Peddi: రామ్ చరణ్కు బిగ్ షాక్.. మరో వివాదంలో పెద్ది!
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ 'పెద్ది'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. కానీ, మరోవైపు వివాదాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్రను తెరపై చూపించిన విధానంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా, తాజాగా ఆదివాసీ సంఘాలు రంగంలోకి దిగడంతో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. గిరిజన సమాజాన్ని అవమానించేలా సినిమాలో కొన్ని పదాలు, సంభాషణలు, సన్నివేశాలు ఉన్నాయంటూ ఆదివాసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
సినిమా విడుదలైన కొద్ది రోజులకే భారీ వసూళ్లతో దూసుకుపోతున్న 'పెద్ది'పై మొదటగా మహిళా సంఘాలు, సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పించారు. జాన్వీ కపూర్ పాత్రను కొన్ని సన్నివేశాల్లో అనవసరంగా గ్లామరైజ్ చేశారని, కెమెరా యాంగిల్స్ కూడా అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలు తీవ్రరూపం దాల్చడంతో దర్శకుడు బుచ్చిబాబు స్వయంగా స్పందించి మహిళల మనోభావాలు దెబ్బతిన్నట్లయితే క్షమించాలని కోరారు. అంతేకాకుండా వివాదాస్పదంగా భావించిన కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేయడంతో పాటు కొన్ని షాట్లను తొలగించినట్లు ప్రకటించారు.

అయితే ఆ వివాదం పూర్తిగా చల్లారకముందే తాజాగా గిరిజన సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సినిమా కథలో ఉపయోగించిన కొన్ని పదాలు, సంభాషణలు గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆదివాసీ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ సంప్రదాయాలు, జీవన విధానం, సంస్కృతిని సరైన అవగాహన లేకుండా తెరకెక్కించారని వారు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన హక్కుల చట్టాల్లో అభ్యంతరకరంగా పరిగణించే కొన్ని పదాలను సినిమాలో పదేపదే వినియోగించారని, ఇది సమాజంలో తమపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న ఆదివాసీ సంఘాల ప్రతినిధులు విజయనగరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు అధికారిక ఫిర్యాదు చేశారు. సినిమాలో దాదాపు 15 సార్లు గిరిజనులను కించపరిచేలా పదాలు ఉపయోగించారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేవలం చిత్రబృందంపైనే కాకుండా, అలాంటి కంటెంట్ను పరిశీలించి అనుమతి ఇచ్చిన కేంద్ర సెన్సార్ బోర్డు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సెన్సార్ అధికారులు ఈ అంశాన్ని గుర్తించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు.
ఈ మూవీ మేకర్స్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ సంఘాలు ప్రధాన డిమాండ్ చేస్తున్నాయి. గిరిజన సమాజ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, చిత్ర యూనిట్తో పాటు సెన్సార్ అధికారులపై కూడా అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ ఇప్పుడు సినీ పరిశ్రమలో కూడా చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే, వివాదాల మధ్య కూడా 'పెద్ది' బాక్సాఫీస్ లో దుమ్మురేపుతోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.292.5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి రూ.300 కోట్ల క్లబ్కు చేరువైంది. రామ్ చరణ్ కెరీర్లోనే అత్యంత వేగంగా వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. నైజాం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఓవర్సీస్ మార్కెట్లలో సినిమా మంచి కలెక్షన్లు రాబడుతోంది.


Click it and Unblock the Notifications




