5 ఏళ్లు దూల తీరింది..రాజమౌళిపై ప్రభాస్ సెటైర్.. ఈాసారి దొరికితే 10 ఏళ్లు అంటూ జక్కన కౌంటర్
తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి చరిత్రలో నిలిచిపోతారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి నేటి వరకు అపజయం ఎరుగని దర్శకుడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. సినిమా సినిమాకు టాలీవుడ్ పంథాను మారుస్తూ ఇప్పుడు భారతీయ చలన చిత్ర పరిశ్రమకు టార్చ్ బేరర్గా మారారు రాజమౌళి. మిగిలిన దర్శకుల మాదిరిగా ప్రయోగాల జోలికి పోకుండా తెలిసిన కథనే కొత్తగా ప్రజెంట్ చేయడం ఆయన స్టైల్. కమర్షియాలిటీకి, హీరోయిజానికి జక్కన్న సినిమాలు నిదర్శనంగా నిలుస్తాయి. ఆయన సినిమాల్లోని ప్రతి సీన్ ఓ క్లైమాక్స్లా ప్రేక్షకుడిని కుర్చీలో కుదురుగా కూర్చోనివ్వదు.
స్టూడెంట్ నెం 1, సింహాద్రి, ఛత్రపతి, సై, విక్రమార్కుడు వరకు రాజమౌళి వేరు.. మగధీర తర్వాతి నుంచి ఆయన రేంజ్ మారిపోయింది. ఇక ఈగతో భారతదేశం మొత్తం రాజమౌళి పేరు మారుమోగిపోయింది. బాహుబలిని రెండు భాగాలుగా, పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఓ ప్రాంతీయ సినిమాపై రూ.400 కోట్ల బడ్జెట్ పెట్టి రెండు భాగాలుగా , అది కూడా జానపదం తరహా సినిమా చూస్తే ఈరోజుల్లో ఎవరు చూస్తారు.. రాజమౌళి రిస్క్ తీసుకుంటున్నాడేమోనని కొందరు పెదవి విరిచారు కూడా . కానీ అక్కడున్నది జక్కన్న కదా. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే కాదు.. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా బాహుబలిని నిలబెట్టాడు.

సినిమా మేకింగ్, మార్కెటింగ్ స్ట్రాటజీతో రాజమౌళీ ఈ విజయాన్ని అందుకున్నారు. పాన్ ఇండియా కల్చర్ను భారతదేశానికి పరిచయం చేయగా.. ఇప్పుడు ఆయన వేసిన బాటలో ఎన్నో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తెరకెక్కి బీటౌన్లో సౌత్ జెండాను ఎగురవేస్తున్నాయి. ఒకానొక దశలో దక్షిణాది సినిమాల ముందు బాలీవుడ్ నిలబడలేకపోయింది. ఇదంతా రాజమౌళి వల్లనే అనేది ఎవరైనా అంగీకరించాల్సిందే. బాహుబలి తర్వాత జక్కన్న ఏం చేస్తాడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ.. మరో సంచలన ప్రకటన చేశారాయన.
దశాబ్ధాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉండే రెండు కుటుంబాల వారసులైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్లతో మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. అదే ఆర్ఆర్ఆర్. ఈ సినిమా దెబ్బకు ఏకంగా హాలీవుడ్ రేంజ్లో రాజమౌళి పేరు మారుమోగుతోంది. ఫిక్షనల్ పీరియాడికల్ మూవీగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ దాదాపు రూ.1200 కోట్ల వసూళ్లు సాధించింది. అంతేకాదు.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్స్ కేటగిరీలో ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ను అందుకుని భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా నిలిచింది. సినీ రంగానికి అందించిన సేవలకు గాను రాజమౌళిని భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. ప్రస్తుతం సూపర్స్టార్ మహేశ్ బాబుతో పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కించేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

అయితే రాజమౌళి విషయంలో వినిపించే మాట ఒకటుంది. ఆయనతో సినిమాకు కమిటైతే ఏ హీరో అయినా మూడు నాలుగేళ్ల సమయం జక్కన్నకే అంకితం చేయాలని, స్లోగా తీస్తాడని, పని రాక్షసుడని ఇండస్ట్రీలో అంటూ ఉంటారు. ఈ విషయంలో రాజమౌళిపై ఎన్నో మీమ్స్ , ఎన్నో సెటైర్లు. సినిమాను శిల్పంలా చెక్కుతాడని రాజమౌళిని ఎన్టీఆర్ జక్కన్న అని ముద్దుగా పిలుస్తుంటారు. తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమాలో రాజమౌళి తలుక్కున మెరిశారు.
తెరపై ఆయన కనిపించగానే ప్రేక్షకులు ఈలలు, కేకలతో మోత మోగించారు. బుజ్జిపై వెళ్తున్న ప్రభాస్ను రాజమౌళి వెంటాడుతూ ఉంటాడు. అప్పుడు ప్రభాస్.. అమ్మో ఈయనకు దొరికితే ఐదేళ్లు దూల తీర్చేస్తాడని కామెంట్ చేస్తాడు. దీనికి రాజమౌళి మళ్లీ దొరుకుతావ్ కదా ఈసారి పదేళ్లు దూల తీర్చేస్తానని సెటైర్ వేస్తాడు. ఈ క్లిప్ను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. బాహుబలి సిరీస్ కోసం ప్రభాస్ దాదాపు ఐదేళ్ల సమయం వెచ్చించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











