Krishnam Raju రాజకీయాల్లో రికార్డు విజయాలు.. కేంద్ర మంత్రిగా.. గోవధకు వ్యతిరేకంగా బిల్లులో కీలక పాత్ర ఏమిటంటే?
టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్యంతో హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో కన్నుమూశారు. ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి లోనైంది. సినీ, రాజకీయ రంగాలకు చేసిన ఆయన సేవలను స్మరించుకొంటూ అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. కృష్ణంరాజు లేని లోటును ఎవరూ పూడ్చలేరు అని నివాళులర్పిస్తున్నారు. ఇక కృష్ణం రాజు పొలిటిక్ కెరీర్ గురించిన వివరాల్లోకి వెళితే..

12, 13వ లోకసభకు రెబల్ స్టార్
1990 దశకం చివర్లో కృష్ణం రాజు రాజకీయాల్లోకి ప్రవేశించి క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరిన ఆయన 12, 13వ లోకసభకు ప్రాతినిథ్యం వహించారు. కాకినాడ, నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి ఆయన విజయం సాధించారు. ప్రధాని వాజ్పేయ్ నేతృత్వంలోని ఎన్టీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1999 నుంచి 2004 వరకు కేంద్ర విదేశాంగ స్టేట్ మినిస్టర్గా సేవలందించారు.

చిరంజీవితో అనుబంధంతో ప్రజారాజ్యంలోకి
మెగాస్టార్ చిరంజీవితో విడదీయలేని అనుబంధం ఉంది. ఇద్దరి జననం మొగల్తూరు కావడంతో వారి మధ్య ఆత్మీయ అనుబంధం చివరి వరకు కొనసాగంది. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కృష్ణంరాజు చేరారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి 2009లో రాజమండ్రి నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. అనంతరం మళ్లీ బీజేపీలో కొనసాగారు.

వాజ్ పేయ్ నుంచి మోదీ వరకు
బీజేపీలో అగ్ర నాయకత్వంతో కృష్ణంరాజుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాజ్ పేయ్ నుంచి నేటి నరేంద్రమోదీ, అమిత్ షా వరకు ఆయన రిలేషన్స్ను కొనసాగిస్తున్నారు. మోదీ, అమిత్ షాతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. పలుమార్లు మోదీతో సమావేశమయ్యారనే విషయం తెలిసిందే. బాహుబలి సినిమా సమయంలో మోదీని ప్రభాస్తో కలిసిన విషయం గమనార్హం.

కాకినాడ నుంచి భారీ విజయంతో
కృష్ణంరాజు తొలుత 1998లో 12వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పోటీ చేశారు. అనంతరం బీజేపీలో చేరిన ఆయన కాకినాడ నుంచి పోటీ చేసి రికార్డు స్థాయి ఓట్లతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో 165000 ఓట్ల భారీ మెజారిటీ విజయం సాధించారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖలో అడ్వజరీ కమిటీ సభ్యుడిగా, ఫైనాన్స్ కమిటీ మెంబర్గా, పరిశ్రమల శాఖలో సభ్యుడిగా పనిచేశారు.

కేంద్ర మంత్రిగా కృష్ణంరాజు
కృష్ణంరాజు 2000 సంవత్సరంలో కేంద్ర విదేశాంగ సహాయమంత్రిగా పదవిని చేపట్టారు. ఆ తర్వాత 2001లో కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. 2002లో కేంద్ర వినియోగదారులు వ్యవహారాల శాఖ మంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత బీజేపీతో తన అనుబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.

గోవధ వ్యతిరేక బిల్లు కోసం పోరాటం
కృష్ణంరాజు ఎన్టీఏ కేంద్ర ప్రభుత్వంలో చురుకుగా, క్రియాశీలకంగా పనిచేశారు. 2000 సంవత్సరంలో ఎంపీ హోదాలో యోగి ఆదిత్యానాథ్ ప్రవేశపెట్టిన గోవధ వ్యతిరేక బిల్లుపై ఆయన తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టారు. గోవధ సంరక్షణ, గోవధను వ్యతిరేకిస్తూ బిల్లును ఆమోదింప జేయడానికి కృషి చేశారు. కృష్ణం రాజు ప్రవేశపెట్టిన ఈ బిల్లును అప్పట్లో రెండు సభల్లో స్పీకర్లు ప్రవేశపెట్టారు


Click it and Unblock the Notifications











