National Film Awards : ఫాల్కే స్వీకరించిన మిథున్ .. రిషబ్ శెట్టి, నిత్యామీనన్లకూ అవార్డ్స్ .. ఇంకా ఎవరెవరంట
భారతీయ చిత్ర పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్భవనలో ఘనంగా జరిగింది. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి అందిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 1 జనవరి 2022 నుంచి 31 డిసెంబర్ 2022 మధ్య సీబీఎఫ్సీ సర్టిఫై చేసిన ఫీచర్, నాన్ ఫీచర్ చిత్రాలకు ఈ పురస్కారాలను ప్రకటించారు. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అవార్డులను ప్రదానం చేశారు.
ఉత్తమ తెలుగు చిత్రానికి గాను కార్తీకేయ-2 ఎంపికవ్వగా దర్శకుడు చందూ మొండేటీ అవార్డును అందుకున్నారు. ఉత్తమ తమిళ చిత్రం కేటగీరిలో పొన్నియన్ సెల్వన్ పార్ట్ -1 ఎంపికవ్వగా ఈ చిత్ర దర్శకుడు, నిర్మాత మణిరత్నం రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఆయన పురస్కారం అందుకుంటుండగా సీనియర్ నటి ఖుష్బూ పైకి లేచి చప్పట్లతో హోరెత్తించారు. ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్ -2 ఎంపికవ్వగా నిర్మాత శైలజా విజయ్ పురస్కారాన్ని అందుకున్నారు.

కేజీఎఫ్-2 చిత్రానికి గాను బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ అవార్డును అన్బుమణి ఎంఎం అందుకున్నారు. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 చిత్రానికి గాను ఏఆర్ రెహ్మన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ పురస్కారాన్ని అందుకున్నారు. పొన్నియన్ సెల్వన్ పార్ట్ -1 చిత్రానికి గాను బెస్ట్ సినిమాటోగ్రాఫర్గా రవి వర్మన్ అవార్డ్ అందుకున్నారు. తిరుచిత్రంబలం అనే తమిళ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటిగా నిత్యామీనన్ పురస్కారాన్ని అందుకున్నారు. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఉత్తమ చిత్రంగా ఎంపికైన బ్రహ్మాస్త్ర పార్ట్ -1 శివకు గాను నిర్మాత కరణ్ జోహార్ పురస్కారాన్ని అందుకున్నారు. ఇదే చిత్రానికి గాను బెస్ట్ డైరెక్టర్గా అయాన్ ముఖర్జీ అవార్డ్ తీసుకున్నారు.
బెస్ట్ పాపులర్ ఫిల్మ్ కేటగిరీలో ఎంపికైన కన్నడ చిత్రం కాంతారాకు గాను నిర్మాత విజయ్ కిరంగదూర్ పురస్కారాన్ని అందుకున్నారు. ఇదే చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన రిషబ్ శెట్టి అవార్డ్ అందుకున్నారు. ఇక భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యున్నతమైనదిగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తి .. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను రాష్ట్రపతి శాలువాతో సత్కరించారు. అయితే అనారోగ్యంతో బాధపడుతూ చేతితో కట్టుతో ఉన్న మిథున్ చక్రవర్తి స్టేజ్ మీదకి వెళ్లడానికి ఇబ్బందిపడ్డారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మిథున్ అందుకుంటున్నప్పుడు ఆడిటోరియంలో ఉన్న ప్రముఖలంతా లేచి నిలబడ్డారు.

కాగా.. టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ .. బెస్ట్ కొరియోగ్రఫీ కేటగిరీలో అవార్డ్కు ఎంపికయ్యారు. అయితే ఆయన లైంగిక వేధింపుల కేసుతో పాటు పోక్సో కేసు నమోదై రిమాండ్లో ఉండటంతో నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెల్ కీలక ప్రకటన చేసింది. జానీ మాస్టర్కు ప్రకటించిన అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఆయన బెయిల్ రద్దు చేయాల్సిందిగా పోలీసులు ఇప్పటికే కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











