The Rajasaab: ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత నాకు లేదు.. ఆ వివాదంపై ప్రభాస్ డైరెక్టర్ క్లారిటీ..
The Rajasaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ది రాజాసాబ్ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ను మేకర్స్ ఇప్పటికే ప్రారంభించారు. ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్లో కనిపించనుండగా, ఈ సినిమాకు దర్శకుడు మారుతి తెరకెక్కించారు. ది రాజాసాబ్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న వేళ, దర్శకుడు మారుతి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదాలపై మారుతి స్వయంగా స్పందిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే?
'ది రాజాసాబ్' జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కానున్నది. మూవీ టీమ్ వరుస ఈవెంట్లు, ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో మారుతి చేసిన ఒక వ్యాఖ్య పెద్ద చర్చకు దారి తీసింది. ఆ వేడుకలో మాట్లాడుతూ.. 'ప్రభాస్ లాంటి మీడియం రేంజ్ హీరోని బాహుబలితో రాజమౌళి పాన్ ఇండియా స్టార్ చేశారు' అన్న మాటలు అభిమానుల్ని అసహనానికి గురి చేశాయి. ఈ వ్యాఖ్యలపై కొంతమంది తీవ్రంగా స్పందించారు. ఈ అంశంపై స్పందించిన మారుతి, అది పూర్తిగా మాట దొర్లడం వల్ల జరిగిన పొరపాటేనని స్పష్టం చేశారు.

'ఆ రోజు నేను చాలా ఎమోషనల్గా ఉన్నాను. ప్రభాస్ గురించి ఎంత గొప్పగా చెప్పాలనుకున్నానో, ఆ ఆరాటంలో తప్పుగా ఒక పదం వాడేశాను. అది నా తప్పే' అంటూ ఓపెన్గా అంగీకరించారు. ప్రభాస్ 'మిర్చి' సినిమా నాటికే సూపర్ స్టార్ అని, ఆ విషయాన్ని చెప్పాలనే క్రమంలోనే అలా మాట్లాడానని వివరించారు. అంతేకాదు, ప్రభాస్పై తన గౌరవాన్ని మరోసారి తెలియజేశారు. 'నా దృష్టిలో ప్రభాస్ గారు రాముడిలాంటివారు. ఆయన రాముడు అయితే, నేను హనుమంతుడిని. ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సింది. ఎమోషనల్ బ్రేక్డౌన్లో ఆ మాట వచ్చింది' అని చెప్పారు.
ఇక కాలర్ వివాదంపై కూడా మారుతి క్లారిటీ ఇచ్చారు. 'ది రాజాసాబ్' ఫస్ట్ సాంగ్ రిలీజ్ సందర్భంగా ఆయన చేసిన 'కాలర్ ఎగరేయడం ఎందుకు?' అన్న వ్యాఖ్యను కొందరు ఎన్టీఆర్ను ఉద్దేశించినట్లుగా భావించి ట్రోల్స్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆ వివాదంపై డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. 'ఎన్టీఆర్ గారిని తక్కువ చేసే ఉద్దేశం నాకు అసలు లేదు. నిజానికి ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత కూడా నాకు లేదు' అంటూ స్పష్టంగా చెప్పారు.
వాస్తవానికి ఆ రోజు మాట్లాడిన విషయం, ఎన్టీఆర్కు ఏమాత్రం సంబంధం లేదని, అనవసరంగా తన మాటలను వక్రీకరించారని మారుతి ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా అవమానించేలా ఉన్నాయంటే, అది ఉద్దేశపూర్వకంగా కాదని మరోసారి స్పష్టం చేశారు.
ఇలా 'ది రాజాసాబ్' ప్రమోషన్స్లో చోటుచేసుకున్న ఈ వివాదాలపై దర్శకుడు మారుతి పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఎమోషన్లో మాట దొర్లిందని అంగీకరిస్తూనే, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల పట్ల తనకున్న గౌరవాన్ని మరోసారి చాటుకున్నారు. ఇప్పుడు మారుతి క్లారిటీతో అయినా వివాదాలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో లేదో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











