ఆ అమ్మాయి జానీ మాస్టర్ గొంతు కోసింది .. సంచలన విషయాలు బయటపెట్టిన స్టార్ ప్రొడ్యూసర్
స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపులు, అత్యాచారం, బెదిరింపు వంటి పలు సెక్షన్ల కింద ఆయను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఆయన ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఎలాగైనా కేసులోంచి బయటకు తీసుకురావాలని జానీ మాస్టర్ తరపు న్యాయవాదులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
తనపై అత్యాచారం చేశాడని, మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడంటూ జానీ మాస్టర్పై ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యవహారం కలకలం రేపింది . గోవాలోని ఓ లాడ్జిలో తలదాచుకున్న జానీ మాస్టర్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మాస్టర్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే కీలక విషయాలు బయటపడతాయని పోలీసులు యోచిస్తున్నారు. తద్వారా కేసులో చిక్కుముడులను విప్పి, దర్యాప్తును త్వరగా ఫినిష్ చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

జానీ మాస్టర్ వ్యవహారం వెలుగు చూసిన వెంటనే తెలుగు ఫిలిం ఛాంబర్ రంగంలోకి దిగి అన్ని రకాలుగా బాధితురాలికి సాయం చేస్తోంది. ఆమెకు ఓ స్టార్ హీరో కూడా వ్యక్తిగతంగా అండగా నిలిచారని, ఓ బడా ప్రొడక్షన్ కంపెనీలో ఆమె పనిచేస్తోందని ఛాంబర్ ప్రతినిధులు తెలిపారు. అటు బాధితురాలిపై జానీ మాస్టర్ భార్య ఆయేషా అలియాస్ సుమలత సైతం దాడికి చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే జానీ మాస్టర్ను కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారని సుమలత ఆరోపిస్తున్నారు. ఆయన చాలా మంచివారని, ఎంతో మందికి సాయం చేశారని ఆమె అంటున్నారు.
కాగా.. జానీ మాస్టర్ను నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలితో పాటు దర్యాప్తులో సేకరించిన పలు ఆధారాలను జానీ ముందు పెట్టి పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే చంచల్ గూడ జైలుకి వెళ్లిన నార్సింగ్ పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ విచారణలో ఆయన ఏం చెబుతారోనని టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. అయితే బెయిల్ విషయంలో జానీకి న్యాయస్థానం షాకిచ్చింది. ఆయన బెయిల్ పిటిషన్పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
జానీ మాస్టర్ అరెస్ట్ అయిన నాటి నుంచి పలువురు సినీ ప్రముఖులు తలో రకంగా స్పందించారు. వీరిలో కొందరు జానీకి సమర్ధిస్తే, మరికొందరు బాధితురాలికి బాసటగా నిలిచారు. తాజాగా ఈ కేసుపై ప్రముఖ నిర్మాత సీ కళ్యాణ్ స్పందించారు. తన కోసం జానీ ఎంతో చేశాడు, లైఫ్ను త్యాగం చేశాడని ఆ అమ్మాయి చెప్పిందని గుర్తుచేశారు. అలాంటి ఆ అమ్మాయి ఇవాళ జానీ మాస్టర్ గొంతు కోసేసిందని సీ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేప్ జరిగిందా , లేదా.. లేక ఆ అమ్మాయే చేయించుకుందా.. ఇద్దరు కలిసి దాచారా .. ఇవన్నీ త్వరలోనే ఖచ్చితంగా బయటికొస్తాయని సీ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై బాధితురాలు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











