Khaleja Re Release: ‘ఖలేజా’ను చంపేసింది మహేష్ ఫ్యాన్సే.. ఫుల్లుగా తాగి త్రివిక్రమ్ను అలా బూతులు తిట్టారు
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఖలేజా. ఈ చిత్రంలో అనుష్క శెట్టి, ప్రకాశ్ రాజ్, సునీల్, బ్రహ్మానందం, ఆలీ తదితరులు కీలక పాత్రలో నటించారు. కనకరత్న మూవీస్ బ్యానర్పై శింగనమల రమేశ్ నిర్మాతగా రూపొందిన ఈ సినిమాకు సీ కల్యాణ్, ఎస్ సత్య రామమూర్తి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. తాజాగా తెలుగు ఇండస్ట్రీలో నడుస్తున్న రీ రిలీజ్ ట్రెండ్లో భాగంగా ఈ సినిమా మే 30వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని విడుదలవుతున్నది. ఈ సినిమా కోసం హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో సీ కల్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..
ఖలేజా సినిమా 2010 సంవత్సరం అక్టోబర్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజైంది. ఈ సినిమాపై భారీ అంచనాలను కృష్ణ, మహేష్ బాబు అభిమానులు పెట్టుకొన్నారు. త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ కావడంతో గొప్పగా ఊహించుకొన్నారు. కానీ మహేష్ సినిమాలకు డిఫరెంట్ ఫార్మాట్లో సినిమా ఉండటంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. దాంతో ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది. కానీ ఆ తర్వాత ఈ సినిమా ఛీ కొట్టిన అభిమానులే నెత్తిన పెట్టుకొని ప్రశంసిస్తున్నారు అని సీ కల్యాణ్ తాజాగా సెన్సేషనల్గా కామెంట్ చేశారు.

ఖలేజా సినిమా ప్రీమియర్ను విజయవాడలో మిడ్నైట్ షోగా ప్రదర్శించాం. ఆ టైమ్లో మూవీని మహేష్ బాబు అభిమానులు చూడనీవ్వలేదు. సినిమాకు వెళ్లిన ఫ్యాన్స్ ఏదో ఊహించుకొని వెళ్లారు. కానీ సినిమా వారి అభిరుచికి భిన్నంగా ఉంది. మహేష్ బాబు కామెడీ చేయడం వాళ్లకు అర్ధం కాలేదు. వారికి నచ్చకపోవడంతో తూ తూ అంటూ ఛీకొట్టారు. తిట్టిన తిట్టూ తిట్టకుండా మమ్మల్ని దారుణంగా ట్రీట్ చేశారు అని ఖలేజా రిలీజ్ రోజు జరిగిన విషయాన్ని తాజాగా నిర్మాత సీ కల్యాణ్ అన్నారు.
వాస్తవానికి ఖలేజా సినిమా ప్రీమియర్ వేయనని మొండికేశాను. ఆ సమయంలో కృష్ణ గారు నాకు ఫోన్ చేసి.. ఏంటయ్యా.. ప్రీమియర్ షో వేయనని అంటున్నావట. విజయవాడలో షో వేయండి అంటూ నాతో బలవంతంగా షో వేయించారు. ఆ షో ముగిసిన తర్వాత మహేష్ బాబు అభిమానులు ఫుల్లుగా తాగి నాకు ఫోన్ చేసి బూతులు తిట్టారు. నీకు సినిమా తీయడం తెలుసా? అంటూ నన్ను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ను తిట్టారు అని సీ కల్యాణ్ ఆ విషయాన్ని గుర్తు చేశారు.
ఖలేజా సినిమా ప్రీమియర్ ముగిసిన తర్వాత మహేష్ బాబు అభిమానులే సినిమా చెత్తగా ఉందంటూ వాళ్లే మెసేజ్లు పంపారు. ఆ సినిమాను వాళ్లే సర్వనాశనం చేశారు. ఈ రోజు ఆ ఫ్యాన్సే ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సినిమా బిగ్ స్క్రీన్ మీద వస్తుంటే.. దానిని చూడటానికి ఆరాటపడుతున్నారు. ఈ సినిమాకు 14 సంవత్సరాల తర్వాత సక్సెస్ రావాలని రాసిపెట్టి ఉంది. ఖలేజా అప్పుడు ఫ్లాప్ కావడం వెనుక ఇది జరిగింది. ఈ సినిమా రీ రిలీజ్ తర్వాత మళ్లీ సక్సెస్ మీట్లో కలుస్తాను అని సీ కల్యాణ్ తెలిపారు.

ఖలేజా సినిమా రీ రిలీజ్ మే 30 తేదీన కానున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగా అనూహ్యమైన స్పందన బాక్సాఫీస్ వద్ద వస్తున్నది. ఈ సినిమా ఇప్పటికే సుమారుగా 5 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా రాబట్టింది. ఈ సినిమా రీ రిలీజ్ థియేట్రికల్ రన్లో 10 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు, నిర్మాతలు అంచనా వేస్తున్నారు. 32 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ సమయంలో సుమారుగా 24 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసుకోవడం తెలిసిందే.


Click it and Unblock the Notifications











