Operation Sindoor : మేమంతా మీ వెంటే.. భారత సైన్యానికి చిరు, బన్నీ, ఎన్టీఆర్ సెల్యూట్
జమ్మూకాశ్మీర్లోని భూతల స్వర్గం పహల్గామ్లో ఏప్రిల్ 22న పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. నాటి ఘటనలో 26 మందిని టెర్రరిస్టులు పొట్టనపెట్టుకున్నారు. గుర్తింపు కార్డులు చూసి, మతం అడిగి మరి పురుషులే లక్ష్యంగా భార్యాబిడ్దల ముందే హత్య చేశారు. ఈ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. ఈ ఘటనకు కారణమైన ఉగ్రవాదులను, ఆ నరహంతకుల వెనుకున్న పాకిస్తాన్ను వదలిపెట్టేది లేదని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. గత కొద్దిరోజులుగా త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్తో వరుసపెట్టి సమావేశాలు నిర్వహిస్తున్న మోడీ పక్కా వ్యూహం సిద్ధం చేసి పాకిస్తాన్కు షాకిచ్చారు.

పహిల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం అర్ధరాత్రి దాటాక పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. సైన్యం, ఎయిర్ఫోర్స్ పక్కా సమన్వయంతో ఈ మెరుపుదాడులు చేశాయి. కరడుగట్టిన ఉగ్రవాద సంస్థలైన లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ మొజాహిద్దీన్లకు చెందిన 9 ఉగ్రవాద క్యాంపులపై భారత సైన్యం విరుచుకుపడింది. పాక్లోని పంజాబ్ ప్రావిన్స్లోని కీలక నగరం బహావల్పూర్లోని ఉస్మాన్ ఓ అలీ క్యాంప్, మర్కజ్ తొయిబా మదర్సా వంటి ఉగ్ర స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. ఈ దాడుల్లో మొత్తం 9 స్థావరాల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లుగా అనుమానిస్తున్నారు.
స్వయంగా పర్యవేక్షించిన మోడీ
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పర్యవేక్షించినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా ఆపరేషన్ సింధూర్ను నిర్వహించింది భారత్. ఇందుకోసం అత్యాధునిక ఆయుధాలను తన అమ్ములపొదిలో నుంచి భారత్ బయటికి తీసింది. అంతర్జాతీయ సమాజంలో తన ప్రతిష్టకు భంగం కలగకుండా.. పాక్ సైనిక స్థావరాల జోలికి వెళ్లకుండా, పౌరుల నివాస ప్రాంతాల జోలికి వెళ్లకుండా భారత్ సైన్యం సంయమనంతో వ్యవహరించింది.
భారత్ మెరుపుదాడితో షాక్లో పాక్
ఆపరేషన్ సింధూర్ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధ్వంసమైన భవనాలు, అంబులెన్స్, ఫైరింజిన్లు కనిపిస్తున్నాయి. దాదాపు 100 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయారని వార్తలు వస్తుండగా.. పాక్ మాత్రం సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోంది. భారత సైన్యం మెరుపుదాడితో షాకైన పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడుతోంది. దీంతో ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం తారాస్థాయికి చేరుకుంది.
ఆపరేషన్ సింధూర్పై ప్రముఖుల హర్షం
మరోవైపు.. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. భారత సైన్యం శక్తి సామర్ధ్యాలు మరోసారి ప్రపంచానికి తెలిశాయంటూ వారు సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు సంతోషంగా ఉందని చిరంజీవి ట్వీట్ చేశారు. న్యాయం జరిగింది.. జైహింద్ అంటూ అల్లు అర్జున్ పేర్కొన్నారు. భారత సైన్యం సురక్షితంగా ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
మా ప్రార్ధనలు మన బలగాలతో ఉంటాయని.. దేశమంతా మీకు అండగా ఉంటుందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ను సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ రీట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











