ఆంధ్రాకు వెళ్లాలంటే వీసా, పాస్పోర్టు కావాలా? పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్!
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయ వాతావారణం ఉద్రిక్తంగా మారింది. ముందస్తు ప్లాన్ ప్రకారం మంగళగిరికి వెళ్లాల్సి ఉండటంతో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ విజయవాడకు వెళ్లేందుకు సిద్దమయ్యారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం నుంచి బయలు దేరేందుకు సిద్దమవ్వగా ఏపీ సీఐడీ అధికారులు అనుమతి నిరాకరించినట్టు నోటీసులు పంపారు.
దాంతో పవన్ కల్యాణ్ తన అనుచరులు, నాందేడ్ల మనోహర్తో కలిసి మంగళగిరికి వాహనంలో బయలుదేరారు. అయితే ఆంధ్రా సరిహద్దు దాటగానే పవన్ కల్యాణ్ వాహనాన్ని పోలీసులు అడ్డుకొన్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. రోడ్డు మార్గం ద్వారా పవన్ కల్యాణ్ ప్రయాణంలో జరిగిన సంఘటనల వివరాల్లోకి వెళితే..

చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయనను కలుసుకోవడంతోపాటు మంగళగిరి పార్టీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో సమావేశం గురించి పవన్ కల్యాణ్ విజయవాడకు బయలుదేరారు. అయితే ప్రత్యేక విమానంలో బయలుదేరేందుకు పవన్ కల్యాణ్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకొన్నారు. అయితే ఏపీ సీఐడీ, ఇతర పోలీసులు విభాగం అనుమతి నిరాకరించారు. దాంతో నాదేండ్లతో కలిసి విజయవాడకు వాహనంలో బయలుదేరారు.
రోడ్డు మార్గంలో ఆంధ్రా సరిహద్దు దాటిన తర్వాత పోలీసులు పవన్ కల్యాణ్ ప్రయాణానికి అడుగడుగునా అడ్డంకులు కల్పించారు. ఆంధ్రా సరిహద్దు గరికపాడు దాటిన తర్వాత బారికేడ్లు పెట్టారు. విజయవాడకు వెళ్లేందుకు అనుమతి లేదని వాహనాన్ని నిలిపివేశారు. అయితే పవన్ కల్యాణ్ మౌనంగా ఉంటూ కారులోనే కూర్చొన్నారు. పోలీసుల వాదనలు వింటూ సహనం ప్రదర్శించారు.
వాహనంలో ఉన్న పవన్ కల్యాణ్ ఓ దశలో సహనం కోల్పోయారు. ఆంధ్రాకు వెళ్లడానికి వీసా, పాస్పోర్టు ఉండాలేమో అంటూ కామెంట్ చేశారు. దాంతో పక్కనే ఉన్న నాదేండ్ల .. ఇలాంటి పరిస్థితి అత్యంత దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత వాహనం బయటకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేశారు.
విజయవాడకు వెళ్లేందుకు పవన్ కల్యాణ్ వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. పోలీసులతో పవన్ కల్యాణ్ వాగ్వాదానికి దిగారు. పోలీసులు తమ వైఖరిని అలాగే కొనసాగించడంతో రోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. దాంతో రోడ్డంతా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

అయితే పోలీసులు తనను విజయవాడకు వెళ్లడానికి అనుమతించకపోవడంతో విజయవాడ వరకు వెళ్లేందుకు నడకను ప్రారంభించారు. దాంతో వేలాది మంది ఆయనతో కలిసి కదం తొక్కారు. పవన్ కల్యాణ్కు అనుమతి నిరాకరించడంపై జనసేన నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











