Harihara Veeramallu : పవన్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించే న్యూస్ .. ఒక్క ఫోటోతో టాలీవుడ్ షేక్
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా, ఏపీ డిప్యూటీ సీఎంగా పరిపాలన, రాజకీయ వ్యవహారాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. వరుసపెట్టి రివ్యూలతో పాటు క్షేత్రస్థాయి పర్యటనలతో తన మార్క్ చూపిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, సుపరిపాలనే లక్ష్యంగా కష్టపడుతున్నారు పవన్ . ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనానిని ప్రచారం చేసిన ప్రాంతాల్లో మహాయుతి అభ్యర్ధులు విజయం సాధించడంతో ఆయన పేరు మరోసారి దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. పవన్ కళ్యాణ్ తన జీవితంలోనే అత్యున్నత స్థాయికి చేరుకున్నాడని ఓ పక్క సంతోషపడుతున్నా.. తమ అభిమాన నటుడిని తిరిగి వెండితెరపై చూస్తామో , లేదో అని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మెగా మేనల్లుడు సాయిథరమ్ తేజ్తో కలిసి చివరిసారిగా బ్రో సినిమాలో వెండితెరపై కనిపించిన పవన్ కళ్యాణ్ .. ఆ తర్వాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే అంకితమైపోయారు. ఎన్నికల సీజన్ కావడంతో అభ్యర్ధుల ఎంపిక, ప్రచారంతో పాటు ఫలితాల తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పవన్ చేతిలో ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఉన్నాయి. వీటిని త్వరగా కంప్లీట్ చేసి దర్శక నిర్మాతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారు.

అయితే పాలనలో కీలక బాధ్యతల్లో ఉన్నందున తాను సినిమాలు చేస్తే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని జనసేనాని కాస్తంత వెనకడుగు వేస్తున్నారు. కానీ తాను కమిటైన సినిమాలను కంప్లీట్ చేయాలని డిప్యూటీ సీఎం భావిస్తున్నారు. తొలుత సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీని పవన్ పూర్తి చేస్తారనే టాక్ వినిపించింది. కానీ అంతకంటే ముందే హరిహర వీరమల్లును జనసేనాని ఫినిష్ చేస్తారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
హరిహర వీరమల్లును తొలుత క్రిష్ జాగర్లమూడి స్టార్ట్ చేసినప్పటికీ .. ప్రాజెక్ట్ మధ్యలోనే ఆయన దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో చిత్ర నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ మెగా ఫోన్ పట్టారు. దాదాపుగా షూటింగ్ పూర్తి కాగా.. ఒక్క పవన్ కళ్యాణ్ పార్ట్ మాత్రమే మిగిలి ఉంది. అయితే వీరమల్లు షూటింగ్లో పవన్ పాల్గొంటారంటూ రకరకాల కథనాలు వచ్చాయి. తర్వాత అవన్నీ గాసిప్స్గానే మిగిలిపోయాయి.
కానీ తాజాగా మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు పూనకాలతో ఊగిపోయే న్యూస్ బయటికొచ్చింది. డిప్యూటీ సీఎం షూటింగ్లో పాల్గొన్న ఫోటోను నిర్మాత ఏఎం రత్నం ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. అంతేకాదు.. పవన్ కళ్యాణ్ ఈ వీకెండ్లో హరిహర వీరమల్లు షూటింగ్లో పాల్గొంటారని చెప్పారు. అలాగే వీరమల్లు మిమ్మల్ని మార్చి 28, 2025న థియేటర్లలో కలుస్తారంటూ రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్లో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











