Padma Awards 2026: సినీ పద్మాలు వీరే.. ఎవరికి ఏ అవార్డు అంటే?
Padma Awards 2026: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా మారాయి. 2026 సంవత్సరానికి గాను కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన నలుగురు, తెలంగాణకు చెందిన ఏడుగురు మొత్తం 11 మంది చోటు దక్కించుకున్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను ప్రకటించగా, ముఖ్యంగా సినీ రంగం నుంచి పలువురు దిగ్గజాలు ఎంపిక కావడం విశేషంగా నిలిచింది. ఎవరికి ఏ అవార్డు అంటే?
ఈ ఏడాది కేంద్రం మొత్తం 5 మందికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఉండటం తెలుగు ప్రజలకు గర్వకారణంగా మారింది. ముఖ్యంగా కళా విభాగంలో తెలుగు, భారతీయ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులకు గౌరవం దక్కింది.

సినీ రంగం నుంచి ఎంపికైన వారిలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు పద్మశ్రీ పురస్కారం లభించింది. దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని కేంద్రం అందించింది. కామెడీ, క్యారెక్టర్ పాత్రల్లో తనకంటూ ప్రత్యేక శైలితో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న రాజేంద్రప్రసాద్కు ఇది మరో మైలురాయిగా నిలుస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్ కు కూడా పద్మశ్రీ పురస్కారం లభించింది. తెలుగు సినిమాతో పాటు సామాజిక సేవల ద్వారా ఆయన చేసిన కృషిని కేంద్రం గుర్తించింది.తెలుగు రాష్ట్రాల కళా రంగానికి చెందిన మరో విశిష్ట గౌరవంగా, తెలంగాణకు చెందిన దీపికా రెడ్డి కు కళారంగంలో చేసిన సేవలకు పద్మశ్రీ పురస్కారం దక్కింది.
అలాగే మలయాళ సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు మమ్ముట్టి కు పద్మభూషణ్ పురస్కారం దక్కింది. దశాబ్దాలుగా భారతీయ సినీ రంగంలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించారు. మరోవైపు బాలీవుడ్ లెజెండ్, దివంగత నటుడు ధర్మేంద్ర కు దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మవిభూషణ్ ను కేంద్రం ప్రకటించింది. అలాగే.. ప్రముఖ బాలీవుడ్ గాయని అల్కా యాగ్నిక్ లకు పద్మ భూషణ్ పురస్కారాలు లభించాయి. దశాబ్దాల పాటు సినీ రంగానికి వారు చేసిన సేవలకు ఇది గుర్తింపుగా నిలుస్తోంది. అలాగే.. పద్మశ్రీ పురస్కారాలకు జాతీయ అవార్డు గ్రహీత నటుడు ఆర్ మాధవన్, బెంగాలీ సినిమా దిగ్గజం ప్రోసెన్జిత్ ఛటర్జీ, అలాగే ప్రముఖ టీవీ-సినీ నటుడు సతీష్ షా (మరణానంతరం) ఎంపికయ్యారు.
మొత్తంగా చూస్తే, ఈ ఏడాది పద్మ పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 11 మందికి గౌరవం దక్కడం తెలుగు ప్రజలకు గర్వకారణంగా మారింది. ముఖ్యంగా సినీ, కళా రంగాల్లో దశాబ్దాలుగా సేవలందించిన వారిని కేంద్ర ప్రభుత్వం గుర్తించడం పట్ల సినీ వర్గాలు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పురస్కారాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











