Peddi: పెద్ది ఐటెం సాంగ్పై విమర్శలు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన అనంత్ శ్రీరామ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కించిన 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. జూన్ 4న విడుదలైన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన అందుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా విడుదలైన 10 రోజులు పూర్తయ్యే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.378 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిందని చిత్రబృందం వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ మార్కెట్, ఓవర్సీస్లోనూ సినిమా సత్తా చాటుతోంది. అతి త్వరలోనే 400 కోట్ల మార్క్ కు దాటే అవకాశముంది. ఇలాంటి ఘన విజయంపై సాధించి పెద్ది విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఐటెం సాంగ్ పై కూడా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఈ ట్రోల్స్ పై సినీ గేయరచయిత అనంత శ్రీరామ్ ఘాటుగా స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే?
సినిమా ఇండస్ట్రీలో ఒకే సినిమాలోని అన్ని పాటలను ఒకే రచయిత రాయడం అరుదైన విషయం. అలాంటిది, భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తున్న 'పెద్ది'సినిమాలో మొత్తం పాటలను ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ రాయడం విశేషంగా మారింది. ముఖ్యంగా ఈ ఆల్బమ్లోని పాటలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతుండగా, అందులోని ఓ స్పెషల్ ఐటెం సాంగ్ మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఒకవైపు ఈ పాట మాస్ ఆడియన్స్ను ఉర్రూతలూగిస్తుంటే, మరోవైపు సాహిత్యంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన 'పెద్ది'సక్సెస్ మీట్లో అనంత శ్రీరామ్ తనపై వచ్చిన విమర్శలకు గట్టిగానే స్పందించారు.

ఈ కార్యక్రమంలో అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. తన పాటను టార్గెట్ చేస్తూ జరుగుతున్న విమర్శలపై ఎలాంటి మొహమాటం లేకుండా స్పందించారు. 'ఐటమ్ సాంగ్ను ఐటమ్ సాంగ్లా ఆస్వాదించిన వాళ్లకు మేము ఒక స్పెషల్ రుచి చూపించాం. అలా కాకుండా దాన్ని ఐటమ్ సాంగ్లా ఎంజాయ్ చేయకుండా విమర్శించే వాళ్లు ఉన్నారే.. వాళ్లే అసలైన ఐటమ్ గాళ్లు' అంటూ దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ సభలో నవ్వులు పూయించడమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
అనంత శ్రీరామ్ మాట్లాడుతూ విమర్శలు, ఆరోపణలు చేయడంలో తప్పేమీ లేదని, కానీ, అవి స్పష్టంగా, తార్కికంగా ఉండాలని అన్నారు. 'ఏదో కోపంతో, లోపల ఉన్న అసహనాన్ని బయటపెట్టడం లేదా ప్రత్యేకమైన ఎజెండాలు పెట్టుకుని బురద చల్లడానికో మాట్లాడితే నేను స్పందించాల్సిన అవసరం లేదు. తాత్వికంగా ఆలోచించి, తార్కికంగా మాట్లాడుతూ.. నా పాటలోని ఫలానా పదం తప్పు, ఫలానా వాక్యం సమాజానికి హానికరం అని నిర్దిష్టంగా చెబితే, దానికి సమాధానం చెప్పడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను"అని స్పష్టం చేశారు. విమర్శ అంటే విమర్శలా ఉండాలని, వ్యక్తిగత దూషణలు చేయడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు తనపై వ్యక్తిగత దాడులు కూడా చేశారని అనంత శ్రీరామ్ తెలిపారు. "దొంగనా కొడకా" వంటి పదాలతో కామెంట్లు చేసిన వారిని ఉద్దేశిస్తూ ఆయన ఆసక్తికరంగా స్పందించారు. ఈ విషయంపై యాంకర్ ప్రశ్నించగా, "ఆ తిట్లకు నేను కోపపడలేదు. వాటికి సమాధానం నా పాటలోనే ఉంది" అని చెప్పి, తనే రాసిన ఓ చరణాన్ని పాడి వినిపించారు. "ఒక్కో తిట్టు ఒక్కొక్క బొట్టుగా ఏదిద్దేటట్టు నేనొట్టు పెట్టనా... నాకు ఏ రోజునో నీ రాజనం పట్టేదా... నిందా నా కట్టె కాలేలోగా..." అంటూ తనదైన స్టైల్ సమాధానం ఇచ్చారు. తనను విమర్శించే వారికీ, తిట్టే వారికీ సమాధానం కూడా తన రచనల ద్వారానే ఇస్తానని అనంత శ్రీరామ్ చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
అంతేకాదు, రచయితగా తన ఆలోచనలపై కూడా అనంత శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఒక రచయితకు అవధులు ఉండకూడదు. రచన అనేది ఊహాశక్తి, ఆలోచనా శక్తికి సంబంధించినది. ఏ పాట రాస్తున్నామన్న దానికంటే, ఆ సందర్భానికి తగ్గ భావాన్ని ఎంత బలంగా చెప్పగలిగామన్నదే ముఖ్యమని నేను నమ్ముతాను'అని తెలిపారు. ఒక స్పెషల్ సాంగ్ అయినా, మెలోడీ అయినా, భావోద్వేగ గీతం అయినా రచయిత బాధ్యత అదే అని చెప్పారు. మొత్తంగా 'పెద్ది' ఐటెం సాంగ్పై వచ్చిన విమర్శలకు అనంత శ్రీరామ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.


Click it and Unblock the Notifications




