‘వకీల్ సాబ్’ నుంచి ఉమెన్స్ డే స్పెషల్ సర్ప్రైజ్: వాళ్లతో కలిసి వచ్చిన పవన్ కల్యాణ్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన 'అజ్ఞాతవాసి' తర్వాత సినిమాలకు బ్రేకిచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ముఖానికి మేకప్ వేసుకున్నాడు. ఆయన కమ్బ్యాక్ మూవీగా వస్తున్నదే 'వకీల్ సాబ్'. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాను దిల్ రాజుతో పాటు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సర్ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్.
మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం 'వకీల్ సాబ్' నుంచి స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో పవన్ కల్యాణ్తో పాటు ముగ్గురు హీరోయిన్లు నివేదా థామస్, అంజలి, అనన్య కలిసి దర్శనమిచ్చారు. ఈ సినిమాలో ఈ ముగ్గురు నటీమణులు వ్యభిచార గృహాల్లో చిక్కుకున్న అమ్మాయిల్లా కనిపించనున్నారు. వీళ్లను న్యాయం చేసేందుకు లాయర్ అయిన పవన్ కల్యాణ్ సాగించే పోరాటమే 'వకీల్ సాబ్' మూవీ కథ అని ఇప్పటికే తెలుసు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో హీరోతో పాటు ఆ ముగ్గురు హీరోయిన్లకు కూడా సమానమైన ప్రాధాన్యం కల్పించారని తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నుంచి ఏది విడుదలైనా భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ మూవీ మార్కెట్ కూడా గణనీయంగా జరుగుతోన్నట్లు తెలుస్తోంది. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన 'పింక్'కు ఈ చిత్రం రీమేక్గా వస్తోంది. ఇక, ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో పవన్ కల్యాణ్ మూడు విభిన్నమైన గెటప్లలో కనిపిస్తాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా, ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











