నాతో పెద్ద డైరెక్టర్లు తీయరు .. రీమేక్లే గతి.. వీరమల్లు ఈవెంట్లో పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్
జ్యోతికృష్ణ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం హరిహర వీరమల్లు. ఆయన సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్లో ఏఎం రత్నం అత్యంత భారీగా నిర్మించారు. జూలై 24న హరిహర వీరమల్లు చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గరపడనుండటంతో చిత్ర యూనిట్ జూలై 21న హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఉద్వేగంగా ప్రసంగించారు.
రేవంత్ రెడ్డికి గారికి థ్యాంక్స్
చాలా క్లిష్ట పరిస్థితుల మధ్య ఈ ఫంక్షన్ నిర్వహిస్తున్నామని పవన్ తెలిపారు. లక్షలాది మంది అభిమానుల మధ్య హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని అనుకున్నామని.. కానీ వాతావరణం అనుకూలించని కారణంగా శిల్పకళా వేదికకు పరిమితం చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ఈవెంట్స్ చేసుకోవాలంటే చాలా ఒత్తిళ్లు ఉంటాయని, అలాంటి పరిస్దితుల్లో ఈ కార్యక్రమానికి అనుమతులు మంజూరు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. బోనాల పండుగ సమయంలో ఒత్తిడికి గురవ్వకూడదు, తొక్కిసలాట జరగకూడదనే ఉద్దేశంతో డీజీపీ గారు అనుమతి ఇచ్చారని పవన్ కళ్యాణ్ చెప్పారు.

భీమ్లా నాయక్ టికెట్ ధర 10 రూపాయలు
రెండేళ్ల క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు అందరి సినిమాలు వందల్లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ రేట్లు 10 రూపాయలు, 15 రూపాయలతో ఉండేవని గుర్తుచేశారు. మనల్ని ఎవడ్రా ఆపేదని ఆరోజే చెప్పానని.. పవన్ కళ్యాణ్ ఎప్పుడు రికార్డుల కోసం ఫైట్ చేయలేదన్నారు. నేనొక యాక్టర్ అవ్వాలని కోరుకోలేదని, సగటు మనిషిగా బతుకుదామన్న ఒక్క ఆలోచన తప్పించి నాలో ఏం లేదని పవన్ అన్నారు. నేను పడిపోయాను, పడి లేచాను, తిరిగి పడిపోయాను, మళ్లీ లేచానంటే దీనికి కారణం మీరేనని జనసేనాని తన అభిమానుల గురించి పేర్కొన్నారు. 1996లో నా మొదటి సినిమా రిలీజ్ అయ్యి 30 ఏళ్లు కావొస్తుందని, నా వయసు పెరిగిందేమో కానీ గుండెల్లో చావ చావలేదన్నారు.
ఫ్లాప్ పడగానే పక్కనపెట్టారు
హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమా సమయంలో మహబూబ్నగర్కు చెందిన అభిమాని ఒక్క హిట్ ఇవ్వమని అడిగాడని, ఆరోజే నా అభిమానుల కోసం ఒక్క హిట్ ఇవ్వమని భగవంతుడిని కోరుకున్నానని పవన్ కళ్యాణ్ గుర్తుచేసుకున్నారు. జానీ సినిమా ఫ్లాప్ అయిన రోజున ఎంతో బాధపడ్డానని.. వరుసగా హిట్స్ కొట్టుకుంటూ వస్తున్న నాకు ఒక్క సినిమా ఫ్లాప్ అయితే అభిమానులు వదిలి పెట్టలేదన్నారు. ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు అంటారని.. ఈ విషయం సినీ పరిశ్రమలో బాగా తెలుస్తుందన్నారు. ఫ్లాప్ అయ్యాక నా రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేశానని, డబ్బుకు నేనెప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదని బంధం కావాలని అనుకున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు.
త్రివిక్రమ్ నా ఆత్మబంధువు
ఎన్నో కష్టాల మధ్య హరిహర వీరమల్లు సినిమా చేశామని.. నాతో రీమేక్ చేస్తే పనైపోతుంది డబ్బులు వస్తాయని చాలామంది దర్శకులు భావించేవారని జనసేనాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఒక్క ఫ్లాప్ ఇచ్చిన తర్వాత ఫిలిం ఇండస్ట్రీపై గ్రిప్ రాలేదని, మళ్లీ నా కోసం నిలబడింది త్రివిక్రమ్ శ్రీనివాసేనని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. సక్సెస్లో ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు.. కానీ అపజయాల్లో ఉన్నప్పుడు త్రివిక్రమ్ నన్ను వెతుక్కుంటూ వచ్చారని ప్రశంసించారు.

రీమేక్స్ అందుకే చేశా
పార్టీని నడపడానికి, నా భార్యాబిడ్డలను పోషించుకోవడానికి రీమేక్ తప్పించి మరో దారిలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏఎం రత్నం మాత్రం నాతో మంచి సినిమా తీయాలని అనుకున్నారని దీనికి క్రిష్ జాగర్లమూడి బలమైన పునాది వేశారని, కొన్ని అనివార్య కారణాలతో ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని డిప్యూటీ సీఎం చెప్పారు. సినిమా పూర్తవుతుందా? లేదా? అన్న దశలో కీరవాణి సంగీతం నాలో జోష్ తీసుకొచ్చేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ ఈ సినిమా కోసం కీరవాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసి పెట్టారని పవన్ చెప్పారు.
ఆమెను చూసి సిగ్గు తెచ్చుకున్నా
క్రిష్ తప్పుకున్న తర్వాత జ్యోతికృష్ణ ఈ సినిమాను చాలా బాగా హ్యాండిల్ చేశారని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. ఈ సినిమాను నెల రోజులుగా ఒంటి చేత్తో లాక్కొస్తున్న నిధి అగర్వాల్ను చూసి సిగ్గు తెచ్చుకుని నేను కూడా ఈరోజు మాట్లాడానని అన్నారు. నువ్వు ఎంత ఉప ముఖ్యమంత్రివి అయినా, నువ్వు ఈ సినిమాకు హీరోవి అని నిధి అగర్వాల్ నా బాధ్యతను గుర్తు చేశారని తెలిపారు. మీడియాతో రేపు, ఎల్లుండి నా ఇంటరాక్షన్ ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. భీమ్లా నాయక్ సినిమా సమయంలో 10, 15 రూపాయలు ఉన్నప్పుడు బాధపడలేదని.. ఈరోజు ప్రభుత్వం మనదని మీ కోరిక మేరకు టికెట్ రేట్లు పెరిగాయన్నారు.
పవన్ యాక్షన్ కొరియోగ్రఫి
మన టెక్ట్స్ బుక్స్లో మొఘల్స్ గొప్పదనాన్ని చెప్పారని.. కానీ వారి అరాచకాల్ని చెప్పలేదని పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. హిందువుగా బతకాలంటే ఔరంగజేబు ట్యాక్స్ వేశాడని, సొంత తమ్ముడిని చంపాడని తెలిపారు. అభిమానుల కోసం కొంచెం డ్యాన్స్ చేశానని, అలాగే కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ కోసం నేను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ అనుభవంతో 18 నిమిషాల సీక్వెన్స్కు కొరియోగ్రఫి చేశానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రాణం ఉన్నంత వరకు ఈ గుండె మీకోసమే కొట్టుకుంటుందని జనసేనాని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











