జనసేన శాసనసభాపక్షనేతగా పవన్ కళ్యాణ్ ఎన్నిక .. అపురూప క్షణాలంటోన్న ఫ్యాన్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల ముగిసి టీడీపీ , జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. దీనిలో భాగంగా జనసేన శాసనసభాపక్షనేతగా పవన్ కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఎన్నికైన ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ను జనసేన శాసనసభాపక్షనేతగా ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించగా.. ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
ఈ దృశ్యాన్ని టీవీలు, ఫోన్లలో చూసిన లక్షలాది మంది పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కేడర్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్షణం కోసం దాదాపు పదేళ్లుగా వారు నిరీక్షిస్తున్నారు. ఎట్టకేలకు వారి ఆశలు ఫలించి పవన్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించడంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా శాసించే స్థాయికి చేరుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

తాను గెలవడంతో పాటు పోటీ చేసిన 21 స్థానాలకు 21 స్థానాల్లోనూ విజయం సాధించి మరో అరుదైన రికార్డును కూడా పవన్ తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా జనసేన శాసనసభాపక్షనేతగా పవన్ ఎన్నికైన దృశ్యాలను వారు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇవి అపురూప క్షణాలంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో టీడీపీ , జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభాపక్షనేతగా చంద్రబాబు నాయుడును ఎన్నుకున్నారు. అలాగే చంద్రబాబును సీఎం అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా.. మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఈ తీర్మానాన్ని కూటమికి చెందిన నేతలు గవర్నర్కు పంపితే.. ఆయన పరిశీలించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలకనున్నారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ.. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో విపత్కర పరిస్ధితులు తలెత్తాయన్నారు. మూడు పార్టీలు కూటమిగా కలిసికట్టుగా పోరాడి అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించామని పవన్ తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని ఇప్పటం సభలో చెప్పామని.. అదే మాటపై నిలబడ్డామని ఆయన గుర్తుచేశారు.
సాగు, తాగునీరు, విద్య, వైద్యం, శాంతి భద్రతల విషయంలో బలంగా నిలబడతామని.. ఉమ్మడి మేనిఫెస్టో అమలును బాధ్యతాయుతంగా తీసుకెళ్తామని పవన్ చెప్పారు. చంద్రబాబు అనుభవం, నాయకత్వం రాష్ట్రానికి చాలా అవసరమని.. ఆయన జైల్లో ఉన్నప్పుడు భువనేశ్వరితో మళ్లీ మంచిరోజులు వస్తాయని చెప్పానని ఆరోజులు వచ్చాయని పవన్ కళ్యాణ్ అన్నారు.
కాగా.. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు , ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు సమీపంలో కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద వేదికను సిద్ధం చేస్తున్నారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారానిక.. వైసీపీ పాలనలో బాధితులుగా మిగిలిన 104 మంది కుటుంబాలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. వీరిలో మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తల చేతుల్లో హత్యకు గురైన చంద్రయ్య కుటుంబం, తాజా ఎన్నికల్లో పాల్వాయిగేటు గ్రామ పోలింగ్ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని అడ్డుకున్న నంబూరి శేషగిరిరావు కుటుంబం తదితరులు ఉన్నారు.


Click it and Unblock the Notifications











