Devara Pre Release Event : ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీరంగం.. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్లో రసాభాస
సినీ తారలను దేవుళ్లుగా ఆరాధించే అభిమానులున్న దేశంలో ఏదైనా కార్యక్రమం నిర్వహించినప్పుడు నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి . లేనిపక్షంలో విధ్వంసం తప్పదని కొన్ని ఘటనలు నిరూపించాయి. సినిమా ఈవెంట్లలో పాల్గొనేందుకు వచ్చే జనాన్ని అంచనా వేయడం కష్టం. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు లేకుంటే గొడవలు, ఘర్షణలు భారీగా జరుగుతాయి. రెండ్రోజుల క్రితం రజనీకాంత్ వేట్టయాన్ కార్యక్రమంలో జరిగిన గొడవ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ఇదే రిపీట్ అయ్యింది. ఈ వివరాల్లోకి వెళితే..
కొరటాల శివ- జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ కానుంది. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్లు దేవర ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. సినిమా రిలీజ్కు సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది.

సెప్టెంబర్ 10న ముంబైలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్, కొరటాల, సైఫ్, జాన్వీలు బాలీవుడ్ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూనే, సినిమా విశేషాలను పంచుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లోనూ చిత్ర యూనిట్ పాల్గొంది. మరోవైపు .. దేవరకు సీబీఎఫ్సీ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ మూవీ రన్ టైమ్ విషయానికి వస్తే 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు. దేవరను యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై మిక్కిలినేని సుధాకర్ , నందమూరి కళ్యాణ్రామ్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
వచ్చే వారం సినిమా రిలీజ్ కానుండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి సినిమాకు మంచి హైప్ తీసుకురావాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. సెప్టెంబర్ 22న హైదరాబాద్లోని నోవాటెల్ వేదికగా ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. తొలుత ఈ ఈవెంట్ను ఏపీలో నిర్వహించాలని అనుకున్నా.. విజయవాడలో వరదల నేపథ్యంలో వేదిక హైదరాబాద్కు మారినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రశాంత్ నీల్లు ఈ ఈవెంట్కు వస్తారని ఫిలింనగర్లో చర్చ జరుగుతోంది.
ఇదిలాఉండగా.. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. ఈ కార్యక్రమం కోసం ఎన్టీఆర్ అభిమానులు భారీగా పోటెత్తగా.. వేదిక ఏ మూలకు సరిపోలేదు. ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ఫ్యాన్స్ ఎగబడటంతో పలువురు కిందపడిపోగా.. ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు ఫర్నీచర్ ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో దాదాపు 100 మంది వరకు గాయపడినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











