OG Movie: పవన్ కల్యాణ్ ప్రపోజల్ను రిజెక్ట్ చేసిన డైరెక్టర్ సుజిత్.. ‘ఓజీ’ వెనుక ఇంత కథ నడిచిందా?
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ , సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ 'ఓజీ' . ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అంతేకాదు.. పవన్ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ 'ఓజీ'నే. ఈ సినిమాలో పవర్స్టార్ ఓ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ పోషిస్తున్నారు. ఇందులో పవన్ సరసన ప్రియాంక మోహనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి , అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్ , అజయ్ ఘోష్ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 27న ఓజీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రూ.250 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమాకు థమన్ స్వరాలు సమకూరుస్తుండగా.. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
సాహో తర్వాత సుజిత్ దర్శకత్వం వహిస్తుండటంతో పాటు ఇటీవల రిలీజైన పవన్ లుక్, టీజర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే పవన్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా రీమేక్ సబ్జెక్ట్లు చేస్తూ ఉండటంతో ఓజీపైనా రీమేక్ అన్న ముద్ర పడింది. దీనికి దర్శకుడు సుజిత్ క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. నిజానికి తనను కూడా రీమేక్ చేయమనే పిలిచారని, అయితే దేవుడిని ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుకున్నానని చెప్పారు.

రీమేక్ కాకుండా ఒరిజినల్ స్టోరీ చేస్తే వచ్చే కిక్ వేరని సుజిత్ అన్నారు. మనం చేసే పనికి ప్రకృతి సహకరిస్తుందని.. ఇన్నాళ్లు వెయిట్ చేసినందుకు తనకు మంచి ఛాన్స్ దక్కిందని సుజిత్ తెలిపారు. ఏమైనా కొత్త కథ ఉందా అని పవన్ కళ్యాణ్ అడగ్గా.. సింగిల్ లైన్ చెప్పానని, ఆ వెంటనే ప్రాజెక్ట్ ఓకే చేశారని ఆయన వెల్లడించారు.
ఇక చిత్ర టైటిల్ విషయంలోనూ అంతే చర్చ జరుగుతోంది. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే అర్ధం కాబట్టి ఈ సినిమాకు అదే టైటిల్ పెట్టారని ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదనీ... ఓజీ అంటే ఓజాస్ గంభీర్ అని క్లారిటీ ఇచ్చారు సుజిత్. ఓజాస్ అంటే మాస్టర్ అని.. గంభీర్ అంటే హీరో పేరు పేరని రెండూ కలిపితే ఓజీ అని ఆయన చెప్పారు.

పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తన సినిమాల్లో జపాన్ ఫ్లేవర్ కావాలనుకుంటారని, దీనికి కథతోనూ సంబంధం లేదని సుజిత్ పేర్కొన్నారు. పవర్స్టార్తో జపాన్ స్టైల్లో సినిమా చేయాలన్నది తన డ్రీమ్ అని .. అది ఓజీతో నెరవేరిందన్నారు. పవన్ కళ్యాణ్కే కాదు.. తనకు కూడా జపాన్ సినిమాలంటే ఎంతో ఇష్టమన్నారు.
గత ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో క్షణం తీరిక లేకుండా గడిపారు పవన్ కళ్యాణ్. అత్యంత కీలకమైన ఎన్నికలు కావడంతో తాత్కాలికంగా సినిమాలకు విరామం ప్రకటించారు జనసేనాని. ప్రస్తుతం ఏపీలో పొలింగ్ పూర్తి కావడంతో పవన్కు కాస్త బ్రేక్ దొరికింది. మరో వారంలో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో తన చేతిలో ఉన్న సినిమాలపైనా పవర్స్టార్ దృష్టి సారించారని సన్నిహితులు చెబుతున్నారు. ఓజీతో పాటు హరిహరవీరమల్లు , ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే పవన్ ఏదో ఒక కీలక పదవి తీసుకుని పాలనలో భాగమవుతారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఈ ప్రాజెక్ట్ల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుంది. ఈ పరిణామాల దృష్ట్యా సినిమాలను పవన్ వేగంగా కంప్లీట్ చేసే అవకాశాలు లేకపోలేదు. వీటిలో ముందుగా ఓజీని ఆయన పూర్తి చేయనున్నారు. పవన్ లేని సన్నివేశాలను చిత్ర యూనిట్ పూర్తి చేయగా.. ఆయన చేయాల్సిన సీన్స్ కోసం అంతా నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఓ 20 రోజులు డేట్స్ ఇచ్చినట్లుగా ఫిలింనగర్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.


Click it and Unblock the Notifications











