HariHara VeeraMallu: హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ లాక్.. ఎప్పుడు? ఎక్కడంటే?
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తర్వాత నటించిన చిత్రం హరిహర వీరమల్లు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. నిధి అగర్వాల్, బాబీ డియోల్, నోరా ఫతేహి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకోవడంతో పాటు పలుమార్లు వాయిదా పడిన హరిహర వీరమల్లు మూవీ అన్ని అవాంతరాలను దాటుకుని జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ? ఎప్పుడు? చీఫ్ గెస్ట్ ఎవరు? అంటూ పవన్ అభిమానులు తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ వివరాల్లోకి వెళితే.
వీరమల్లు నుంచి తప్పుకున్న క్రిష్
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఐదేళ్ల క్రితం సెట్స్ మీదకు వెళ్లింది హరిహర వీరమల్లు. ఈలోపు కోవిడ్, లాక్డౌన్లు రావడంతో, పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీ కావడం, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో హరిహర వీరమల్లు షూటింగ్ నత్తనడకన సాగింది. ఈ ఆలస్యం కారణంగా ప్రాజెక్ట్ నుంచి క్రిష్ జాగర్లమూడి తప్పుకున్నారు. దీంతో వీరమల్లుకు డైరెక్టర్గా నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ బాధ్యతలు స్వీకరించారు. పవన్ లేని సన్నివేశాల చిత్రీకరణ, వీఎఫ్ఎక్స్ పనులను ఆయన పరుగులు పెట్టించారు.

4 గంటల పాటు ఏకధాటిగా డబ్బింగ్
ఈలోపు ఆంధ్రప్రదేశ్లో పాలన, రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ కుదురుకున్నాక తను కమిటైన సినిమాలను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలుత వీరమల్లును పూర్తి చేసి నిర్మాతకు భారం తగ్గించాలని నిర్ణయించారు. అలాగే తను తీసుకున్న రెమ్యునరేషన్ను కూడా పవన్ కళ్యాణ్ తిరిగి ఇచ్చేశారు. పాలనను చూసుకుంటూనే వీలున్నప్పుడల్లా సినిమా షూటింగ్లో పాల్గొంటూ వచ్చారు డిప్యూటీ సీఎం. షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన ఆయన 4 గంటల పాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి సినిమాను రిలీజ్కు రెడీ చేశారు.
పలుమార్లు వాయిదాపడ్డ వీరమల్లు
తొలుత హరిహర వీరమల్లును మార్చి 28న విడుదల చేయాలనుకున్నారు. అప్పుడు షూటింగ్ పూర్తి కాకపోవడంతో మే 9కి, మళ్లీ జూన్ 12కి వాయిదా పడింది. తీరా జూన్ 12న వస్తుందనుకుంటే అప్పుడు వీఎఫ్ఎక్స్తో కూడా కొన్ని పనులు పెండింగ్ ఉండటంతో మరోసారి వాయిదా పడింది. ఎట్టకేలకు జూలై 24న హరిహర వీరమల్లును రిలీజ్ చేస్తున్నట్లు మెగా సూర్య ప్రొడక్షన్స్ ప్రకటించింది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. దీనిలో భాగంగా ఇటీవల విడుదల చేసిన ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది.
హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ?
అంతా బాగానే ఉంది కానీ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ? ఎప్పుడు? చీఫ్ గెస్ట్ ఎవరు? అంటూ చిత్రసీమలో చర్చ జరుగుతోంది. గతంలో జూన్ 12న సినిమా రిలీజ్ అనుకున్నప్పుడు తిరుపతిలోని తారక రామ స్టేడియంలో వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు. అప్పుడు సినిమా వాయిదా పడటంతో ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు జూలై 24న సినిమా విడుదల కానుండటంతో రిలీజ్కు నాలుగు రోజుల ముందు ఈవెంట్ నిర్వహించాలని భావిస్తున్నారు. గతంలో ప్రకటించిన విధంగానే తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని అంటున్నారు. ఇదే విషయాన్ని నిర్మాత ఏఎం రత్నం కూడా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ముందుగా అనుకున్నట్లు తిరుపతిలోనే ఈవెంట్ జరుగుతుందని ఒకవేళ వర్షాలు ఉంటే విజయవాడలోని ఓ ఇండోర్ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు రత్నం చెప్పారు.
చీఫ్ గెస్ట్ ఎవరు?
అయితే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్ ఎవరు? అనేది ఇప్పుడు క్శశ్చన్ మార్క్గా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరైనా ఈ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా వస్తారా? లేక ఎవరు లేకుండా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగానే కార్యక్రమాన్ని ముగిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











