OG బెనిఫిట్ షోలపై చంద్రబాబు సర్కార్ ట్విస్ట్.. పవన్ కళ్యాణ్ మూవీకి కొత్త టైమింగ్స్
సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ఓజీ. ప్రియాంక మోహన్ ఈ మూవీలో పవన్ సరసన హీరోయిన్గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ పోషిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, అజయ్ ఘోష్లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ ఓజీ సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 25న ఓజీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఓజీపై భారీ అంచనాలు
రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తోన్న రెండో సినిమా కావడం, ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఓజీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు విడుదల చేద్దామా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగినట్లుగానే అడ్వాన్స్ బుకింగ్లో ఓజీ సంచలనాలు సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఫస్ట్ డే ఫస్ట్ టికెట్ లక్షల్లో పలుకుతుండగా వాటిని పవన్ అభిమానులు సొంతం చేసుకుని వార్తల్లో నిలుస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఓజీ టికెట్ ధరల పెంపు
ఓజీ టికెట్ ధరల పెంపుకు, బెనిఫిట్ షోలకు అవకాశం కల్పిస్తూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో టికెట్ ధరల పెంపుకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసింది. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు ఓజీ సినిమా టికెట్ ధరలను పెంచుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఇక అర్ధరాత్రి 1 గంటకు ఓజీ బెనిఫిట్ షో వేసుకోవడానికి, టికెట్ ధరను 1000 రూపాయల వరకు వసూలు చేసుకోవడానికి అనుమతించింది. సినిమా రిలీజైన నాటి నుంచి 10 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్పై 125 రూపాయలు పెంచుకోవచ్చని తెలిపింది. అలాగే మల్టీప్లెక్స్లలో ఒక్కో టికెట్ ధరపై 150 రూపాయలు పెంచుకోవడానికి అనుమతులు మంజూరు చేసింది.
ఏపీ బాటలో తెలంగాణ సర్కార్
ఓజీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపించిన బాటలోనే తెలంగాణ ప్రభుత్వం ఫాలో అయ్యింది. ఇక్కడ సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి ప్రీమియర్ షోలు ప్రదర్శించుకోవచ్చని అనుమతించింది. నైజాంలో ఓజీ ప్రీమియర్ షోల టికెట్ ధరను రూ.800గా నిర్ణయించారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు ఓజీ టికెట్ ధరను పెంచుకోవడానికి అనుమతించింది. ఓజీ రిలీజైన తర్వాత 10 రోజుల పాటు తెలంగాణలో ఒక్కో టికెట్పై సింగిల్ స్క్రీన్లలో 100 రూపాయలు, మల్టీప్లెక్స్లలో 150 రూపాయలను అదనంగా పెంచుకోవడానికి అనుమతించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
ప్రీమియర్స్కి హౌస్ఫుల్ బోర్డులు
మరోవైపు ఓజీ ప్రీమియర్స్ కోసం రెండు రాష్ట్రాలు, ఓవర్సీస్లో అభిమానులు ఎగబడుతున్నారు. ధర ఎంతైన పెట్టి కొనేందుకు వెనుకాడటం లేదు. ఇప్పటికే బుకింగ్స్ భారీగా జరుగుతుండగా.. కొన్ని చోట్ల ప్రీమియర్స్కి హౌస్ఫుల్ బోర్డులు పెట్టేశారు. ఈ నేపథ్యంలో ప్రీమియర్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ అభిమానులకు బంపరాఫర్ ఇచ్చింది. తొలుత వారం క్రితం విడుదల చేసిన జీవోలో అర్ధరాత్రి 1 గంటకు ఆంధ్రప్రదేశ్లో ఓజీ ప్రీమియర్స్ ప్రదర్శించుకోవడానికి అనుమతించారు.
ఏపీలో ఓజీ బెనిఫిట్ షో ఎప్పుడంటే?
అయితే నిర్మాత డీవీవీ దానయ్య విజ్ఞప్తి మేరకు బెనిఫిట్ షో ప్రదర్శించే సమయంలో మార్పులు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. సెప్టెంబర్ 25వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంటకు బదులు.. సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి 10 గంటలకే ఓజీ బెనిఫిట్ షోను ప్రదర్శించుకోవచ్చని సోమవారం కొత్త జీవో జారీ చేసింది. దీని ప్రకారం.. 3 గంటల ముందుగానే ఆంధ్రప్రదేశ్లో ఓజీ బెనిఫిట్ షోలు ప్రదర్శించనున్నారు. దీంతో ఏపీలో పవన్ కళ్యాణ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కూడా ఓజీ బెనిఫిట్ షోల విషయంలో ఏమైనా మార్పులు చేస్తుందా? లేక పాత జీవోకే కట్టుబడి ఉంటుందా? అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











