సినిమాటోగ్రఫి శాఖ జనసేనదే .. కానీ ఆ నిర్ణయం చంద్రబాబుది.. పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చిత్ర పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు రద్దు చేయడంతో పాటు టికెట్ ధరలను భారీగా తగ్గించింది. ఈ ప్రభావం టాలీవుడ్పై బాగా పడింది. ముఖ్యంగా పవర్స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ టికెట్ ధరలు 10 రూపాయలు, 15 రూపాయల మధ్య ఉండటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలపై పవన్ సైతం ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఉన్న కోపాన్ని సినిమాపై చూపించొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
వీరమల్లుకు ఏపీలో టికెట్ ధరల పెంపు
కట్ చేస్తే.. అదే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతించింది. జూలై 23న రాత్రి 9 గంటలకే ప్రీమియర్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఈ షోకు టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. దీనితోపాటు సింగిల్ స్క్రీన్లలో లోయర్ క్లాస్ 100 రూపాయలు, అప్పర్ క్లాస్ రూ.150, మల్టీప్లెక్స్లలో 200 రూపాయల వరకు పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. హరిహర వీరమల్లు రిలీజైన 10 రోజుల వరకు పెరిగిన ధరలు అమల్లో ఉంటామని ఏపీ ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో తెలిపింది.

ప్రమోషనల్ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్
కాగా.. జూలై 24న హరిహర వీరమల్లు రిలీజ్ నేపథ్యంలో చిత్ర యూనిట్ చివరి నిమిషం వరకు ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉంది. ఇంతటి బిజీ షెడ్యూల్లోనూ పవన్ కళ్యాణ్ తన అధికారిక కార్యక్రమాలకు బ్రేక్ చెప్పి ప్రీ రిలీజ్ ఈవెంట్స్, మీడియాతో ఇంటరాక్షన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వీరమల్లు ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న పవన్.. గత ప్రభుత్వ హయాంలో పడ్డ ఇబ్బందులను గుర్తుచేసుకుంటున్నారు. ఒకప్పుడు అందరు హీరోల టికెట్ ధరలు వందలు, వేలాల్లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమా టికెట్లు మాత్రం 10 రూపాయలు, 15 రూపాయల్లో ఉండేవని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను అప్పుడే మనల్ని ఏవడ్రా ఆపేది అని అభిమానుల్లో ధైర్యం నూరిపోశానని.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమకు అండగా నిలబడుతున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు.
నా సినిమా టికెట్ ధర 10 రూపాయలే
మరికొద్దిగంటల్లో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో విశాఖలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మరోసారి టికెట్ల రేట్ల పెంపుపై ప్రసంగించారు. 'అందరి హీరోల సినిమాలకు టికెట్ ధరలు 100 నుంచి 200 రూపాయలు ఉంటే పవన్ కళ్యాణ్కు స్పెషల్గా 10 రూపాయలు, 15 రూపాయలు ఉంచింది గత ప్రభుత్వం. అలాంటి పరిస్ధితుల్లోనూ భీమ్లా నాయక్ను హిట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు' అని జనసేనాని పేర్కొన్నారు.
ఫైల్ చంద్రబాబు చేతుల్లో పెట్టా
'నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై, సినిమాటోగ్రఫి శాఖ జనసేన పార్టీ చేతుల్లోనే ఉన్నప్పటికీ హరిహర వీరమల్లు టికెట్ రేట్ల పెంపు ఫైలును ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి పంపించా. అందరు హీరోలకు పెంచినట్లే మాకు కూడా పెంచమని చెప్పా. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రూపాయలు ఇస్తే, అంత తీసుకోమని చెప్పా. పవన్ అన్న సినిమా బాగా ఆడాలని ట్వీట్ చేసినందుకు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు' అని పవన్ కళ్యాణ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











