సనాతన ధర్మంతొ పవన్ కల్యాణ్ సతీమణి.. తిరుమలలో తలనీలాలు అర్పించిన అన్నా (Video)
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదల తిరుమలలోని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్నారు. సింగపూర్లో తన కుమారుడు అగ్ని ప్రమాదంలో గాయపడిన సమయంలో శ్రీవారికి మొక్కుకొన్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రి తిరుమల చేరుకొన్న ఆమె హిందూ సంప్రదాయాలు, టీటీడీ నియమ, నిబంధనలు, ప్రమాణాలకు లోబడి తన నీలాలు అర్పించి మొక్కు చెల్లించుకొన్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అరకు పర్యటనలో ఉన్న సమయంలో సింగపూర్లోని ఓ స్కూల్ జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో ఆయన కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు. కాళ్లు చేతులకు గాయాలయ్యాయి. దాంతో చిరంజీవి దంపతులు, పవన్ కల్యాణ్ దంపతులు సింగపూర్కు వెళ్లి తన కుమారుడిని యోగ క్షేమాలు తెలుసుకొన్నారు. వైద్యుల సలహాతో ఆ చిన్నారిని వెంటనే హైదరాబాద్కు తీసుకొచ్చారు. అనంతరం పవన్ కల్యాణ్ సతీమణి తన మొక్కు చెల్లించుకొనేందుకు ఆమె తిరుమలకు ఆదివారం సాయంత్రం చేరుకొన్నారు.

తిరుమలకు చేరుకొన్న తర్వాత అన్యమతస్తులు ఇచ్చే డిక్లరేషన్పై సంతకం చేసి ఆమె సమర్పించారు. అనంతరం గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం శ్రీ వరాహ స్వామి వారి దర్శనానికి వెళ్లారు. స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ వరాహ స్వామి వారి దర్శనం తరవాత పద్మావతి కళ్యాణ కట్టకు చేరుకున్నారు. అక్కడ భక్తులందరితోపాటు తలనీలాలు సమర్పించారు.
సోమవారం వేకువజామున శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లారు. సుప్రభాత సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీమతి అన్నా కొణిదల గారికి వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

టీటీడీ అధికారులకు నిత్యాన్నదానానికి విరాళం అందించారు. తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదం స్వీకరించారు. హిందూ సనాతన ధర్మం ఆచరించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











