The Raja Saab: ది రాజాసాబ్ ఫెయిల్యూర్... 3 నెలల తర్వాత మారుతి ఫస్ట్ రియాక్షన్
మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ది రాజాసాబ్ మూవీ డార్లింగ్ అభిమానులకు, సినీ ప్రేక్షకులకు పీడకలగా మారిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ నిర్మాతలకు భారీ నష్టాల్ని మిగిల్చింది. దీనిని ఏ మాత్రం జీర్ణించుకోలేని అభిమానులు దర్శకుడు మారుతిపై ట్రోలింగ్కు దిగారు. ఈ దెబ్బకు ఆయన ఇంటికే పరిమితమయ్యారు. బయట ఏ కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదు. అలాగే తన సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ను కూడా పంచుకోవడం లేదు. అలాంటిది దాదాపు 3 నెలల తర్వాత ది రాజాసాబ్ ఫెయిల్యూర్పై మారుతి స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..
జనవరి 9న ది రాజాసాబ్
దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, ఇషాన్ సక్సేనాలు సంయుక్తంగా ది రాజాసాబ్ మూవీని నిర్మించారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్లు ప్రభాస్ సరసన హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వహబ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేష్, సత్య, ప్రభాస్ శ్రీను, యోగి బాబు, సప్తగిరి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ది రాజాసాబ్కు కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్గా .. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్గా పనిచేశారు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్ అందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ది రాజాసాబ్ వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

200 కోట్లకు పైగా నష్టాలు
210 కోట్ల రూపాయల షేర్.. 420 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ టార్గెట్గా బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టిన ది రాజాసాబ్కు తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్ బయటకు వచ్చింది. ఆ వెంటనే మన శంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒకరాజు నుంచి గట్టిపోటీ ఎదురైంది. ఇండియాలో 146.4 కోట్ల రూపాయల నెట్.. 174.14 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్, ఓవర్సీస్లో 34.25 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్గా 208.39 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు సాక్నిక్ పేర్కొంది. ఏ ఏరియాలోనూ బ్రేక్ఈవెన్ కాకపోగా.. నిర్మాతలకు దాదాపు 200 కోట్లకు పైగా నష్టాలు వచ్చాయి.
మారుతిపై దారుణంగా ట్రోలింగ్
ఫిబ్రవరి 6వ తేదీ నుంచి తెలుగు సహా దక్షిణాది భాషల్లో... మార్చి 6వ తేదీ నుంచి హిందీలో ది రాజాసాబ్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఓటీటీలో రిలీజైన తర్వాత ఈ సినిమాలోని సీజీ వర్క్, స్క్రీన్ ప్లే, బాడీ డబుల్, గ్రాఫిక్స్లపై నెటిజన్లు మీమ్స్తో విరుచుకుపడ్డారు. దర్శకుడు మారుతిని ట్రోలింగ్ చేయడంతో పాటు ఆయన ఇంటి అడ్రస్కు క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్తో ఇబ్బందిపెట్టారు. మారుతి నివాసానికి జొమాటో, స్విగ్గి సహా ఫుడ్ డెలివరీ ఆర్డర్స్ పంపించడమే కాకుండా మెడికల్ షాప్ పరికరాల ఆర్డర్లు కూడా పెట్టారు. ఒక్కరోజులోనే ఏకంగా 100కు పైగా ఆర్డర్లు రావడంతో మారుతి నివసించే విల్లాస్కు చెందినవారు, సెక్యూరిటీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అభిమానుల ట్రోలింగ్ దెబ్బతో మారుతి పూర్తిగా సైలెంట్ అయ్యారు.
3 నెలల తర్వాత మారుతి ఫస్ట్ రియాక్షన్
మరోవైపు.. ది రాజాసాబ్ తర్వాత మారుతి ఎవరితో సినిమా చేయనున్నారు అనేది చర్చనీయాంశమైంది. వరుణ్ తేజ్, సాయిదుర్గాతేజ్, రామ్లలో ఒకరితో ఆయన సినిమా ఉండే అవకాశం ఉందని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా మారుతి పూర్తి చేసినట్లుగా ఫిలింనగర్ టాక్. గత కొన్ని నెలలుగా బయట కనిపించని మారుతి.. దాదాపు 3 నెలల తర్వాత రియాక్ట్ అయ్యాడు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు.
స్క్రిప్ట్ పూర్తి చేస్తున్నా
శ్రీరాముడికి పూజ చేసి పట్టుబట్టల్లో ఉన్న ఫోటోను షేర్ చేసిన మారుతి.. ప్రతి ఓటమి ఒక పాఠమే, నా తదుపరి సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్కి ఫైనల్ టచ్ ఇస్తున్నా. ఈ జర్నీలో నాకు మద్ధతుగా నిలిచిన మీడియా, ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ అందరినీ నేను ఎంతో గౌరవిస్తాను. మీ ప్రశంసలు పొందేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అంటూ మారుతి రాసుకొచ్చారు. అయితే తన తదుపరి సినిమాలో హీరో ఎవరు? అది ఎలాంటి ప్రాజెక్ట్ అన్న వివరాలను మాత్రం మారుతి వెల్లడించలేదు. ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications

















