తెలంగాణలో ఒక రోజు ముందే OG ప్రీమియర్లు.. టికెట్ రేట్ల పెంపు.. పవన్ మూవీ బెన్ఫిట్ షో టికెట్ ధర ఎంతంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ (OG) సినిమాకు టికెట్ రేట్లు పెంచుతూ.. అలాగే పెయిడ్ ప్రీమియర్లకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దర్శకుడు సుజిత్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ మూవీకి నిబంధనలు సడలించి టికెట్ రేట్లను పెంచుతూ జీవోను జారీ చేసింది. తెలంగాణలో ఈ సినిమా టికెట్ రేట్లు ఎంత? పెయిడ్ ప్రీమియర్ ఎన్ని గంటలకు? పెయిడ్ ప్రీమియర్ టికెట్ రేట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా RRR లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన టాప్ ప్రొడక్షన్ కంపెనీ డీవీవీ ఎంటర్టైనర్ బ్యానర్పై డీవీవీ దానయ్య నిర్మాతగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఓజీ (OG) గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.

ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ ఎస్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో టికెట్ రేట్లు, అదనపు షోలకు అనుమతి ఇవ్వాలని నిర్మాత డీవీవీ దానయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఆయన రిక్వెస్ట్ మేరకు తెలంగాణ సర్కార్ సానుకూలంగా స్పందించింది.
ఓజీ మూవీ నిర్మాత అభ్యర్థనను పరిశీలించి పరిగణనలోకి తీసుకొన్న తర్వాత ఒక అదనపు షోకు, అలాగే రిలీజ్కు ఒక రోజు ముందే బెన్ఫిట్ పెయిడ్ ప్రీమియర్కు, అలాగే టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సింగిల్ థియేటర్లో టికెట్ రేటుపై 100 రూపాయలు పెంపు, మల్టీ ప్లెక్స్లో టికెట్ రేటుపై 150 రూపాయలు పెంపు (జీఎస్టీతో కలిపి) ఉటుంది అని జీవోలో సర్కార్ వెల్లడించింది.
ఇక సెప్టెంబర్ 24వ తేదీన రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే షో కోసం టికెట్ రేటును 800 రూపాయలుగా (జీఎస్టీ) నిర్ణయించడం జరిగింది అని తమ జీవొలో ప్రత్యేకంగా తెలిపారు. ఈ విషయం గురించి జిల్లా కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు, పోలీస్ కమిషనర్లకు, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని జీవో ద్వారా తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా సూచించారు.


Click it and Unblock the Notifications











