Olympics 2024: ఒలంపిక్లో త్రివర్ణ పతాకం రెపరెపలు.. స్వప్నిల్ కుశాలేకు పవన్ కల్యాణ్ అభినందనలు
ప్రపంచ దేశాలు పాల్గొంటున్న ఒలంపిక్ క్రీడల్లో భారతీయ క్రీడాకారుడు స్వప్నిల్ కుశాలే సత్తా చాటి దేశానికి కాంస్య పతకం అందించడంపై ప్రజలు హర్షిస్తున్నారు. కేవలం 28 ఏళ్ల వయసులోనే ఈ కుర్రాడు షూటింగ్ క్రీడలో పతకం సాధించడంపై క్రీడాభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కుర్రాడు సాధించిన విజయంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ప్రకటన రిలీజ్ చేసి అభినందించారు. సెన్సేషనల్ కుర్రాడి గురించి, పవన్ కల్యాణ్ అభినందనల గురించిన వివరాల్లోకి వెళితే..
మహరాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్రీడా ప్రోత్సాహక పథకం క్రీడా ప్రభోధినిలో భాగంగా స్వప్నిల్ కుశాలే షూటింగ్ క్రీడను ఎంచుకొన్నారు. కొల్హాపూర్కు చెందిన ఈ యువకుడు పారిస్లోని ఒలంపిక్ క్రీడా గ్రామం చేటియారక్స్ షూటింగ్ సెంటర్లో జరిగిన పురుషుల 50 మీటర్ల 3P ఫైనల్లో కాంస్య పతకాన్ని సాధించాడు.

తన కుమారుడు సాధించిన విజయంపై తండ్రి సురేష్ భావోద్వేగానికి గురయ్యాడు. 10వ ఏట నుంచే స్వప్నిల్ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకొన్నారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత క్రీడా విభాగంలో ఇండియన్ రైల్వేలో టీటీఈ ఉద్యోగం సంపాదించారు. పూణేలో టికెట్ కలెక్టర్గా పనిచేస్తున్నారు అని తెలిపారు.
స్వప్నిల్ కుశాలెకు అభినందనలు
ఒలంపిక్ క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన స్వప్నిల్ కుశాలెకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. పారిస్ ఒలింపిక్స్ లో మన దేశానికి మరో పతకం దక్కడం సంతోషాన్ని కలిగించింది. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో కాంస్యం సాధించిన యువ షూటర్ స్వప్నిల్ కుశాలెకు హృదయపూర్వక అభినందనలు. ఈ ఒలింపిక్స్ లో మన క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అని ఓ ప్రకటనలో తెలిపారు.


Click it and Unblock the Notifications











