నా సినిమాల పైరసీ వెనుక వాళ్లే.. నిర్మాత నాగవంశీ షాకింగ్ కామెంట్స్
చిత్ర పరిశ్రమను నాశనం చేస్తోన్న అంశాల్లో పైరసీ ముఖ్యమైనది. గతంలో కొత్త సినిమాలు రిలీజైన వెంటనే బయట మార్కెట్లలో పైరసీ ప్రింట్లు రోడ్డు మీద కుప్పలు కుప్పలుగా దొరికేవి. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లేది. ఇప్పుడు ఆధునిక యుగంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో రావడంతో పైరసీ చేసే విధానం కూడా సరికొత్త పుంతలు తొక్కుతోంది. థియేటర్లో మార్నింగ్ షో ముగిసేసరికి హై క్వాలిటీతో కూడిన హెచ్డీ ప్రింట్లు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా పైరసీ ఎక్కడి నుంచి? ఎలా జరుగుతుందో? తెలియక దర్శక నిర్మాతలు తలపట్టుకుంటున్నారు.
లోకల్ ఛానెల్స్లో కొత్త సినిమాలు
గతంలో సినిమాలను పైరసీ చేసి దానిని బ్లాక్ మార్కెట్లో విక్రయించి భారీగా సొమ్ము చేసుకునే ముఠాలు హల్చల్ చేసేవి. అయితే ప్రస్తుతం తమ ప్రత్యర్ధి హీరోల సినిమాలు రిలీజ్ అయితే వాటిని దెబ్బ కొట్టడానికి సినిమాలను పైరసీ చేస్తూ కోట్లలో నష్టం కలిగిస్తున్నారు. ఓ పక్క థియేటర్లోకి సినిమా వచ్చి గంటలు గడవకముందే బస్సుల్లోనూ, లోకల్ ఛానెల్స్లోనూ యథేశ్చగా కొత్త సినిమాలు ప్రసారమవుతున్నాయి. గేమ్ ఛేంజర్ తదితర సినిమాల సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో టాలీవుడ్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. తమ సినిమాలు పైరసీ కావడంపై నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

పైరసీ బారినపడ్డ భారీ బడ్జెట్ చిత్రాలు
ఈ ఏడాది వేసవి కానుకగా నార్నె నితిన్ నటించిన మ్యాడ్ స్క్కేర్ సినిమా రిలీజైంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, ప్రియాంక జవాల్కార్ తదితరులు నటించారు. మార్చి 28న విడుదలైన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అన్ని వర్గాలను ఆకట్టుకుని భారీ కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ సినిమా పైరసీదారులకు చిక్కింది. రికార్డు కలెక్షన్స్ వస్తోన్న సమయంలో మ్యాడ్ స్క్వేర్ క్వాలిటీ ప్రింట్లు ఆన్లైన్లో చక్కర్లు కొట్టాయి. దీనిపై నిర్మాత నాగవంశీ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పైరసీపై నాగవంశీ వ్యాఖ్యలు
మా మ్యాడ్ స్క్వేర్ రిలీజైన తర్వాత ఓవర్సీస్ సెన్సార్ కోసం ఓ కాపీ ఇచ్చాం. ఓవర్సీస్లో కొన్ని దేశాల్లో సెన్సార్ కావాలి.. వాటికి సెన్సార్ కాపీ ఇచ్చాం. ఆ కాపీ ఆన్లైన్లో రిలీజైంది.. మేం ఈసారి ఐడెంటీఫై చేశాం. అక్కడి నుంచి ఏమైనా లీక్ అవుతుందోమోనని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు అందరికీ చెప్పాం.. అవన్నీ ఒకసారి ట్రాక్ చేయాలి. గేమ్ ఛేంజర్ సినిమా కూడా ఓవర్సీస్ సెన్సార్ కాపీ పైరసీలో రిలీజైంది. ఇవన్నీ ఒకసారి ట్రాక్ చేయాలి. ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో చూడాలి. రెండు సినిమాలు అబ్జర్వ్ చేశాం.. ఓవర్సీస్కి సెన్సార్ కాపీ ఇచ్చినప్పుడు ఇంకాస్త జాగ్రత్త పడాలి. ఆ డిస్ట్రిబ్యూటర్లు అందరితో మాట్లాడాలి.. థియేటర్ కాపీ లీకైనా ఏం చేయలేం, కానీ ఏం చేయాలనేది ఇప్పుడు చూడాలి అని నాగవంశీ అన్నారు.
పైరసీ ముఠాను పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు
సడెన్గా రెండు నెలల్లో పైరసీ పెరిగిపోయింది. మొన్న సికందర్ అయితే మరీ అన్యాయంగా ముందు రోజే ఆన్లైన్లో కాపీ వచ్చేసింది. దిల్రాజు గారితో, ఎఫ్డీసీతో కూర్చొని ఏదో ఒకటి చేయాలి. లేకపోతే ఈ డ్యామేజ్ భవిష్యత్తులో మరింత ఎక్కువ అవుతుంది. ఈటీవీ విన్ ఓటీటీ సంస్థ ఈ పైరసీని ఆపడానికి ఏదో చేశారట... వాళ్ల సినిమాలు పైరసీ చేయలేకపోతున్నారట. అదేంటో కనుక్కుని అలాంటిది ట్రై చేయాలని నాగవంశీ పేర్కొన్నారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో వైరల్ అవ్వగా.. ఆ తర్వాత కొద్దినెలలకే హైదరాబాద్ పోలీసులు పైరసీపై భారీ ఆపరేషన్ చేపట్టింది. నాలుగు నెలలు కష్టపడి పైరసీ గ్యాంగ్ను పట్టుకోవడం భారతీయ చిత్ర పరిశ్రమలోనే సంచలనం సృష్టించింది.


Click it and Unblock the Notifications











