ఆంజనేయస్వామి దేవుడు కాదు.. ఆదిపురుష్ డైలాగ్ రైటర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. భగ్గుమంటున్న భక్తులు
వాల్మికీ రామాయణం ఆధారంగా రూపొందిన ఆదిపురుష్ సినిమాను భారీగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ సినిమాలోని పాత్రల చిత్రీకరణ తీరు, డైలాగ్స్ రాసిన విధానంపై రామభక్తులు దారుణంగా విరుచుకుపడుతున్నారు. హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా సినిమాను తెరకెక్కించారని, ఆ సినిమాను నిషేధించాలనే డిమాండ్లు భారీగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆదిపురుష్ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. మనోజ్ చేసిన కామెంట్ల వివరాల్లోకి వెళితే...
ఆదిపురుష్ సినిమా రిలీజైన తర్వాత ఈ సినిమాలోని డైలాగ్స్ అత్యధికంగా విమర్శలకు గురైన అంశంగా మారాయి. మనోజ్ ముంతాషిర్ను టార్గెట్ చేస్తూ విమర్శలు వెల్లువెత్తాయి. ఒకవైపు విమర్శలు కుప్పలు తెప్పలుగా వస్తుంటే.. ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదమయ్యాయి. ఆంజనేయస్వామి దేవుడు కాడు అంటూ చేసిన వ్యాఖ్యలపై సినీ అభిమానులు, దేశ ప్రజలు ఘాటుగా స్పందిస్తున్నారు.

జాతీయ మీడియాకు చెందిన ప్రముఖ టెలివిజన్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఆదిపురుష్ సినిమాలో రాసిన డైలాగ్స్ను సమర్ధించుకొన్నారు. భజరంగబలి లేదా హనుమంతుడు దేవుడు కాదు. కేవలం రాముడికి పెద్ద భక్తుడిగానే మేము పరిగణించాం అని రచయిత మనోజ్ ముంతాషిర్ వ్యాఖ్యలు చేశారు.
భజరంగ్బలి దేవుడు కాదు. ఆయన భక్తుడు. ఆయన భక్తిలో ఉండే పవర్ను దృష్టిలో పెట్టుకొని దేవుడిని చేశాం అని మనోజ్ పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మేము అనుకొన్న ప్రకారం హనుమంతుడికి రాసిన డైలాగ్స్లో తప్పేమీ లేదు. ఇది కావాలని కొంత మంది చేస్తున్న వివాదం మాత్రమే అని అన్నారు.

ఇదిలా ఉండగా, ఆదిపురుష్ రచయిత మనోజ్ ముంతాషిర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయనకు భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఆయన ప్రాణాలకు హాని ఉన్నందున ముంబై పోలీసులు ఆయన రక్షణగా నిలిచారు.


Click it and Unblock the Notifications











