సినిమాలో నటించాలంటే.. వంద అడుగులు పైనుంచి రోప్ కట్టుకొని కిందకు దూకితే తెలుస్తుంది. ఎవరు బలిసి కొట్టుకుంటున్నారో ఆయనకు తెలుస్తుంది అని నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఘాటుగా స్పందించారు.

నీ రాజకీయ జీవితం గురించి అందరికి తెలుసు
మీడియా ముందు ఉంది కదా అని.. నోటికి ఇష్టం వచ్చినట్టు.. ఏదో మాట్లాడితే హీరో అయిపోతారు అనుకొంటే తప్పు. మీ రాజకీయ జీవితం ఏంటో కొవ్వూరులో ప్రజలను అడిగితే తెలుస్తుంది. దయచేసి సినిమా వాళ్లు బలిసి కొట్టుకొంటున్నారని చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఎంతో మంది కష్టపడితే సినిమా పరిశ్రమ ఉంది. ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్న సమయంలో మీకు ఇష్ట వచ్చిన రీతిలో, మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సరికాదు. మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలం. మాకు సంస్కారం ఉంది కాబట్టి చవకబారు వ్యాఖ్యలు చేయడం లేదు. మేము సంస్కారవంతులుగానే ఉంటాం అని ఎన్వీ ప్రసాద్ అన్నారు.

రండి.. షూటింగ్కు వచ్చి చూడండి..
సినిమా టికెట్ల రేట్ల విధానంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం జీవో విడుదల చేసినప్పటి నుంచి మేము చర్చలు జరుపుతూనే ఉన్నాం. మేము ప్రభుత్వంతో పది, పదిహేను సార్లు కమిటీతో చర్చలు జరుపుతున్నాం. మేము బలిసి కొట్టుకోవడం లేదు. సినిమా నిర్మాణంలో కష్టం ఏమిటో ఒకసారి చూడండి. షూటింగ్ వద్ద ఎంత ఖర్చు అవుతుందో వచ్చిచూడండి. కావాలంటే మిమ్మల్ని మా షూటింగ్కు ఆహ్వానిస్తాం. ఆతిధ్యం ఇచ్చి కారు, రూమ్ ఇస్తాం. షూటింగ్ ప్రదేశానికి వచ్చి పరిస్థితిని చూడండి. అంతేకానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు అని ఎన్వీ ప్రసాద్ నిప్పులు చెరిగారు.

వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అంటూ
సినిమా వాళ్ళ గురించి అమర్యాదగా మాట్లాడటం మంచిది కాదు. మీ నాన్న నల్లపురెడ్డి శ్రీనివాస్రెడ్డిపై గౌరవం కొద్ది మిమ్మల్ని వదిలేస్తున్నాం. సినిమా పరిశ్రమలో 24 గంటలు కష్టపడి , ఒళ్లు హూనం చేసుకొంటేనే జీవితం ఉంటుంది. కష్టం లేకపోతే ఎవరికైనా సినిమా పరిశ్రమలో జీవితం ఉంటుంది. థియేటర్ల నిర్వహణ ఎంత భారం మీకు తెలియదు. ప్రభుత్వంలో బాధ్యతయుతంగా ఉండాల్సిన వ్యక్తి.. పద్దతిగా మాట్లాడాలి. రాజకీయాల్లో ఉన్నందున ఆయన తన వ్యాఖ్యలను వెనుకకు తీసుకొవాలి అని నిర్మాత ఎన్వీ ప్రసాద్ డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవే..
ఇటీవల ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో పేదలు ఈ రోజు సినిమాకు వెళ్లి మూవీ చూడాలంటే 1000 రూపాయలకు పైనే టికెట్ ధర ఉంది. ఏనాడైనా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడిగాడా? గతంలో ముఖ్యమంత్రిగా చేశావు. ఏపీ విభజన తర్వాత ఐదేళ్లు పాలించావు. ఏనాడైనా సినిమా టికెట్ల రేట్లు తగ్గించావా? ఆ సమయంలో సినిమా హీరోలకు, పరిశ్రమకు సపోర్ట్ చేశాడు. వాళ్లను బలిసే విధంగా చేశావే తప్ప.. ఏనాడైనా వాళ్లను ప్రశ్నించావా? సినిమా పరిశ్రమలో నీవాళ్లు, నీ కులం వాళ్లు ఉన్నారు కాబట్టి వాళ్లను సపోర్ట్ చేస్తున్నావు. పేదల కోసం టికెట్ రేట్లు వైఎస్ జగన్ తగ్గిస్తే.. మాఫియాను అణిచివేస్తావని వ్యాఖ్యలు చేస్తావా అంటూ చంద్రబాబుపై ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.


Click it and Unblock the Notifications











