రామ్ చరణ్ పై నెగిటివిటీ.. పెద్ది మేకర్స్ సంచలన నిర్ణయం!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ 'పెద్ది' విడుదలకు సర్వం సిద్ధమైంది. 'ఉప్పెన' వంటి బ్లాక్బస్టర్ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలను సృష్టించింది. గ్రామీణ క్రీడల నేపథ్యంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. అయితే, సినిమా విడుదలకు ముందు సాధారణ ప్రమోషన్స్తో పాటు ట్రోలింగ్, పైరసీపై మూవీ మేకర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవలి కాలంలో పెద్ద సినిమాల విడుదలకు ముందు సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరగడం సాధారణమైపోయింది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల విషయంలో ఫేక్ అకౌంట్లు, ట్రోల్ పేజీలు, పెయిడ్ క్యాంపెయిన్లు పెద్ద ఎత్తున నడుస్తున్నాయనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. అలాగే, పెద్ది విషయంలో కూడా అలాంటి పరిస్థితులే కనిపించడంతో మూవీ మేకర్స్ ముందుగానే అప్రమత్తమైంది. సోషల్ మీడియా వేదికలైన ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్లో పలు ఫేక్ అకౌంట్ల ద్వారా రామ్ చరణ్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, సినిమాపై కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంటూ మేకర్స్ సైబర్ క్రైమ్ అధికారులను ఆశ్రయించారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి, హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన మరో వ్యక్తిపై ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు సమాచారం. అయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, దీని వెనుక మరింత పెద్ద నెట్వర్క్ ఉండే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. కొన్ని గ్రూపులు డబ్బులు తీసుకుని కావాలనే సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రెండ్స్ సృష్టిస్తున్నాయా? అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, కొన్ని అకౌంట్లు ఒకే తరహా కంటెంట్ను భారీగా షేర్ చేయడం, ఒకే సమయంలో నెగిటివ్ హ్యాష్ట్యాగ్లను ట్రెండ్ చేయడం వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయి.
మరోవైపు.. ట్రోలింగ్తో పాటు పైరసీని కూడా 'పెద్ది' మేకర్స్ సీరియస్గా తీసుకున్నారు. సినిమా విడుదలకు ముందే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన నిర్మాతలు, సినిమాని అక్రమంగా లీక్ చేయకుండా ప్రత్యేక రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై స్పందించిన కోర్టు 'యాంటీ-పైరసీ ఇంజంక్షన్' మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి అనుమతి లేకుండా ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడం, టెలిగ్రామ్, టోరెంట్, పైరసీ వెబ్సైట్లలో ప్రసారం చేయడం చట్టవిరుద్ధం . ఈ నేపథ్యంలో ఈ కేసులో కోర్టు 'డైనమిక్ ఇంజంక్షన్'ను కూడా మంజూరు చేసింది.
సాధారణంగా ఒక పైరసీ వెబ్సైట్ను బ్లాక్ చేస్తే, నిర్వాహకులు కొత్త డొమైన్ లేదా యూఆర్ఎల్తో మళ్లీ ప్రత్యక్షమవుతుంటారు. కానీ ఈసారి అలాంటి అవకాశాలకు కూడా ముందుగానే చెక్ పెట్టేలా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకసారి గుర్తించిన పైరసీ నెట్వర్క్ కొత్త పేర్లతో వచ్చినా వాటిని కూడా వెంటనే బ్లాక్ చేసే అధికారం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు లభించింది. ఇది మూవీ మేకర్స్ కు ఊరట అనే చెప్పాలి. ఇక పెద్ది విడుదలకు ముందు ఏర్పడిన ఈ పరిణామాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇక జూన్ 4న విడుదలయ్యే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications



