హుటాహుటిన ముంబై హాస్పిటల్కు పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సీఎంకు ఏమైందంటే?
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. ఆరోగ్య పరీక్షల కోసం ఆయన సోమవారం హుటాహుటిన ముంబైకి వెళ్లారు. తన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి ప్రత్యేక విమానంలో ముంబై చేరుకున్నారు. దీంతో అటు అభిమానుల్లో , పార్టీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. ఇంతకీ పవన్ కళ్యాన్ కు ఏమైంది?
జనసేన పార్టీ వెల్లడించిన వివరాల ప్రకారం.. పవన్ కళ్యాణ్ రెండు భుజాల్లోని కండరాలు దెబ్బతిన్నాయి. దీంతో పాటు రొటేటర్ కఫ్ (Rotator Cuff) గాయంతో కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజకీయ కార్యక్రమాలు, అధికారిక సమావేశాలు, వరుస పర్యటనలు, అలాగే గతంలో కమిట్ అయిన సినిమా షూటింగ్ల కారణంగా భుజాలపై తీవ్ర ఒత్తిడి పడటంతో సమస్య మరింత ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముంబైలోని ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణుల పర్యవేక్షణలో పరీక్షలు చేయించుకుని, తదుపరి చికిత్సపై నిర్ణయం తీసుకోనున్నారట.

ఇటీవల జరిగిన కొన్ని అధికారిక కార్యక్రమాల్లో కూడా పవన్ కళ్యాణ్ అసౌకర్యానికి గురైనట్లు కనిపించారు. కేబినెట్ సమావేశాల సమయంలో ఎక్కువసేపు కూర్చోలేకపోవడం, భుజం నొప్పి కారణంగా కొన్ని కార్యక్రమాలను మధ్యలోనే ముగించాల్సి రావడం చర్చనీయాంశమైంది. దీంతో పూర్తి స్థాయి వైద్య పరీక్షలు అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో చికిత్స తీసుకున్నారు. పూర్తిగా నయం కాకపోవటంతో.. ఇప్పుడు ముంబైలో చికిత్స చేయించుకోవాలని నిర్ణయించారట.
ఇప్పటికే సైనస్ శస్త్రచికిత్స కూడా
ఇటీవలే పవన్ కళ్యాణ్ సైనస్ సమస్యతో బాధపడుతూ హైదరాబాద్లో సక్సెస్ పుల్గా శస్త్రచికిత్స చేయించుకున్నారు. వైద్యుల సూచన మేరకు కొద్ది రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకున్న అనంతరం తిరిగి ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. సర్జరీ అనంతరం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో వచ్చిన 'ఓజీ' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ 'ఓజీ 2' కూడా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు సంగీత దర్శకుడు ఎస్. థమన్ కూడా మ్యూజిక్ కంపోజింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్, సుజీత్తో కలిసి దిగిన ఫొటోను థమన్ షేర్ చేయడంతో ఈ ప్రాజెక్ట్పై మరింత ఆసక్తి పెరిగింది.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాతుర్మాస దీక్షలో ఉండటంతో షూటింగ్ వెంటనే ప్రారంభం కానుందని భావించడం లేదు. సెప్టెంబర్లో దీక్ష ముగిసిన అనంతరం, ఆయన పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ప్రత్యేక అప్డేట్ ఇచ్చి, సెప్టెంబర్ చివరి వారంలో షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. 'ఓజీ'లో హీరోయిన్గా నటించిన ప్రియాంక మోహన్ స్థానంలో 'ఓజీ 2'లో పూజా హెగ్డే నటించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై మూవీ మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.


Click it and Unblock the Notifications




