ఆ రోజు ఏదో తిక్కలో ఉన్నా.. త్రివిక్రమ్ను అందుకే అలా , క్షమాపణలు చెప్పిన స్టార్ ప్రొడ్యూసర్
సాదాసీదా కమెడియన్గా, హీరోల ప్రక్కన అసిస్టెంట్గా కెరీర్ మొదలుపెట్టి.. తర్వాత నిర్మాతగా మారి, కోట్లాది రూపాయల బడ్జెట్తో స్టార్ హీరోలతో సినిమాలు తీసే రేంజ్కి ఎదిగాడు బండ్ల గణేష్. ఎంత వేగంగా టాప్ పొజిషన్లోకి వచ్చాడో, అంతే వేగంగా పరిశ్రమకు దూరమయ్యాడు. ఇప్పుడు ఆయన బ్యానర్ నుంచి ఏ సినిమాలు రావడం లేదు. దీనికి తోడు కాంట్రవర్సీ కామెంట్స్తో ఎన్నో వివాదాలు . అయినప్పటికీ నేనింతే, నా తీరింతే అన్నట్లుగా ముందుకెళ్తున్నాడు బండ్ల గణేష్.
ప్రస్తుతం సినిమాలకు దూరంగా తన ఫౌల్ట్రీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చూసుకుంటున్న గణేష్.. యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ కాలం గడుపుతున్నాడు. రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఎక్కువ కావడంతో అటు వైపు వెళ్లారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున బండ్ల గణేష్ ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో హస్తం పార్టీ ఓడిపోవడంతో కొంతకాలం సైలెంట్ అయ్యారు. 2023 ఎన్నికల సమయంలో తిరిగి కాంగ్రెస్కు మద్ధతుగా ప్రచారం చేశారు.

మెగా ఫ్యామిలీకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు వీరాభిమాని అయిన గణేష్.. వేదికలపై మైక్ అందుకున్నారంటే చాలు పూనకంతో ఊగిపోతాడు. మనోడి ఓవరాక్షన్ కారణంగా కొన్ని ఈవెంట్లకు పిలవడం లేదని ఇండస్ట్రీ టాక్. తాజాగా దర్శకుడు, రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్కు బండ్ల గణేష్ క్షమాపణలు చెప్పారు. అసలేం జరిగిందంటే..
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో గబ్బర్ సింగ్కు ప్రత్యేక స్థానముంది. రకరకాల సినిమాలు చేస్తూ వచ్చినప్పటికీ ఆయన ఒక్క హిట్ కూడా కొట్టకపోవడంతో ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. ఈ దశలో పవన్ అభిమానులను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది గబ్బర్ సింగ్. మే 11, 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. పవన్ కళ్యాణ్ను అభిమానులు ఎలా చూడాలనుకున్నారో అలా చూపించి వారి ఆకలిని తీర్చారు హరీష్ శంకర్. రూ.30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజుల్లోనే రూ.79 కోట్ల వసూళ్లను సాధించింది. 306 కేంద్రాల్లో 50 రోజులు... 65 కేంద్రాల్లో 100 రోజులు ఆడి పవన్ స్టామినా ఏంటో నిరూపించింది.
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గబ్బర్ సింగ్ను 4కే వెర్షన్లో సెప్టెంబర్ 2న రీరిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు తెలిపేందుకు చిత్ర యూనిట్ శనివారం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. తనకు గబ్బర్ సింగ్ తెరకెక్కించే అవకాశం రావడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అని తెలిపారు. అలాంటి వ్యక్తి పట్ల తాను అమర్యాదగా ప్రవర్తించానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్కు ముందు ఏదో మూడ్లో ఉన్నానని.. సరిగ్గా ఆ సమయంలోనే ఓ అభిమాని ఫోన్ చేసి ఈవెంట్కు వస్తున్నారా అని అడిగాడని బండ్ల గణేష్ గుర్తుచేశారు. దీనికి తాను బదులిస్తూ.. త్రివిక్రమ్ తనను ప్రీ రిలీజ్కు రావొద్దన్నాడని ఏదో వాగానని తెలిపాడు. ఇందుకు గాను త్రివిక్రమ్కు క్షమాపణలు చెబుతున్నట్లు బండ్ల గణేష్ వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











