బాహుబలి ఫ్లాప్ అయితే రాజమౌళి రోడ్డుపైకి.. ఆస్తి అమ్మకం పెట్టి.. ప్రభాస్ నోట భయంకర వాస్తవం
Baahubali: భారతీయ సినీ చరిత్రను మార్చేసిన సినిమా 'బాహుబలి'. బాహుబలి ఫ్రాంచైజీకి పదేళ్లు పూర్తైన సందర్భంగా 'బాహుబలి: ది టార్చ్బేరర్' డాక్యుమెంటరీ విడుదల చేసింది. ఈ నాలుగు భాగాల డాక్యుమెంటరీలో సినిమా నిర్మాణం వెనుక ఉన్న కష్టాలు, ఆర్థిక ఒత్తిడి, విడుదల రోజు ఎదురైన భయం, ఆ తర్వాత వచ్చిన అద్భుత విజయాన్ని మూవీ మేకర్స్ పంచుకున్నారు. ముఖ్యంగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి, కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ, హీరో ప్రభాస్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
'ఫ్లాప్ అయితే ఆ ఫ్లాట్ అమ్మేద్దామనుకున్నా..
డాక్యుమెంటరీలో రమా రాజమౌళి మాట్లాడుతూ విడుదల రోజు పరిస్థితులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. "సినిమా విడుదలైన తర్వాత చాలామంది 'మిక్స్డ్ టాక్ వచ్చింది' అంటుంటారు. కానీ మా వరకు మాత్రం పూర్తిగా నెగటివ్ టాక్ మాత్రమే వినిపించింది. మొదటి కొన్ని గంటలు చాలా భయంకరంగా గడిచాయి. అయితే రాజమౌళి గత సినిమాల్లో కూడా మొదట మిక్స్డ్ టాక్ వచ్చి తర్వాత బ్లాక్బస్టర్గా మారిన సందర్భాలు ఉన్నాయి. అదే నమ్మకంతో ఈసారి కూడా పరిస్థితి మారుతుందేమో అనుకున్నాం" అని చెప్పారు.

అయితే ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే ఏం చేయాలన్న ఆలోచన కూడా అప్పుడే వచ్చిందని రమా వెల్లడించారు. "ఇంత భారీ బడ్జెట్ను కవర్ చేసే స్థోమత మాకు లేదు. మణికొండలో ఒక చిన్న ఫ్లాట్ మాత్రమే ఉండేది. అవసరమైతే దాన్ని అమ్మేద్దామని అనుకున్నాం. ఆ ఫ్లాట్ అమ్మినా వచ్చిన డబ్బు ఈ నష్టానికి ఏమాత్రం సరిపోదని తెలిసినా... మా చేతిలో ఉన్నది అదే ఒక్కటే" అంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు.
'నాన్న నన్ను హగ్ చేసుకుని ఏడ్చారు'.. కార్తికేయ
రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ కూడా విడుదల రోజు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. "ఇంట్లో అందరూ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సోషల్ మీడియాలో చాలా నెగటివ్ పోస్టులు వస్తున్నాయి. కొన్ని ట్వీట్లు చదివిన తర్వాత నాకు కూడా ఏడుపొచ్చింది. థియేటర్కు వెళ్లే ముందు నాన్న కారిడార్లో ఒంటరిగా టెన్షన్తో నడుస్తున్నారు. ఒక్కసారిగా నా దగ్గరకు వచ్చి నన్ను హగ్ చేసుకుని ఏడ్చారు. ఆ క్షణం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను" అని కార్తికేయ చెప్పారు. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ ఆయన కూడా భావోద్వేగానికి గురయ్యారు.
'మా చాప్టర్ క్లోజ్ అయిపోయిందనుకున్నాం'
దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కూడా ఆ రోజును గుర్తు చేసుకుని తన మనసులోని బాధను బయటపెట్టారు. "విడుదలైన వెంటనే వచ్చిన నెగటివ్ టాక్ నన్ను పూర్తిగా కుంగదీసింది. ఆ సమయంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. మా స్నేహితుడు, డిస్ట్రిబ్యూటర్ సాయి దగ్గరకు ఇండస్ట్రీలోని చాలామంది నుంచి 'బాహుబలి ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్ అవుతుంది' అనే మెసేజ్లు వస్తున్నాయి. కానీ ఆ విషయం నాకు చెప్పలేదు." అన్నారు. "నేను మాత్రం అతనితో 'సెకండ్ పార్ట్ను ఎంత తక్కువ ఖర్చుతో పూర్తి చేస్తే మనం బయటపడగలమో చూద్దాం' అని మాట్లాడుతున్నాను. కానీ అప్పటి పరిస్థితి చూస్తే రెండో భాగం తీసే అవకాశం కూడా కనిపించలేదు. నిజంగా మా జీవితం అక్కడితో ముగిసిపోయిందని, మా చాప్టర్ క్లోజ్ అయిపోయిందని అనుకున్నాం" అంటూ రాజమౌళి ఎమోషనల్ అయ్యారు.
'రాజమౌళి గారు రోడ్డుపైకి వస్తారనుకున్నా': ప్రభాస్
ప్రభాస్ కూడా విడుదల రోజు తనలో కలిగిన భయాన్ని పంచుకున్నారు. "నెగటివ్ టాక్ చూసిన వెంటనే నాకు మొదట గుర్తొచ్చింది రాజమౌళి గారు, శోభు యార్లగడ్డ గారు, ప్రసాద్ దేవినేని గారే. ఇంత భారీ బడ్జెట్తో సినిమా తీయడం, దానికి సంబంధించిన వడ్డీలు, ఆర్థిక ఒత్తిడి గురించి నాకు తెలుసు. నిజంగానే వాళ్లు భారీ నష్టాల్లో పడిపోయి రోడ్డుపైకి వస్తారేమోనని భయపడ్డాను" అని ప్రభాస్ అన్నారు. అంతటి ఒత్తిడి మధ్య కూడా మూవీ యూనిట్ ధైర్యం కోల్పోకుండా నిలబడిందని ఆయన గుర్తు చేసుకున్నారు.
విడుదలైన మొదటి కొన్ని గంటల్లో తీవ్ర ఆందోళనకు గురైన 'బాహుబలి' టీం, తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుత స్పందన కొత్త ఊపిరి పోసింది. తొలి రోజు సాయంత్రం నుంచి సినిమా గురించి పాజిటివ్ మౌత్ టాక్ వేగంగా వ్యాపించింది. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించిన ఈ చిత్రం భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది. 'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి 2: ది కన్క్లూజన్' కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ. 2,400 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద చారిత్రాత్మక రికార్డులు సృష్టించింది. అంతేకాకుండా తెలుగు సినిమా మార్కెట్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి.


Click it and Unblock the Notifications





