రేవంత్ రెడ్డి నీవు దేవుడివి... రాజాసాబ్ టికెట్ రేట్ల పెంపుపై నెటిజన్ల రియాక్షన్!
రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది రాజాసాబ్ సినిమా ఫలితంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా తొలి ఆట తర్వాత ఊహించని టాక్ను సొంతం చేసుకొని ట్రెండింగ్లో నిలుస్తున్నది. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో తెలంగాణలో అసందిగ్ధత, రకరకాల విషయాలు వివాదాస్పదంగా మారాయి. టికెట్ రేట్ల పెంపు వ్యవహారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నడూలేని విధంగా చర్చకు దారి తీసింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత నెటిజన్ల నుంచి వస్తున్న అసంతృప్తి, అసహనం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. టికెట్ రేట్ల పెంపు, అలాగే సినిమా ఫలితం గురించి నెటిజన్ల అభిప్రాయాల్లోకి వెళితే..
తెలుగు రాష్ట్రాల్లో అగ్ర హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాలు రిలీజ్ సమయంలో టికెట్ రేట్ల పెంపు వ్యవహారం భారీ చర్చకు, వివాదానికి దారి తీస్తున్నది. అయితే పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన దుర్ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలు, స్పెషల్ ప్రీమియర్లు, టికెట్ రేట్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నది. ఏకంగా అసెంబ్లీలోనే టికెట్ రేట్లు పెంచేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తెగేసి చెప్పారు. అయితే ఆ తర్వాత కొన్ని పరిస్థితుల్లో టికెట్ రేట్లు పెంచడం వివాదంగా మారడం తెలిసిందే.

ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయ్యే సినిమాల టికెట్ రేట్ల పెంపు విషయంలో మరోసారి భారీ చర్చ జరిగింది. ది రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు లాంటి సినిమాల నిర్మాతలు హైకోర్టులో పిటిషన్ వేసి టికెట్ రేట్లు పెంపుకు అనుమతి ఇవ్వమని రిక్వెస్ట్ చేశారు. అయితే కోర్టు అనుమతి ఇచ్చినా.. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో కొంత అనాసక్తిని ప్రదర్శించింది. దాంతో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తారా? లేదా? టికెట్ రేట్లు పెంచుతారా? లేదా? అనే అనుమానాలు కొనసాగాయి. ఆన్లైన్ టికెటింగ్ ఫ్లాట్ఫామ్లో అర్ధరాత్రి వరకు కూడా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాకపోవడంతో సినీ అభిమానులు ఆందోళనకు, అసహనానికి గురయ్యారు.
అయితే టికెట్ రేట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. సింగిల్ థియేటర్లు, మల్టీప్లెక్స్లలో సాధారణ టికెట్ రేట్లకే రాజాసాబ్ సినిమా ప్రదర్శనకు అనుమతి ఇచ్చారు. దాంతో అర్ధరాత్రి తర్వాత స్పెషల్ షోలు రెగ్యులర్ ధరకే టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే రాజాసాబ్ టికెట్ రేటును సుమారుగా 1100 రూపాయలకుపైగా పెంచాలని నిర్మాతలు కోరారు. కానీ సాధారణ టికెట్ రేటుకు అంటే 300 రూపాయలకు ప్రీమియర్లు ఫిక్స్ చేశారు.
ది రాజాసాబ్ సినిమా ప్రీమియర్ షోల ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సినిమాలో ఏది వర్కవుట్ కాలేదు. వర్కవుట్ అయింది కేవలం టికెట్ ధర మాత్రమే. 300 రూపాయలకే సినిమా చూశాం అంటూ ప్రేక్షకులు అనడం సోషల్ మీడియాలో కనిపించింది. నెటిజన్లు పంచుకొంటున్న వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ ప్రేక్షకుడు మీడియాతో మాట్లాడుతూ.. ది రాజాసాబ్ టికెట్ రేట్ల పెంపు విషయంలో రేవంత్ రెడ్డి తీసుకొన్న నిర్ణయం సరైనదే. ఈ విషయంలో రేవంత్ రెడ్డి దేవుడు. భారీగా టికెట్ రేట్లు పెంచకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరైనదే అంటూ కామెంట్ చేస్తున్నారు.
ది రాజాసాబ్ ప్రీమియర్ల తర్వాత ప్రేక్షకుడు మాట్లాడుతూ.. నా అదృష్టం ఏమిటంటే? ప్రీమియర్లకు టికెట్ రేట్లు పెంచలేదు. థ్యాంక్యూ లవ్ యూ. టికెట్ రేట్లు పెంచకపోవడంపై ఇన్ని రోజులు రేవంత్ రెడ్డిని తిట్టుకొన్నాను. నీవు దేవుడివి. టికెట్ రేట్లు పెంచకుండా మంచి నిర్ణయం తీసుకొన్నావు అంటూ అన్నాడు. ప్రేక్షకులు, నెటిజన్ల రకరకాలుగా కామెంట్ చేస్తు ఈ సినిమాపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











