ప్రభుదేవాను వదలిపెట్టను.. నయన్తో అఫైర్తో నా జీవితం నాశనం అంటూ భార్య ఆరోపణలు
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఎక్కడ చూసినా పెళ్లిళ్లు, ఎఫైర్స్, విడాకులు వంటి వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పలువురు స్టార్స్ తమ భార్యలకు విడాకులిచ్చి రెండో పెళ్లి , మూడో పెళ్లి చేసుకుంటున్నారు. అయితే స్టార్స్ .. మొదటి భార్య లేక భర్తలు తమ మాజీ జీవిత భాగస్వాములపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ మైఖేల్ జాక్సన్, స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన మొదటి భార్య రామ్లత్.
ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1973 ఏప్రిల్ 3న సుందర్ మాస్టర్కు మైసూర్లో జన్మించారు ప్రభుదేవా. చిన్న వయసులోనే శాస్త్రీయ నృత్యం , భరతనాట్యంలు నేర్చుకున్నారు. తమిళ చిత్రం మౌనరాగంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు ప్రభుదేవా. డ్యాన్సర్గా , కొరియోగ్రాఫర్గా, నటుడిగా తనదైన ముద్ర వేసిన ఆయన.. 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో దర్శకుడిగా మారారు.

తొలి చిత్రంతోనే బ్లాక్బస్టర్ కొట్టిన ప్రభుదేవా.. ఆ తర్వాత పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్, వాంటెడ్, రౌడీ రాథోడ్ , దబాంగ్ 3 తదితర చిత్రాలతో తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలను ఒక ఊపు ఊపారు. దర్శకుడిగానే కాకుండా దేవి, బోగన్, సమ్ టైమ్స్ చిత్రాలతో నిర్మాతగానూ తన మార్క్ చూపించారు ప్రభుదేవా. 50 ప్లస్లో కుర్రాళ్లను మించి తన శరీరాన్ని మెలికలు తిప్పుతూ ఎంతటి టఫ్ స్టెప్స్నైనా అలవోకగా వేస్తూ తనలో ఏమాత్రం ఫైర్ తగ్గలేదని నిరూపించుకున్నారు ప్రభు.
ఇండియన్ డ్యాన్స్కు ఐకాన్గా మారిన ప్రభుదేవాను స్పూర్తిగా తీసుకుని ఎంతోమంది యువత కొరియోగ్రాఫర్లుగా మారారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఇండస్ట్రీలలో టాప్ కొరియోగ్రాఫర్లుగా వెలుగొందుతున్న వారిలో చాలా మంది ప్రభుదేవా శిష్యులే. భారతీయ చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గాను ప్రభుదేవాను 2019లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డ్తో సత్కరించింది.
అయితే ప్రభుదేవా వ్యక్తిగత జీవితంలో మాత్రం కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. 1995లో రమాలత్ను ఆయన వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో ఒక బాబు కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. 15 ఏళ్ల వైవాహిక జీవితానికి తెరదించుతూ రామ్లత్కు ప్రభుదేవా విడాకులు ఇచ్చారు. స్టార్ హీరోయిన్ నయనతారతో ప్రేమలో పడిన ఆమె పెళ్లి వరకు వెళ్లారు. అయితే అనూహ్యంగా ఈ పెళ్లి రద్దు కావడం ఇండస్ట్రీని షాక్కు గురిచేసింది. ఆ సమయంలో ఆయన మొదటి భార్య రామ్లత్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
విడాకుల తర్వాత ఒంటరిగానే ఉన్న ప్రభుదేవా 2020లో హిమాని సింగ్ అనే వైద్యురాలిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమె ఇటీవల ఆడపిల్లకు జన్మనివ్వగా భార్యాబిడ్డలతో కలిసి ప్రభుదేవా.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే ఇటీవల రామ్లత్ ఓ ఇంటర్వ్యూలో ప్రభుదేవా గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. రెండో పెళ్లి జరిగినా సరే ఆయనను విడిచిపెట్టనని, ఇటీవల మా రెండో అబ్బాయి అద్భుతంగా డ్యాన్స్ చేయడంతో అంతా ఆశ్చర్యపోయారని ఆమె తెలిపింది.
హీరోగానూ బాబుకి అవకాశాలు వస్తున్నాయని, చిన్నవాడికి మాత్రం చదువుపై ఆసక్తి ఉందని రామ్లత్ చెప్పారు. నా నుంచి విడిపోయినా మా మధ్య ఎలాంటి గొడవలు లేవని నాకు, పిల్లలకు ఆయనే అండగా నిలిచారని .. ఎప్పటికీ ప్రభుదేవాను వదులుకోనని మాజీ భర్తపై అభిమానం చాటుకున్నారు రామ్లత్. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











