ఐటీ అధికారులకే ఆశ్చర్యం.. మా వద్ద ఎంత డబ్బు దొరికిందంటే? దిల్ రాజు వెల్లడి
తెలుగు సినిమా పరిశ్రమలో నాలుగు రోజులుగా సినీ ప్రముఖులపై, ప్రైవేట్ సంస్థలపై ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో దిల్ రాజుపై మీడియా క్యూరియాసిటీ ఎక్కువగానే చూపించింది. కాబట్టి ఏం జరిగిందనే విషయం గురించి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. లేకపోతే ఏదంటే అది రాసుకొంటారు. కాబట్టి నేను గత నాలుగు రోజులుగా జరిగిన విషయాలను వెల్లడించాలని మీడియా సమావేశం నిర్వహించాను అని దిల్ రాజు వెల్లడించారు. ఆయన చెప్పిన విషయాల్లోకి వెళితే..
ఇండస్ట్రీలోను, ప్రైవేట్ సంస్థలపై ఐడీ రైడ్స్ అనేవి చాలా సర్వసాధారణం. వ్యాపారం చేస్తున్నాం కాబట్టి అధికారులకు వివరాలు అడగడం వారి డ్యూటి. మా మీద గానీ.. వేరే వారిపైన దాడులు నిర్వహించారు. మా కుటుంబ మీద, మా ఆఫీస్ వద్ద సోదాలు జరిగాయి. మొదటి మూడు రోజులు సోదాలు నిర్వహించి.. ఎవరికి వారికి రిపోర్టు ఇచ్చారు. నాలుగో రోజు వారి సోదాలకు సంబంధించిన రిపోర్టును ఇచ్చారని దిల్ రాజు తెలిపారు.

అయితే ఇండస్ట్రీలోని ప్రముఖులు, నా సంస్థపై ఐటీ దాడులు జరిగిన సమయంలో లెక్కలేనంత డబ్బు దొరికింది? డాక్యుమెంట్లు లభించాయి? అని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ సోదాల్లో ఎక్కడా కూడా భారీగా డబ్బు దొరకలేదు. మా కుటుంబ మొత్తం నుంచి 20 లక్షల రూపాయలు (నా వద్ద 4 లక్షలు, శిరీష్ ఇంట్లో 5 లక్షలు, నా కూతురు ఇంట్లో 6 లక్షలు, ఆఫీస్లో 2 లక్షలు) సీజ్ చేసినట్టు అధికారులు తమ పంచనామాలో పేర్కొన్నారని దిల్ రాజు చెప్పారు. గత ఐదేళ్లలో మేము ఎక్కడ కూడా పెట్టుబడులు పెట్టినట్టు వివరాలు లేవని అధికారులు గుర్తించారు అని చెప్పారు.
సినిమా ప్రొడక్షన్లోను, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్లో ఉన్నాం కాబట్టి.. వాటి వివరాలు అడిగి తెలుసుకొన్నారు. వారు అడిగిన ప్రతీ విషయానికి మేము సమాచారం అందించాం. మేము ఇచ్చిన సమాచారం చూసి ఐటీ అధికారులు ఆశ్చర్యపోయారు. దిల్ రాజు వద్ద మేము ఏదో ఆశించి వచ్చాం. కానీ అలాంటిదేమీ లేదని తేల్చారు అని దిల్ రాజు తెలిపారు.

ఐటీ దాడుల సమయంలో మా అమ్మ ఆరోగ్యం క్షీణించింది. దగ్గు, జ్వరంతో బాధపడ్డారు. ఊపిరితిత్తుల్లో కొంత ఇన్ఫెక్షన్ వచ్చింది. రెండు రోజులు హాస్పిటల్లో ఉండి వచ్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగుంది. ఆమె వయసు 81 సంవత్సరాలు. ఆమె హెల్త్ గురించి రూమర్లు రాశారు. ఆమెకు గుండెపోటు వచ్చిందని చెప్పారు. కానీ అలాంటిదేమీ లేదు అని వివరణ ఇచ్చారు.
అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు రికార్డు లెవెల్స్లో కలెక్షన్ల పోస్టర్లు వేస్తున్నారు. దాని గురించి నేను వ్యక్తిగతంగా ఏమీ మాట్లాడలేను. ఇండస్ట్రీ తరఫున ఓ రోజు మీటింగ్ పెట్టి మాట్లాడుతాను. ఐటీ నిబంధనలకు లోబడి మాత్రమే మేము వ్యాపారం చేస్తున్నాం. గతంలో ఎప్పుడో ఓ సారి ఐటీ రైడ్స్ జరిగాయి. మళ్లీ ఇప్పుడు మాత్రమే జరిగాయి అని దిల్ రాజు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











