ఎంతో మంది కనిపించని రక్తం చిందించారు: పవన్ కళ్యాణ్
అన్ని మైత్రిల కంటే సాహితి మైత్రి చాలా గొప్పది అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తెలకపల్లి రవి రాసిన మన సినిమాలు బుక్ లాంచ్ ఈవెంటులో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మేధావులు, పెద్దలు, కవులు, కళాకారులు వీరి మధ్య మాట్లాడటం తనకు ఇబ్బందిగా, బిడియంగా ఉంటుందని తెలిపారు. జ్ఞాన సరస్వతులు, వారి మధ్యలో కూర్చుని ఏదైనా మాట్లాడటం సాహసమే అని వ్యాఖ్యానించారు.
నేను చాలా మందిని ఎదుర్కోగలను కానీ మెదళ్లను కదిలించగలిగే కవిని, రచయితను ఎదుర్కోవడం చాలా కష్టం. అలా లక్షల, కోట్ల మెదళ్లను కదిలించేవారు ఇక్కడ ఉన్నారు. ఇలాంటి వ్యక్తుల పట్ల నాకు అపారమైన గౌరవం ఉంటుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

తెలకపల్లి రవిగారు రాసిన మన సినిమాలు, అనుభవాలు, చరిత్ర, పరిణామం లాంటి పుస్తకాల వల్ల మన సినిమా చరిత్ర అందరికీ తెలుస్తుందని తెలిపారు. పెద్దలు రావికొండలరావుగారు చెప్పినట్లు మన చరిత్ర రాసేవారు లేకుంటే అది కనుమరుగు అవుతుందని పవన్ తెలిపారు.
సినిమా ఫంక్షన్లలో నేను మాట్లాడకపోవడానికి కారణం నేను మాట్లాడలేక కాదు. అక్కడ ఎంత మంది ఏం చదువుకుని వచ్చారు... ఎంత అనుభవంతో వచ్చారో తెలుసు. వాళ్ల ముందు నేను తలదించుకుని ఎందుకు ఉంటానంటే అలాంటి అనుభవజ్ఞుల ముందు తల ఎగరవేయడం కుదరదు. ఒక వ్యాక్యం రాయడం ఎంత కష్టమైన ప్రక్రియ అంటే... ఎన్నో రక్తపు చుక్కలు కారితే తప్ప నుదుటిలో నుంచి ఒక వ్యాక్యం రాయలేం. ఇక్కడ ఎంతో మంది కవులు, రచయితలు, మేధావులు కనిపించని రక్తాన్ని చిందించారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications