నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటన తర్వాత అలాంటి.. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలపై బన్నీ వాసు
జనసేన పార్టీని స్థాపించి పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన నాటి నుంచి ఆయనకు అభిమానులు , కుటుంబ సభ్యులు అండగా నిలుస్తూ వస్తున్నారు. తాజా ఏపీ ఎన్నికల్లో ఆయన గెలుపే ధ్యేయంగా మెగా ఫ్యామిలీ మొత్తం పిఠాపురంలో మకాం వేసింది. కానీ అల్లు అర్జున్ తీరు వివాదాస్పదమైంది. పవన్ కళ్యాణ్కు బద్ధ శత్రువైన వైఎస్ జగన్ పార్టీకి చెందిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తరపున ప్రచారం చేయడాన్ని మెగా, పవన్ ఫ్యాన్స్, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. పవన్ గెలిచిన తర్వాత మెగా కాంపౌండ్లో బన్నీ కానీ , అల్లు ఫ్యామిలీ మెంబర్స్ కానీ కనిపించలేదు. ఈ క్రమంలో నాగబాబు, సాయిథరమ్ తేజ్లు అల్లు అర్జున్పై తమ ఆగ్రహాన్ని నేరుగా చూపించారు. అయితే పెద్దలు కల్పించుకుని గొడవను చక్కదిద్దినట్లుగా ఫిలింనగర్లో ఊహాగానాలు వినిపించాయి.
ఎన్నికల్లో ఘన విజయంతో పాటు డిప్యూటీ సీఎంగా పాలనలోనూ భాగం కావడంతో పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధుమిత్రులకు గ్రాండ్ పార్టీ ఇచ్చారట. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీలోని అందరికీ ఆహ్వానం వెళ్లగా.. అల్లు ఫ్యామిలీకి ఏ ఇన్విటేషన్ వెళ్లలేదని ఫిలింనగర్ టాక్. ఈ సంగతి పక్కనబెడితే బన్నీ లేటెస్ట్ మూవీ పుష్ప - 2 వాయిదా పడటం అనేక అనుమానాలకు తావిచ్చింది. మెగా, పవన్ ఫ్యాన్స్కి భయపడే ఈ సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్కి మారిందని సోషల్ మీడియాలో చర్చ నడిచింది. అయితే పుష్ప-2 పోస్ట్పొన్ కావడం వెనుక ప్రస్తుతం రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయనుకోండి అది వేరే విషయం.

ఈ క్రమంలో రెండు ఫ్యామిలీలతో అత్యంత సన్నిహితంగా ఉండే నిర్మాత బన్నీ వాసు కీలక వ్యాఖ్యలు చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న ' ఆయ్ ' మూవీని జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర థీమ్ సాంగ్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్లో ఆయన మాట్లాడుతూ.. ఫ్యామిలీ అన్నాక కొన్ని అనుకోని పరిస్ధితులు వస్తాయన్నారు. మెగా ఫ్యామిలీని, అందులోని వ్యక్తులను 20 ఏళ్లుగా తాను చూస్తూనే ఉన్నానని బన్నీ వాసు తెలిపారు.
కుటుంబం ఎప్పుడూ కలిసుండాలని చిరంజీవి ఎప్పుడూ తాపత్రయపడుతుంటారని, ప్రతి ఏడాది కుటుంబం మొత్తాన్ని బెంగళూరుకు తీసుకెళ్లి సంక్రాంతి అక్కడే సెలబ్రేట్ చేస్తారని గుర్తుచేశారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదే అయినా ఫ్యామిలీ అంతా కలిసుండాలన్నదే చిరంజీవి అభిమతమని బన్నీ వాసు తెలిపారు. కుటుంబంలో పిల్లలంతా ఎదిగారు, వారికి పర్సనల్గా ఇష్టాయిష్టాలు ఉంటాయని.. ఏం జరిగినా కుటుంబం మొత్తం ఏకతాటిపైనే ఉందనే మెసేజ్ను జనాల్లోకి పంపాలని చిరంజీవి తపిస్తుంటారని ఆయన చెప్పారు.

కుటుంబంలోని వ్యక్తులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని, ఇదంతా తాత్కాలికమేనని .. మెగా ఫ్యామిలీలో ఏదో జరుగుతుందని అనుకోవడం తెలివైన నిర్ణయం కాదని బన్నీ వాసు వ్యాఖ్యానించారు. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి ఒకే ఒక్క సిచ్యూవేషన్ చాలు.. తాను కూడా ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నానని .. మెగా ఫ్యామిలీ ఎప్పుడూ బాగుండాలి, ఖచ్చితంగా బాగుంటుందని బన్నీ వాసు ఆకాంక్షించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి మెగా - అల్లు కుటుంబాల మధ్య ఏదో జరుగుతోందనేది మాత్రం బన్నీ వాసు మాటలే చెబుతాయని ఫిలింనగర్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.


Click it and Unblock the Notifications











