Janhvi Kapoor: పెద్దిలో జాన్వీకపూర్ పాత్రపై ట్రోలింగ్.. బుచ్చిబాబు క్షమాపణలు
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన పెద్ది మూవీ జూన్ 4వ తేదీన వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యింది. ప్రీమియర్ షో నుంచే హిట్ టాక్తో దూసుకెళ్తోన్న ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద కూడా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలిరోజు ఏకంగా 135 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టి.. రామ్ చరణ్ కెరీర్లో సోలోగా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా నిలిచింది పెద్ది. ఫస్ట్ వీకెండ్లో పెద్ది ఖచ్చితంగా 250 నుంచి 300 కోట్ల రేంజ్లో వసూళ్లు రాబడుతుందని భావిస్తున్నారు.
సినిమా చూసిన వాళ్లంతా రామ్ చరణ్ యాక్టింగ్, పాత్ర కోసం ఆయన పడ్డ కష్టం గురించే మాట్లాడుకుంటున్నారు. చరణ్ను ఆకాశానికెత్తేస్తున్నారు. ఇదే సమయంలో హీరోయిన్గా నటించిన జాన్వీ కపూర్ గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆమె పాత్రకు అన్యాయం చేశారని.. కేవలం గ్లామర్ షోకి, హీరోకి ముద్దులు పెట్టడానికే మాత్రమే జాన్వీ కపూర్ను వాడుకున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రీమియర్ షోలు ముగిసిన నాటి నుంచే జాన్వీకపూర్ పాత్ర గురించి ఆన్లైన్లో డిస్కషన్ మొదలైంది. సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా విమర్శలు చేస్తున్నారు. స్వయంగా జాన్వీ కపూర్ కూడా తన పాత్రపై వచ్చిన నెగిటివ్ రివ్యూకి లైక్ కొట్టడం చర్చనీయాంశమైంది.

భారతీయ చిత్ర పరిశ్రమలో హిట్ పెయిర్గా గుర్తింపు తెచ్చుకున్నారు లెజెండరీ నటులు చిరంజీవి- శ్రీదేవి. వీరిద్దరూ కలిసి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా తెలుగులో ఆల్టైం క్లాసిక్స్లో ఒకటిగా నిలిచింది. అలాంటి వీరిద్దరి వారసులు కలిసి నటిస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా దేవర తర్వాత జాన్వీ కపూర్ నటిస్తోన్న రెండో సినిమా కావడంతో హైప్ క్రియేట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లలో జాన్వీ అందచందాలు కుర్రకారును ఆకట్టుకున్నాయి. దాంతో సినిమాలో కూడా మంచి స్కోప్ లభించి ఉండొచ్చని భావించారు.
అయితే సినిమా రిలీజైన తర్వాత జాన్వీకపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్రను బుచ్చిబాబు సరిగా డిజైన్ చేయలేదని, కేవలం గ్లామర్ షో కోసమే ఆమెను తీసుకున్నారని పాటలు, రొమాంటిక్ సీన్ల కోసమే ఆమెను పరిమితం చేశారని మండిపడుతున్నారు. అంతేకాదు రామ్ చరణ్- జాన్వీల మధ్య వచ్చే కొన్ని సీన్లు, సంభాషణలు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ బుచ్చిబాబును ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే మరికొందరు మాత్రం బుచ్చిని వెనకేసుకొస్తున్నారు. కొన్ని సన్నివేశాల్లో, పాటల్లో జాన్వీ కపూర్ అద్భుతంగా నటించిందని.. సెకండాఫ్లో కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన బాగుందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. రామ్ చరణ్ వన్ మ్యాన్ షోతో కట్టిపడేస్తున్నప్పుడు ఈ సినిమాలో మరో ఆర్టిస్ట్కి గుర్తింపు రావడం కష్టమేనని.. ఈ సినిమా హిట్ కావడంతో జాన్వీకి లక్కీ గర్ల్ అనే పేరొచ్చిందని అంటున్నారు. కానీ విమర్శలు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు సానా స్పందించారు.
ఈ మేరకు ఆయన సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఒక ఫిల్మ్ మేకర్గా.. సినిమా ప్రేక్షకులను అలరించాలి, ప్రేరేపించాలి, వారి హృదయాలను స్పృశించాలని నేను నమ్ముతాను. అది ఎవరినీ అసౌకర్యానికి గురిచేయకూడదు, అవమానించినట్లుగా బావించకూడదు. పెద్దిలో కొన్ని సన్నివేశాల గురించి వస్తున్న ఫీడ్బ్యాక్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. తెరపైనే కాకుండా తెర వెనుక కూడా నాకు మహిళల పట్ల ఎల్లప్పుడూ అపారమైన గౌరవం ఉంది. ఏ మహిళా పాత్రను వస్తువుగా చిత్రీకరించడం గానీ అగౌరవపరచడం గానీ మా ఉద్దేశ్యం కాదు. ఒకవేళ సినిమాలోని ఏ భాగాన్ని అయినా ఆ విధంగా భావించి ఉంటే మేము ఆ భావాలను గౌరవిస్తాము.. ఈ ఆందోళనలను అర్దం చేసుకుంటున్నాం, ఇందుకు మనస్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నాము.
ఇప్పటి వరకు అందిన అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత.. సంబంధిత భాగాలలో మార్పులు చేయాలని మేము నిర్ణయించుకున్నాము, ప్రేక్షకుల ఆదరణతోనే సినిమా అభివృద్ధి చెందుతుంది. కథకులుగా మారుతున్న దృక్పథాలను, సున్నితమైన అంశాలను పరిగణనలోనికి తీసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. ప్రతి స్త్రీ గౌరవంచబడటానికి, విలువ ఇవ్వబడటానికి, గౌరవప్రదంగా ప్రాతినిధ్యం వహించడానికి అర్హురాలు. ఆ విలువలను నిలబెట్టే కథలను చెప్పడానికి మేము కట్టుబడి ఉన్నాము. తమ అభిప్రాయాలను నిజాయితీగా, చిత్తశుద్ధితో పంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని బుచ్చిబాబు రాసుకొచ్చారు.


Click it and Unblock the Notifications


