సాయం కోసం వెళితే ఆ స్టార్ హీరోల వాచ్మెన్లు తరిమివేశారు.. చిరంజీవి మాత్రం అలా.. పావలా శ్యామల
వందలాది చిత్రాల్లో తన కామెడీ టైమింగ్తో ప్రజల్ని కడుపుబ్బా నవ్వించిన పావలా శ్యామల దుర్బర జీవితాన్ని గడుపుతున్నారు. వయసు పైబడటం, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. కొందరు సినీ పెద్దలు, ప్రభుత్వం సాయం చేసినా ఆమె కష్టాలు మాత్రం తీరలేదు. అప్పట్లో కొన్నాళ్లు మీడియాలో పావలా శ్యామల గురించిన వార్తలు వచ్చేవి. కానీ ఆ తర్వాత ఆమె ఎక్కడ ఉంది? ఏం చేస్తుంది? అనేది తెలియరాలేదు. ఫిల్మీబీట్ ఎంతో శ్రమించి ఎట్టకేలకు పావలా శ్యామల ఆచూకీ కనుగొని ఆమె కష్టాలను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేసింది.
నాటక రంగానికి, సినీరంగానికి పొంతన లేదు
'ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నేను మేనేజర్ను పెట్టుకోలేదు.. నాటక రంగంలో బిజీగా రోజుకు మూడు, నాలుగు నాటకాలు వేసేదాన్ని. అన్ని పరిషత్ నాటకాలే వేసేదాన్ని, అప్పుడు కూడా డైరీ పెట్టుకోలేదు. నాకు డేట్స్ ఎలా మెయింటైన్ చేయడం తెలియదు. అదే చివరి వరకు కంటిన్యూ చేశాను తప్పించి మేనేజర్ను పెట్టుకోలేదు. చాలా మంది చాలా రకాల మోసాలు చేశారు. ఇస్తాం అన్నది ఇవ్వకపోవడం, డబ్బులు అడిగితే మిమ్మల్ని పిలవరని బెదిరించేవారు. 50 వేలు ఇస్తామని ఒక 10 వేలు చేతిలో పెట్టడం, అడిగితే ఏమనుకుంటారోనని భయపెట్టేవారు. నాటక రంగంలో నటీనటుల రెమ్యునరేషన్, సినీ పరిశ్రమలో పారితోషికాలకు ఏమాత్రం పొంతన లేదు. నాటక రంగంలో రోజుకు 1000 రూపాయలంటే గొప్ప, సినీరంగంలో దానికి పెద్దగా విలువ లేదు. ఇక్కడ డిమాండ్ చేయొచ్చన్న సంగతి తెలిసేది కాదు, ఎంత చేతిలో పెడితే అంత తీసుకునేదానిని. పరిస్ధితులు, సినీ పరిశ్రమపై స్పష్టమైన అవగాహన వచ్చేనాటికి నా చేయి దాటిపోయింది' అని పావలా శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు.

గైడ్ చేసేవాళ్లు లేరు
'ఉన్నదానితో సంతృప్తి పడటమే నాకు మొదటి నుంచి అలవాటు. గైడ్ చేసేవాళ్లు, ఇలా వెళ్లమని చెప్పేవాళ్లు లేరు. మీరు డిమాండ్ చేశారంటే ఎవరూ మిమ్మల్ని పిలవరని భయపెట్టేవాళ్లే. ఇది నాటక రంగం కాదని, ఇది సినిమా అని మాట్లాడేవాళ్లని దాంతో భయం వేసేది. అయినా మొదటి నుంచి గైడ్ చేస్తే వినేరకం కాదు, సినీ పరిశ్రమలో ఎదుటి వ్యక్తి ముందు వినయ విధేయతలు ఉన్నట్లు నటిస్తేనే పైకొస్తారు. గుంటూరులోని ఎల్వీఆర్ క్లబ్లో నా నాటకం చూసి కోటీశ్వరులు డబ్బులు విసిరేసేవారు. దాసరి నారాయణ రావు వంటి పెద్దలు కూడా నా నాటకానికి మెచ్చుకునేవారు. గ్లామర్ లేకపోయినా, నల్లగా ఉన్నా ఆర్టిస్ట్గా మంచి స్థాయిలో ఉన్నప్పుడే నాటక రంగం నుంచి సినీ పరిశ్రమలో అడుగుపెట్టా. ఆ స్థాయిలో బతకడం వల్లే ఇక్కడ ఎవరైనా ఒక మాటంటే పడేదానిని కాదు' అని నాటి అనుభవాలను పావలా శ్యామల గుర్తుచేసుకున్నారు.
రామానాయుడు కారు దిగి మెచ్చుకున్నారు
'నాటక రంగంలో ఎన్నో ప్రశంసలు, సన్మానం పొంది ఇక్కడికి వచ్చా.. నటన తప్పించి మరో పని చేతకాదు. ఆర్టిస్ట్ అనే వాడికి వేరే పని రాదు.. చనిపోయేటప్పుడు కూడా నటిస్తూనే చనిపోతాడు. నాటక రంగంలో మహామహుల చేత పాదాభివందనం చేయించుకున్నా. ఆంధ్రావాలాలో నా నటనకు ఎన్నో ప్రశంసలు దక్కేవి. నెల్లూరు నుంచి ఫోన్లు చేసి మరి అభినందించేవారు. కొన్ని థియేటర్లలో సినిమా అయిపోయి అంతా వెళ్లిపోయేటప్పుడు నా సీన్స్ వేసేవారు. జనగణమణ ఎలా వేస్తారో అలాగే వెళ్లిపోయేవారు కూడా ఆగిపోయి ఈ సీన్ చూసి వెళ్లిపోయేవారు. ఓసారి నేను ఆటో కోసం బస్టాండ్లో నిలబడితే డాక్టర్ డి. రామానాయుడు గారు కారులో వెళ్తూ నన్ను చూసి వెనక్కి వచ్చి కారు దిగి బాగా చేశావ్, నేనైతే నవ్వలేక చచ్చానని మెచ్చుకున్నారు.

ఆ క్రెడిట్ పూరీ జగన్నాథ్దే
గోలిమార్లో నేను చేసిన నటన కూడా అందరికీ నచ్చింది. ఇటివల డాక్టర్ దగ్గరికి వెళితే మీరే కదమ్మా అని గుర్తుపట్టి పలకరించారు. ఆ సినిమాలోని బాయ్ అనే డైలాగ్ని ఓ కుర్రాడు వాళ్ల స్కూల్లో అరగంట పాటు చెప్పుకుని నవ్వుకున్నారట. ఈ డైలాగ్ చెప్పింది నేనే అయినా అదంతా పూరీ గారి గొప్పదనమే. గోలీమార్ షూటింగ్ సందర్భంగా ఈ సీన్ గురించి మధ్యాహ్నం వరకు అనుకున్నారట. దీనికి చాలా సమయం పడుతుందని అంతా అనుకున్నారు.. పూరీ గారు పేపర్ ఇచ్చి చదువుకోమన్నారు. నా డైలాగ్స్ చదువుకుని పేపర్ పక్కన పడేశా. ఆయన చెప్పమన్నట్లు డైలాగ్ చెప్పేశా. పూరీ జగన్నాథ్ గారు చాలా గ్రేట్. డైలాగ్ పేపర్ నా దగ్గరికి రాగానే ఎలా చెప్పాలని నేను పనిచేసే ప్రతి ఒక్క దర్శకుడిని అడుగుతా. నా మీద గౌరవంతో ఎలా చెప్పినా పర్లేదు, మీ ఇష్టమని నా మీదే వదిలేసేవారు' అని శ్యామల తెలిపారు.
దిల్రాజు సాయం చేయలేదు
'నాకు అండగా నిలబడతామని అంతా వస్తారు, మా మేనేజర్ మీకు అన్ని చేస్తారని అతని నెంబర్ ఇచ్చేవాళ్లు. కానీ ఎవ్వరూ నా గోడు వినేవాళ్లు కాదు. ఇప్పటికీ నేను ప్రాణాలతో ఉన్నానంటే దిల్రాజు గారి మీద నాకున్న గౌరవం, ఆయన నా పట్ల చూపిన అభిమానం. రాజమండ్రిలో రాజా రవీంద్రగారు ఏదో మాటల సందర్భంలో నా గురించి ఆయనతో చెప్పారట. దిల్రాజు గారు అప్పటికప్పుడు రాజమండ్రి నుంచి నాకు నేరుగా ఫోన్ చేసి అమ్మా మీరు బాధపడొద్దు నేను నెలకు 15 వేలు పంపిస్తాను, తర్వాతి సినిమాలో మీకు మంచి క్యారెక్టర్ ఇస్తానని చెప్పారు. కానీ పంపలేదు, ఏం జరిగిందో నాకు తెలియలేదు. ఆఫీసుకి వెళ్లి అడిగితే చాలా ఇదిగా మాట్లాడారు' అని శ్యామల వ్యాఖ్యానించారు.

నా బిడ్డ గురించే బెంగ
'ఈ ఓల్డేజ్ హోమ్ లాస్ట్ మిజలీగా ఇక్కడికి వచ్చాను. మనం బాగా బతికి వచ్చినవాళ్లం, ఆ పొగరు ఇంకా తగ్గలేదు. మన పరిస్ధితి బాలేనప్పుడు అడ్జెస్ట్ కావాలి, కానీ కాలేకపోతున్నా. నాకున్న జబ్బు నయమై తిరిగి ఆర్టిస్ట్గా బతికే పరిస్ధితి లేదు. నా బిడ్డ అనాథగా మారిపోతుంది.. ఆమెకు కాలు లేదు, ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ కోసం కొందరు లక్ష రూపాయలు ఇచ్చారు. కొందరు ఇచ్చిన డబ్బుని ఓ క్యాబ్ డ్రైవర్ కొట్టేశాడు. బయట కూడా చాలా మంది మోసం చేశారు. కాలు లేకపోవడం వల్ల లేచి కూర్చోలేదు, పనిపిల్లను పెట్టుకునే తాహతు లేదు. నా బిడ్డను అనాథగా వదిలి చనిపోతానేమో, ట్రీట్మెంట్ చేయిస్తే కొద్దిరోజులు బతుకుతా' అని శ్యామల కన్నీటి పర్యంతమయ్యారు.
కరాటే కళ్యాణీకి నాపై కక్ష
'నా పరిస్దితి తెలుసుకుని ఫోన్లో వచ్చే ఇంటర్వ్యూ ఎవరూ చూడరని, పేపర్లో వేస్తే పెద్దల దాకా వెళ్తుందని ఓ పేపర్ అబ్బాయిని పిలిపించారు. మా అసోసియేషన్ వాళ్లు నాకు చాలా సాయం చేసినట్లుగా చెప్పుకున్నారు, కానీ నాకు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. విష్ణుగారు వచ్చాక ఆయన్ని తీసుకుని వస్తామని మా వాళ్లు చెప్పారు. నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేవాళ్లు ఇచ్చే డబ్బులతోనే బతుకుతున్నాం. కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు నాకు పది వేలు పెన్షన్ ఇచ్చేవారు. అది ఇప్పటికీ వస్తూనే ఉంది. మా వాళ్లు 6 వేలు వేస్తారని, చిరంజీవి గారు లక్ష రూపాయలు కట్టి నాకు మాలో మెంబర్షిప్ ఇప్పించారు. నాటి నుంచి నేటి వరకు కనీసం హెల్త్ కార్డ్ కూడా ఇవ్వలేదు. ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి వాళ్లను కలిసేందుకు వెళ్లగా ఇంటి బయట హిందీ వాళ్లు వాచ్మెన్లుగా ఉండటంతో వాళ్లు జావ్ జావ్ అంటారు. దరిదాపుల్లోకి కూడా రానివ్వని వారు నాకు హెల్ప్ చేశామని చెప్పుకుంటారు. కరాటే కళ్యాణీ నాకు పెద్ద పెద్ద వస్తువులు తీసుకొచ్చి ఇచ్చింది అవేవీ నాకు వాడటం చేత కాదు. అవి నాకొద్దని చెప్పడంతో ఆమె హర్ట్ అయి, నా మీద దుష్ప్రచారం చేస్తోంది' అని పావలా శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











